Wednesday 12 February 2014

నేను అంటే ఏమిటో ?

''అమ్మా నేను ఒక్కదాన్నే రెండు గంటలు 
ప్రయాణం చేసి సి . టి . ఎస్ . జాబ్ డ్రైవ్ కి 
వెళ్లి వచ్చాను '' పాప ఫోన్ లో ఉత్సాహంగా 
చెపుతూ ఉంది . 
ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను . ఒక్కటే బెంగుళూరు లో ... 
వెళ్లి  వారం కాలేదు. కనీసం మాతో చెప్పలేదు . 

''నిన్ను ఒక్కటే ఎవరు పొమ్మన్నారు . మాకు చెప్పే పని 
లేదా ? ఫ్రెండ్స్ ఏమయ్యారు ?''కొంచెం కోపం ,భయం 
కలగలుపుకొని గట్టిగానే అడిగాను . 

''వాళ్ళు ఈ డ్రైవ్ ముందే చేసారు . నలుగురు అందుకే రాలేదు . 
ఇదంతా ఇక్కడ కామన్ . ఎంత మంది డ్రైవ్ కి వస్తారో తెలుసా ?''

''కనీసం సువర్ణ పిన్ని కి  చెప్పకూడదా ?అసలు వాళ్ళు ఉన్నారు 
అనే కదా పంపాను '' ఇంకా కోపం తగ్గలేదు నాకు . 

''అమ్మా వాళ్లకి మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నాను . నేను 
ఇలాగ ఒక్కదాన్నే ఫేస్ చేసినందుకు నువ్వు సంతోషిస్తావు  
అనుకున్నాను . ఈ జీవితం ఇలాగే ఉంటుంది . ఒక సారి 
సాఫ్ట్వేర్ ఎన్నుకుంటే దీనికి తగ్గట్లు ఈ నైపుణ్యాలు అన్నీ 
నేర్చుకోవాలి . లేదంటే ఈ దారి ఎన్నుకోకూడదు . 
జీవితాన్ని బట్టి ఒదిగి గెలవడమే నైపుణ్యం ''చెప్పింది . 

నిజమే ఇవన్నీ వాళ్ళు జీవితం లో సవాళ్లు ఎదుర్కున్నప్పుడల్లా 
నేను చెప్పి ధైర్యాన్ని నింపిన మాటలు . ఎలా మర్చిపోయాను 
 మాటలు . నేను  ఏమి  అయిపోతున్నాను . నా ధైర్యం 
ఎక్కడకు పోయింది ?

ఆడపిల్ల తల్లిని అనే భయం నాకెందుకు ఇప్పుడు ఇంత గట్టిగా 
ఎదురు అవుతుంది ?ఒక చదువుకొని ఉద్యోగం చేస్తున్న 
తల్లికి కూడా తన ఆడపిల్ల భద్రత విషయం లో ఈ సమాజం 
భరోసా ఇవ్వలేకపోతుందా ?హ్మ్ :(
మొన్న చాణుక్య ఒక విషయం షేర్ చేసాడు . 

''don't teach your girl how to dress 
teach your boy how to behave'' 

నిజంగా ఆడపిల్ల భద్రతా భయం తో సమాజం లో 
పిల్లల పెంపకం లో జెండర్ సమతుల్యతను 
దెబ్బ తీస్తున్నామా ?నా పిల్లలైనా చక్కగా 
పెరిగేటట్లు ప్రార్ధన చేస్తాను . సరే ఎంత మంది 
కోసం చేసినా అదే ప్రార్ధన కదా .... నాలాటి తల్లులకు 
పుట్టిన లక్షలాది పిల్లల మానసిక పెరుగుదల 
బాగుండాలి అని ఆ విశ్వ శక్తిని ప్రార్ధిస్తాను . 

