Friday 8 March 2013

''రెప్పల వంతెన''కవితా సంకలనం సమీక్ష

కవి ''కెక్యుబ్ వర్మ గారి '' ''రెప్పల వంతెన''
కవితా సంకలనం పై నా సమీక్ష ఈ రోజు
పుస్తకం .నెట్ లో......
''కినిగే'' లో ఈ కాపీ కూడా దొరుకుతుంది

(రెప్పల వంతెన సమీక్ష పుస్తకం.నెట్ లో లింక్ ఇక్కడ )


వ్యాసకర్త: శశికళ వాయుగుండ్ల
*******
కళ్ళు తెరిస్తే లౌకికం ….కళ్ళు మూస్తే కనిపించేది అలౌకికం…మరి రెండింటి మధ్య వంతెన మన కనురెప్పలు. లౌకిక, అలౌకిక భావనా ప్రపంచాల మధ్య అక్షరాలకు
భావాలు అద్ది కూర్చిన వంతెన ఈ ”రెప్పల వంతెన” కవితా సంకలనం. కను రెప్పల వంతెన కింద…..ఉబికే కన్నీళ్ళను ఉగ్గ బట్టుకొని నెత్తురు చిమ్మిన ఎదను ప్రమిదను చేసి ఇలా మిగిలా….ఒక్కో అక్షరం వెనుక దాగిన ఆర్తి మనను ఎంతో సేపు గాడ సుషుప్తిలోనికి తీసుకు వెళ్లి ఒంటరిని చేస్తుంది.
కవిగానే కాక ఇక్కడ ”కెక్యూబ్ వర్మ”గారు (k.k.kumaara varma) మట్టి తనాన్ని,మనిషి తనాన్ని హత్తుకొని వేదనాభరిత రేఖల మధ్య విశ్రమించని మునిలా గోచరిస్తాడు.
”విధ్వంసం ఆవలి వైపు”లో// ఇపుడు నేను కవిత్వం రాయలేక పోతున్నాను…// అంటూ గుండెలపై టన్నుల కొద్దీ ఆలోచనల మనలోకి మోసుకోస్తారు.
”//మనసులోని వ్యాకులతను పారదోలి
వెలుగును నింపే వాక్యం కోసం ….
ఎద నిండా నిబ్బరం నింపే స్నేహితుని లాంటి వాక్యం కోసం //
ఇలాంటి వాక్యం కోసం ఎదురుచూసే వాళ్ళ నిరీక్షణ ఫలించేలా ఉంటుంది అక్షరాల గమనం.వాక్యాల కూర్పు.
నాన్న ను కోల్పోయిన శూన్యమే తన అక్షరాలలో ప్రతిఫలించే వేదన అని ముందుమాటలో వ్రాసి ఉన్నారు. ఇంకా తన తండ్రి ధారపోసిన తపోఫలితమే ఈ అక్షర ప్రవాహం అని వ్రాసిఉన్నారు.
”ఎప్పుడైనా నిన్ను నీవు వడిసెల రాయిని చేసి విసిరి చూసావా? అంటూ ఎప్పుడైనా నిన్ను నీవు డప్పుపై చర్మంగా మార్చి నకజనకరి నం దరువై చూసావా?అంటూ తన విరసం నేపధ్యాన్ని మన ముందు పరిచి రోషాన్నిరగిలిస్తారు? శ్రీకాకుళం జిల్లా విరసం కన్వీనర్ గా బాధ్యతలతో ముందుకు వెళుతున్నపుడు తనకు ఆత్మీయతను పంచి ముందుకు నడిపిన
మిత్రులను కోల్పోయిన వ్యధ అక్షరాలలో అంతర్లీనంగా తొంగి చూస్తుంది.
వస్తు వైవిధ్యం ఇంకా ఉంటె బాగుంటుందేమో అనిపించినా కొన్ని వాక్య నిర్మాణాలు మళ్ళీ మళ్ళీ కనిపించినా…. భావాల లోతు, కవితా ప్రవాహపు వడి మనను చాలా సేపు
నిశ్శబ్దపు దారుల వెంట నడిపిస్తాయి. అప్సర్ గారి మాటల్లో”అటూ ఇటూ ఊపిరాడనివ్వని రెండు పరస్పర భిన్నమైన పరిస్టితుల మధ్య వంతెన కట్టుకొని దాని మీద సహనంగా,నిబ్బరంగా నిలబడి కాలం తో కరచాలనం చేసే స్నేహపూరితమైన దృష్టి వర్మ సొంతం” వర్ధమాన కవులకు,సాహిత్య ప్రియులు సొంతం చేసుకోగల మంచి పుస్తకం.
వెల:80/-
ప్రతులకు :k.k.kumara varma
H.No.11-3-11,near K.P.M.High school
parvathipuram-535501
Vizianagaram dist
ph:9493436277
books available at WWW.kinige.com

No comments: