Tuesday 30 December 2014

బుద్ధుడు -బౌద్ధ ధర్మం

హమ్మయ్య ఏడాది చివరి రోజు కూడా వృధా అవకుండా మంచి 
పుస్తకం దొరికింది . ''బుద్ధుడు - బౌద్ధ ధర్మం '' 
డాక్టర్ పానుగోటి కృష్ణా రెడ్డి గారి రచన . ముందు మాట లో 
 బుద్ధుడి గూర్చి అరటిపండు వలిచి పెట్టినంత 
సులభంగా ఉంది అని చూసి ,
అదెలా సాధ్యం అనుకున్నాను . 
కాని చదివిన తరువాత నిజమే అనుకున్నాను . 
అంతంత భారీ విషయాలు చక్కగా అర్ధం
 అయ్యేట్లు వ్రాసారు . ఇంకా చాలా పుస్తకాలలో మేము 
చెప్పినదే నిజం అన్నట్లు  వ్రాస్తూ ఉంటారు . 
కాని దీనిలో ఎక్కడ అయినా కొంత వివాదం ఉంటె 
అక్కడ క్లియర్ గా దీని మీద వివాదం 
ఉంది అనే విషయం కూడా ఇచ్చి ఉన్నారు . 
బుద్ధుడి మహాభినిష్క్రమణ గూర్చి , 
చివరలో తిన్న బిక్ష గురించి , బిక్షలో మాంసాహారం తినడం 
గురించి ...... అక్కడ ఉన్న సందేహాన్ని కూడా బ్రాకెట్లో ఉంచారు . 
పాటకుల విజ్ఞతను గౌరవించినట్లు ఉంది . 

''ఆత్మో దీపో భావ '' ఏదీ గుడ్డిగా నమ్మకుండా ఎవరికి వారు 
సద్విచారణ తో తమ దీపాన్ని వెలిగించుకోవాలి . 
''మార్పు అనేది అంతిమ సత్యం '' ఒక మనిషి తోనే ఈ సమాజం 
నడవదు . ఎవరు గొప్ప అని కాక ఏది మంచిది అని ధ్యానం తో 
ఉంటూ నడవాలి . తనకు తెలిసింది చెపుతున్నాను అంటాడే కాని 
తనను దేవునిగా పూజించమని ఎక్కడా చెప్పడు . 
''తృష్ణ అన్ని బాధలకు మూలం ''
నాకు ఇది ఇష్టం ,అది ఇష్టం అనుకొంటూ ఉంటాము . కాని కొద్ది 
రోజులకు మనకు అర్ధం అవుతుంది అది యెంత తీర్చుకున్నా అంతం 
అయ్యేది కాదు . సంతృప్తి తోనే అది మాయం అయ్యేది అని . 
ఇలాంటి భావన రావాలి అంటే '' విపశ్యన '' ధ్యానం తోనే 
సాధ్యం . నిజంగా నేను ఈ ''శ్వాస మీద ధ్యాస ''ధ్యానం నేర్చుకున్నప్పుడు 
ఎంతో  ఆశ్చర్య పడ్డాను . ఎంత హాయిగా ఉంది . గురువులు లేరు . 
 ఎవరైనా ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు .  మొదట కొంత ఆలోచనలు 
వచ్చినా ఇప్పుడు ఎంత హాయిగా ఆలోచన రహిత స్థితి కి సులభంగా 
వెళ్ళవచ్చు . 
ఇంకా కొన్ని బుద్ధుడి మాటలు 
''అప్రియమైన సత్యం చెప్పకూడదు అని చెపుతూ ఉంటారు కదా !
కాని బుద్ధుడు సత్యం అప్రియమైనదైనా సరే చెప్పాలి అంటాడు . 
సత్యం చెప్పకుండా తప్పులు సరిదిద్దడం సాధ్యం కాదు ''అంటారు . 
మామూలు మనుషులం కాసింత అటూ ఇటుగా ఉన్నా , 
ఎదుటి వారికి మంచి జరుగుతుంది అంటే కటువుగా ఉన్నా 
సత్యం చెప్పాల్సిందే . ఎవరు చెప్పినా ,ఏమి చేసినా అన్ని 
దారులు వెళ్ళాల్సింది సంఘం వైపే . సమాజ హితవు కు 
ఉపయోగపడని మనిషి జన్మ వృధా . అందుకే సంపాదించిన 
దానిలో కొంత ధర్మ కార్యాలకు ,అన్న దానానికి ఉపయోగించాలి . 
''సంఘం శరణం గచ్చామి '' 