''అచంచలమైన భారతీయ ఆత్మ  మా బిడ్డలందరి 
వెన్నెముకలు ద్రుడతరం చేయుగాక 

మానసిక కల్లోల్లాలు , పాశ్చాత్య పోకడలు అలలు 
వలె విరుచుకపడినా అమేయ మానసిక స్థిరత్వం తో 
ఒడ్డు  వలె నిలుతురుగాక    

వివేకానంద రాక్ లో  వెలిగిన చైతన్య జ్యోతి అందరి  
 హృదయాలనూ  వెలిగించుగాక 

ప్రకాశ కిరణాలుగా మారి వీరంతా ప్రపంచానికి 
వెలుగునిచ్చెదరు గాక ''

''అసతోమా సద్గమయా 
ప్రభూ వీరందరినీ నేను అంటే ఒక శరీరం కాదు 
అందరిలో ప్రతిపలిస్తున్న ఒక ఆత్మ 
అనే సత్యం వైపు నడిపించు ''

''తమసోమా జ్యొతిర్గమయా 
శరీర సుఖాలే పొందవలిసిన లక్ష్యము 
కాదు , విద్యా వివేక వినయాలతో 
నలుగురి కోసం బ్రతికినపుడే మనిషి 
బ్రతుకు కు పరమార్ధం 
అనే జ్ఞానాన్ని కలిగించు '' 

'' మృత్యోర్మా అమృతంగమయా 
తనలోని ఆత్మనే విశ్వమంత టి లో 
దర్శించినవాడు చనిపోయినా జీవం తో ఉండగలడను
జ్ఞానాన్ని ప్రసాదించు '' 

ఏమిటో ఈ మధ్య కధలు వ్రాయాలి అని తెగ అనిపించేస్తుంది . 
మొన్న తొమ్మి దో తేది  ఆదివారం ''ఉమా మహేశ్వర రావు '' 
గారి ''తొలి కధల'' మీద  ఆయనతో ''వాడ్రేవు వీర లక్ష్మి '' 
గారితో నెల్లూరు లోని ప్రభవ లో చంద్రా మేడం గారు 
''ఒక ఆత్మీయ ముచ్చట '' పెట్టారు . 
ఎలాగో కష్టపడి గొన్ని గంటల వెసులుబాటు తో 
అక్కడకు వెళ్లాను . ఎప్పుడో కనిపించే నన్ను 
నెల్లూరు రచయితలు అందరు చక్కగా రిసీవ్ 
చేసుకున్నారు . 
ఈ తొలి కధల ముచ్చట్ల లో భాగంగా అక్కడ చిన్న 
చర్చ వచ్చింది . ఆదేమిటి అంటే ''కధల్లో మాండలీకం 
వాడటం ఎందుకు ?'' 
''వాడకుంటే  బాగుంటుంది .ఎక్కువగా తప్పుడు మాటలు 
వస్తునాయి అని వీరలక్ష్మి గారి అభిప్రాయం '' 
నిజమే కాని ... నేను ఏమి చెప్పాను అంటే 
''కవిత అనే ప్రక్రియలో మనం మాండలికాన్ని దాచలేము . 
కధ అనే లైబ్రరీ లోనే దాన్ని మనం దాచుకోగలము . 
మాండలికం లో వ్రాసినపుడు అందరు మనది ఈ కధ 
అని భావిస్తారు '' అని చెప్పాను . 
మరి మీ అభిప్రాయాలు ఏమిటో మీరే ఆలోచించుకోండి . 

''తొలి కధలు '' మీద నా అభిప్రాయం ఈ సారి వ్రాస్తాను . 

ఇంటికి తిరిగి బస్ లో వస్తుంటే .... కొత్త పుస్తకం చేతిలో 
ఉంటె ఊరుకో బుద్ది కాదు . ''తొలి కధలు '' తీసి చూసాను . 
నా కొత్త సాహిత్య స్నేహితుడు ఉమా మహేశ్వర రావు 
గారు వ్రాసిన కామెంట్ చూసి ఆలోచనలో పడ్డాను . 
''కథలతో  జీవిస్తున్న శశి కళ  గారికి '' 
ఇంకో కొత్త ఐ . డి . నాకు . 

 పుట్టినప్పటి నుండి ఎన్ని గుర్తింపులు .... 
నాలోని ఒక్క నేను కు ఎన్ని విశేషణాలు.... 
ఇవన్నీ నేనేనా ? ఈ  రోజు ఉండే నేను మాత్రమె నేనా ?
లేక ఇవన్నీ కలిపిన నేను నేనా ?
ఏ నేను నేను ?
ఈ వాదం ముగిసేది కాదు .  తరిగేది కాదు .     


2 comments:

Krishna said...

Mee pedolunnare ma pillalini eppati ardham chesukoru

Karthik said...

Chaalaa chaalaa baagundi sasi gaaru:-):-)