మరి అన్నింటిలోకి ఇదే గొప్ప మతం అని ఎవరైనా చెపితే నమ్మకూడదు . 
ధ్యానం చేసుకుంటూ మనిషిగా ఏది మంచిదో అది చేయాలి . 
ఎందుకంటె ఏదో ఒక మతం లో ఇమిడినపుడు మన జ్ఞానానికి హద్దులు 
వచ్చేసినట్లే . హద్దులలో జ్ఞానం ఎప్పటికీ ఇమడదు . ఎన్నో 
విషయాలు చదివిన తరువాత , ఎన్నో అనుభవాలు పొందిన 
తరువాత మనిషికి తెలిసేది ఒక్కటే..... 
''తనకు తెలియనది ఎంతో  ఉందని ''

                    @@@@@@@@@@@@@ 
                





Thursday 11 December 2014

అయితే ఏమిటి పెద్ద !

''భూమి ఏమి చేస్తున్నావు ?''వంటింట్లో  భార్య 
చేస్తున్న వంటలోకి తొంగి చూస్తూ సుబ్బారావు .
విసుగ్గా మొహం పెట్టి కూరలో ఆలు ముక్కలు వేసి కలయ బెట్టి 
పక్కన ఉన్న చపాతి పిండి చిన్న ముద్దలుగా చేయసాగింది . 
పిల్లలిద్దరూ హాస్టల్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఇద్దరే . 
ఉదయం ఇద్దరు ఆఫీస్ హడావడిలో మాట్లాడుకోవడం కూడా పెద్దగా 
ఉండదు . కాసింత ఊసులాడుకొనే సమయం ఇదే . 
అటు తిరిగి చపాతీలు పాముతున్న భార్య మీదకు వంగి చూస్తూ మెల్లిగా 
భుజం మీద ముక్కు రాస్తూ ఉన్న తనని చూసి , 
ఇంక మొదలు మనసులోనే అనుకుంది . 
''మా అమ్మ మరీ ఇంత చిన్న చపాతీ లు చేయదు . అందుకే 
నీ చపాతీలు ఎన్ని తిన్నా కడుపు నిండదు . కొంచెం మా అమ్మ లాగా 
చెయ్యొచ్చు కదా !''

మెల్లిగా నడుం మీద వేసిన చేయి విసిరి కొట్టి కూర వైపు కోపం గా 
తిరిగి కలియబెట్టి కొంచెం మసాలా పౌడర్ వేసింది . 
''అబ్బ మా అమ్మ లాగా నూరిన మసాలా వేయవచ్చు కదా !
మా పిన్ని చపాతి లోకి కారెట్ కూర ,పచ్చి కొబ్బరితో కలిపి 
చేస్తుంది . ఎంత బాగుంటుందో . ఏమిటి దీనిలో బటానీలు వేసావా ?
అసలు తినాలని చేస్తావో ,తినకూడదని చేస్తావో అర్ధమే కాదు . 
అసలు ఇది చపాతీ లోకి బాగా ఉండదు చూడు ''విసుగ్గా చెప్పాడు . 
ఏమి తెలుసు మీకు కోపంగా మాట జారబోయి ,ఎందుకులే గొడవలు 
అని పెదవి కొరుక్కుంది అసహనంగా . పెనం మీద చపాతీ కాలుస్తూ 
ఉండే లోపల మనసు కూడా కోపం గా ఉడుకుతూ . 
పట్టించుకోకుండా వెళ్లి టి . వి లో న్యూస్ చూడసాగాడు . 


''ఛా ....... ఎలా విరిచేస్తారు వీళ్ళు ఉండే మనసును కూడా . 
ఎంత చేసినా తృప్తి ఉండదు . ఎవరు ఎవరితోనో పోలికలు ,
అసలు ఈ రోజు ఆఫీస్ లో ఎంత పని ,పక్కన కొలీగ్ సెలవు 
పెట్టడం తో నోట్స్ తయారు చేయడంలో  అన్నం కూడా తినకుండా 
పని చేసింది . రెండు సార్లు టీ  తప్పితే ఇప్పటివరకు ఏమి తినలేదు .  
అసలు ఓపిక లేకపోయినా ఫ్రెష్ బటానీలు ఈయనకు ఇష్టం అని 
మసాలాతో కొత్తగా కూర చేస్తే పొగడటం లేదు ,కాసింత మెచ్చుకోలు 
లేదు ,ఇంకా తినక ముందే బాగుండదు అని కామెంట్లు . 
భర్త అయితే ఏమిటి పెద్ద ?పనికి విలువ ఇవ్వనప్పుడు . 
తనతో ఇంటి బరువును మోస్తున్న భార్య కు కాసింత ప్రేమను 
పంచనపుడు ''మనసులో సుడి తిరిగుతున్న బాధ రెప్పలపై 
అశక్తత తడిగా ఊరుతూ ..... కొంగుతో తుడుచుకొని కాలిన చపాతి 
హాట్ బాక్స్ లో పెట్టి ,ఇంకో వైపు ఇంకో చపాతి పామి పెనం పై వేసి 
కూర కింద స్టవ్ ఆపేసి టేబుల్ మీద పెట్టింది . అటు తిరిగి చూస్తే 
న్యూస్ లో లీనమై పోయి చూస్తున్నాడు . 

విసురుగా వంటింట్లోకి వెళ్లి చేతిలోని ప్లేట్ సింక్ లోకి విసిరేసింది 
కోపం అణుచుకోలేక .  శబ్దానికి ఇటు తిరిగి మళ్ళా అటు తిరిగాడు . 
అన్నీ రెడీ అయితే పిలుస్తుంది కదా అని . 

అంత బాధ లోనూ అమ్మమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి భూమి కి . 
''మగవాడికి అసహనం ఎక్కువ . జీవిత చక్రం మీద ఘర్షణ పడకుండా 
కందెనలా మారి  ఆడవాళ్లే అణుకువ తో కాపురం దిద్దుకోవాలి తల్లి . 
పగలగొట్టుకుంటే అది ఎవరి కాపురం !నీదే కదా . నచ్చలేదు అని 
విడాకులు తీసుకున్నా ,తరువాత వచ్చేవాళ్ళు మగ వాళ్ళే . 
అణుకువే ఆడదానికి రక్ష గుర్తుంచుకో ''

''అవును అందరు ఆడదానికి అందరు అణకువ గురించి క్లాస్ లు 
చెప్పే వాళ్ళే, ఆడదానికి ఏమి బాధ కలుగుతుందో అర్ధం చేసుకోమని 
మగ వాళ్లకు చెప్పే వాళ్ళు ఉండరు . ఛీ ఈ లోకమే ఇంత '' 
కళ్ళ నీళ్ళు కనపడకుండా తుడుచుకుంటూ అన్నీ టేబుల్ మీద సర్దింది . 
మళ్ళా అవి కనపడినా బోలెడు తిట్లు తనకే ''మాటికి కుళాయి 
తిప్పెస్తావు ,నేను ఎంత బాగా చూసుకున్నా ''అని . 
చెప్పలేని బాధకి రూపం కన్నీళ్లు అని ,అది మా ఆశక్తతకి గుర్తు 
అని వీళ్ళు ఎందుకు తెలుసుకోరు . 

భార్య కోపం అర్ధం అయినట్లుగా ఉంది . గమ్మున ప్లేట్ లో చపాతీలు 
కూర పెట్టుకొని ,నువ్వు కూడా తిను భూమి అనకుండా గబగబ
తినేసి లేచి చేయి కడుక్కున్నాడు . అగ్ని పర్వతం కింద లావా ఉబుకుతుందని 
తెలిసినపుడు దానిలో తొంగి చూసే సాహసం సుబ్బారావు చేయడు .  

మెల్లిగా కూర మూత తీసి చూసింది . ఏముంది అక్కడ ఒక్క గరిటెడు 
కూర . బాగుందని మొత్తం తినేసాడు . ఈ పాటి దానికి ఏమి బాగుండదు 
చూడు అని ముందే కామెంట్లు . కొత్త కూరనా ?తిని చెపుతాను అని 
అంటే తనకు ఎంత సంతోషంగా ఉంటుంది . కావాలంటే తిన్న తరువాత 
ఈ రుచి నచ్చ లేదురా అంటే ,తనకు ఇష్టం లేనిది ఇంకెప్పుడూ 
చేయదు కదా . భార్య అలిసిపోయినపుడు తమ ప్రేమ వాళ్ళను సేద 
తీరుస్తుందని ఈ మగ వాళ్ళు ఎప్పటికి గ్రహిస్తారో !!

కూర లేకుండా తినలేక , బాధతో ఆకలి చచ్చిపోయి వెళ్లి పడుకుంది 
మౌనంగా . ఫోన్ మోగితే తీసి మాట్లాడుతున్నాడు . 
''ఆ అమ్మా బాగున్నాము ''
''అత్త గారు కాబోలు . ఇంకేమిటి ,పాపం రా నీకు ఆలు కూర 
ఇష్టం . తిని ఎన్ని రోజులు అయిందో నువ్వు పాపం . భూమి కి 
రాదు కదా . ''అంటూ ఉంటుంది కసి గా  అనుకొని మంచం 
చివరకి గోడ దగ్గరకి జరిగి వీపు ఇటు వైపు ఉంచి ముడుచుకు 
పడుకుంది . ఆకలి కంటే మనసులో బాధే ఎక్కువగా తలగడ
తడిసిపోతూ ఉంది . 
పక్కన పడుకున్న అలికిడి కి కూడా తిరగలేదు . 

మెల్లిగా పైన వేసిన చేయి గారంగా నిమురుతూ .... 
నిజంగా స్పర్శ చాలా విసుగ్గా  ఉంది . 
తోసేస్తుంటే ఆయన  బలం ముందు తన బలం ఎంత !
''చెప్పేది విను భూమి  ,అమ్మ ఏమందో తెలుసా ?''
చేతిని భూమి ని పైకి లేవకుండా అడ్డు ఉంచి అన్నాడు . 
విని తీరాల్సిందే అనే పంతం ఆ మొరటు బలం లో . 
ఎందుకు లొంగాలి మనసులోనే గింజుకుంటూ ఉంది ,లేవాలని 
ప్రయత్నం చేసినా వీలు కావడం లేదు . 

''చెప్పేది విను ''భూమి మొహం అంత దగ్గరగా చూస్తూ ఆగలేక ,
వినను అని పక్కకి తిప్పిన మొహం పైకి వంగి చెవి ని నిమిరి 
చెప్పాడు ''భూమి చాలా మంచిదిరా . ఆఫీస్ లో అంత పని 
ఉన్నా మళ్ళా వచ్చి వంట చేస్తుంది . నేను ఇంట్లో నే 
ఉంటూ ఒక్క వంట చేసిపెట్టడానికి ఎంత కష్టపడుతున్నాను. 
అలాంటిది తను ఆఫీస్ లో ,ఇంట్లో . ఎంత శక్తి కావాలో తెలుసా 
ఇంత పనికి . ఇంత పని ఎందుకు చేస్తారో తెలుసా ఆడవాళ్ళు !
కేవలం భర్త ప్రేమ కోసమే . నువ్వు తనకు ఇవ్వగల సహాయం 
ప్రేమేరా ,ఎప్పుడూ ఇతరులతో తనని పోల్చొద్దు . ఎవరి భార్య 
వాళ్లకు ఎక్కువ . ఇద్దరి లో ఉండే బలహీనతలు బట్టి ఒకరికొకరు 
ప్రేమతో సహాయం చేసుకోవాలి . భూమి ఏడిస్తే ఇంటికి మంచిది 
కాదు . భార్య నవ్వుతూ ఉంచగల మగ వాళ్ళే కాపురం సరిగా 
చేస్తున్నట్లు . అర్ధం అయ్యేట్లు చెపితే మాట వినని వాళ్ళు ఉండరు . 
కాకుంటే మీరు చెప్పేది విసుగుతో కాక ప్రేమతో ఉండాలి '' 
అని చెప్పింది . 

''అయితే ఏమిటి మీకెలాగు నా కూర నచ్చలేదు కదా ''
మెత్తబడినట్లు తెలీకుండా కోపం నటిస్తూ .  
''నచ్చక పోవడమా సూపర్ ఉంది తెలుసా !''చటుక్కున 
బుగ్గ పై చిన్న ముద్ర ............. ''ఇంత బాగుంది ''
చిలిపిగా చూస్తూ అన్నాడు . 
ఆకలి ఎటు పోయిందో ,మనసంతా సంతోషం తో నిండిపోయి 
చేతుల మధ్య ఒదిగిపోయింది . 
''అత్తగారు థాంక్యు . ఎంత సేపు భార్యా భర్త ల మద్య అహాలు 
రెచ్చగొట్టే వాళ్ళు కాదు ,మీలాగా మగ వాళ్లకు అర్ధం చేసుకొని 
ప్రేమతో గెలవమని చెప్పే వాళ్ళు ఉండాలి ''మనసులోనే కృతఙ్ఞతలు 
చెప్పుకుంది . 
                                  @@@@@@@@@@@@@@@@@@@ 
   

Tuesday 2 December 2014

ఇదొక లెక్కా ?(4)


( 1 ,2 ,3 parts link ikkada )
కాళేశ్వరం నుండి హనుమకొండ వెళ్ళే బస్ తిరుగు ప్రయాణం కోసం 
నేను ఈయన ,అమ్మ ,నాన్న ,పాపను ఎత్తుకొని ఎక్కాము . 
అమ్మా వాళ్ళు కొంత ముందు వెనుక సీట్స్ లో నేను ఈయన కూర్చొని ఉన్నాము . 
కిటికీ పక్కన నేనే కూర్చున్నాను . పాప కూడా మెల్లిగా తాతయ్య వాళ్ళను 
వదిలి నా వడిలోకి వచ్చేసింది . ఓపిక ఉన్నంత సేపు కిటికీ లో నుండి 
చూస్తూ చెట్టు నో పక్షి నో వచ్చినపుడల్లా నన్ను తట్టి చూపిస్తూ ,నవ్వుతూ 
ఉంది . ఆ చిన్న జుట్టే ఒక్క జడగా వేసాను .ముందు ఉండే వెంట్రుకలు గాలికి 
దాని మొహం మీద వాలుతూ ..... మెల్లిగా వేళ్ళతో వెనక్కి దువ్వుతూ 
ముద్దు మాటలు వింటూ ఉన్నాను . ఇంకా అవేమిటి అని ప్రశ్నించడం 
రాదు . చూసినదంతా మనకు కూడా తట్టి చూపిస్తుంది . పిల్లలకు వింత 
కానిది ఈ ప్రపంచం లో ఏమి ఉండదేమో !
మేము తప్ప అన్ని సీట్లలో సర్దుకున్న తెలంగాణా పల్లెతనం . కాళేశ్వరం 
చాలా లోపల ఉన్నట్లుంది ,ఇక్కడ కొంత కూడా పట్నం ఫాంట్స్ ,టీ షర్ట్స్ 
కనిపించడమే లేదు . ఆడవాళ్ళు శుబ్రంగా జడ వేసుకొని సంకలో చిన్న పిల్లలతోనో ,
పక్కన వేలు పట్టుకుని నడుస్తున్న పిల్లల తోనో ..... పిల్లలు కూడా 

నగ్నంగా నో ,అర్ధ నగ్నంగానో వంటి నిండా బట్టలు వేసుకున్నా అది 
గౌరవంగా ఉంది కాని ,డాబుసరిగా లేదు .పెద్దగా డబ్బు ఉన్న వాళ్ళు నాకు 
ఎక్కడా కనిపించలేదు . బహుశా అదంతా చిన్న పల్లెలున్న అడివి ప్రాంతం కాబోలు . 
మహా అయితే ఆడవాళ్ళ కాళ్ళకు గజ్జెలు , మెట్టెలు ,కొందరికి కమ్మలు ,బేసరి 
అంత కంటే విలువైన సొమ్ములు లేవు . చూస్తూ కూర్చున్నాను పల్లెను 
దగ్గరగా ఒక్కో సారి చెమట వాసన పల్లె ను స్పురింప చేస్తుంది . పల్లె 
ఎవరికైనా తల్లే కాకుంటే మరీ సౌకర్యాలు లేకుంటే బ్రతుకలేము . మినిమం 
అవసరాలు సరిపడా సౌకర్యం ఉంటె హాయిగానే బ్రతికెయ్యొచ్చు . ఇంత 
చిన్న పిల్లలకు కూడా ''చాయ్ తాగు ''అని త్రాగించేస్తారు . పిల్లలు చాయ్ 
తాగటం నాకు విచిత్రం . హార్లిక్స్ బూస్ట్ కదా త్రాగాలి . చాలా కొద్ది మంది 
బస్ ఆగినప్పుడల్లా ఎక్కుతోనో ,దిగుతూనో ''దిగుండ్రి ''అనే ఆదలింపులు . 
బహుశా వీళ్ళ స్థితి కి కారణం అవిద్య . విద్య ఎన్నో అద్భుతాలు చేస్తుంది . 
కాని ప్రభుత్వాలు ఎందుకో దాన్ని పెట్టుబడిగా కాక ,ఖర్చు గా లెక్క 
వేసుకొని స్కూల్స్ మూసేస్తూ ఉంటారు . ఇక్కడ కొంత మంది కొలీగ్స్ 
దగ్గర విన్నాను ''వీళ్ళకు ఎందుకు చదువులు ,అందరు గొప్పోళ్ళు 
అయితే ఇంకేంది ''(అంటే పదాలు గుర్తు లేవు కాని ఇలాంటి అభిప్రాయం 
కొంత మంది దగ్గర చూసాను . ఇది మిగతా ప్రాంతాలలో కూడా కొంత ఉండవచ్చు . 
ఇది మనిషి అహానికి సంబంధించిన ఆలోచనే కాని ప్రాంతీయం కాదు )
ఆలోచనల్లోనే కళ్ళు మూతలు పడిపోతున్నాయి . ఉదయం నుండి 
ప్రయాణం అలసట.  కిటికీ లోకనపడుతున్న అడవి అందాలు వైపు 
చూపు వెళ్ళటం లేదు . పాప ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది . 
తల ముందు సీట్ కి తగులుతుందేమో అని వడిలో అడ్డంగా పడుకో బెట్టుకొని 
దాని చెంప పొట్ట కు ఆనించుకున్నాను.  కాళ్ళు ఈయన వడిలో 
వేలాడుతుంటే మెల్లిగా చేతులతో సర్ది ఈయన చేతులు పాప 
కాళ్ళకు అడ్డంగా పెట్టుకున్నాడు ,పాప నిద్రకు ఇబ్బంది లేకుండా . 
నేను పాప ఇద్దరం మెల్లిగా నిద్రలోకి జారిపోయాము . కిటికీ 
లో నుండి వీచే చల్ల గాలి ఇద్దరికీ జోల పాడుతూ . 

ఉన్నట్లుండి 'సడన్ బ్రేక్ '. ఉలిక్కిపడి ముందు సీట్ కి పాప తల 
తగల పోతుంటే చేయి తల పైన అడ్డంగా పెట్టాను . సీట్ కి నా 
వెళ్ళు తగిలి అబ్బ అన్నాను . ఎందుకు ఆగింది బస్ మధ్యలో . 
కొంత మంది లేచి నిలబడి ముందుకు తొంగి చూస్తున్నారు . 
డ్రైవర్ కనపడలేదు . ఈయన ఆందోళనగా లేచి నిలబడ్డాడు  . 
నాన్న కి ఏమి అర్ధం అయినట్లు లేదు . కింద నిలబడిన పోలీస్ 
డ్రైవర్ కి ఏదో చెపుతున్నాడు . ''అందరు దిగుండ్రి ''
''ఏమైతాంది '' ''ఏమో ఎర్క లేదు ''
అందరు దిగుతూ ఉంటె బస్ అద్దాల్లో నుండి దూరంగా పోలీస్ లు . 
వాహనాలు వెళ్ళకుండా రోడ్ మీద అడ్డంగా తాడు కట్టి ఉన్నారు . 
అందరం దిగాము . అమ్మా నాన్నలు కూడా కంగారుగా ఉన్నారు . 
ఇప్పటికే మధ్యాహ్నం అయింది . మేము ఇంకా చాలా దూరం 
ప్రయాణం చేయాలి . రాత్రికి వాళ్లకి తిరుగు ప్రయాణం రిజర్వేషన్ . 
పోతే పోనీ అనుకోలేము . 
అసలు బస్ కేమైనా అయిందా !
''ఇంకో బస్ వస్తుందా ?''
''ఇంకోటి గాదు ఇంకైతే బస్ నడ్వయి ''
ఉండవా ?ఎందుకు ?ఎవరు ఏమి సమాధానం చెప్పడం లేదు . 
గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు . 
ఇంటికి ఎలా వెళ్ళేది ?అసలు ఏమి జరుగుంటుంది ?
                                                           (ఇంకా ఉంది )