Thursday, 27 March 2014

కధా జగత్ లో నా కధ

నా చిన్న కధ  ''కధా జగత్ '' లో  

( devude yekkada? kadha link )



కధ అనేది ఒక అపురూపమైన ప్రక్రియగా దాని
ప్రభావం రెండు కోణాలలో నేను నా జీవితం లో చూసాను .
ఒకటి పాపగా మా అమ్మ దగ్గర వింటూ ....
రెండోది అమ్మగా మా పిల్లలకు చెపుతూ .

మొదటిది నా వ్యక్తిత్వాన్ని దృడంగా చేయడమే కాక
నా లోని విలువలు పెంచింది .

రెండోది మా పిల్లలను సరి అయిన దారిలో నడిపించి
మా బంధాన్ని బలపరిచింది .

అమ్మ చెప్పే వాటిల్లో ఏమి పెద్ద గొప్పగా ఉంటాయి !
కాని అది చెప్పింది వాళ్ళ అమ్మ అంతే ... అందుకే
వాళ్లకి అదంటే బోలెడు ఇష్టం .

నిద్ర లేవకపోయినా కధ ,పాలు తాగకపోయినా కధ
మొండికి వేస్తే కధ ,నిద్ర పోయేదానికి కధ .
నిజంగా ఈ కధ అనే ప్రక్రియ పిల్లలపై ఎంత
బలమైన ముద్ర వేస్తుందంటే .... అది లేకుంటే
నేను చాలా సార్లు పిల్లలని కొట్టాల్సి వచ్చేది .

కధ  సంస్కృతి ని మోసుకు పోయే వారధి
సమాజాన్ని చూపే అద్దం
ఆలోచన రేకెత్తించే ప్రశ్న
ఇలాటి మంచి కధలు లోకానికి అందించిన
ఎందరో మహానుభావులు .... అందరికి వందనాలు .


Thursday, 20 March 2014

కొంచెం కవిత్వపు టీ పార్టీ



మార్చ్ ఇరవై ఒకటి ''ప్రపంచ కవితా దినోత్సవం ''
అన్నారు . మరి ప్రపంచమే ఇది జరుపుకోనేటపుడు
కొందరికి ఈ రోజు ఇంకా ఇరవై తేది ఉంటె కొందరికి 
ఇరవై ఒకటి  వెలుగు విచ్చుకొని ఉంటుంది . 
ఈ రోజు పోస్ట్ వేసినా పర్లేదు అనుకోని వేస్తున్నాను . 
మనిషి హృదయం అక్షరాలుగా రాలాలి అనుకున్నప్పుడు 
తేదీ ల మబ్బులు కోసం ఎదురుచూడదు . అది స్వయంభువు . 
తనకు తాను మదినుండి జాలువారి ఇతరుల మదిని 
మురిపిస్తూ రగిలిస్తూ కదిలిస్తూ ఆలోచనల లో ముంచేస్తూ 
ఉప్పెనగా ఎగసిపోతుంది . 

చాలా మంది అడుగుతుంటారు ... కవిత్వం ఎలా వ్రాయాలి ?
అని . 
నాకు తెలిస్తే కదా చెప్పడానికి !
ఎక్కడో ఏదో జరుగుతుంది ,ఒక బాధో 
ఒక నవ్వో ,ఒక అన్యాయమో ,ఒక ఆవిష్కరణో
తటాలున హృదయం స్పందిస్తుంది ... 
ఏదో ఉద్విగ్నత మనసుని నిలవనీదు . 
అరచేయి కూడా కాగితం అయిపోతుంది . 
భావం అక్షరం అయి నిలిచిపోతుంది . 
సలహా కావాలి అంటే ఒకటి ఇవ్వగలను . 
చదువు .... నీకోసం ముందటి వాళ్ళు 
కోట్ల భావాలు అక్షరాలుగా  పేర్చి పుస్తకాలుగా 
శరీరాలను మార్చుకున్నారు . ఏమి ఆశించకుండా 
చదువు అంతే . ఆ భావాలుగా నువ్వు మారేటట్లు , 
ఆ శకలాలను తాకేటట్లు ... కవిత్వంగా నువ్వు 
బయటకు పొంగేదాకా చదువుతూనే ఉండు ,
ఆ అమృతపు ధార కలం నుండి జాలువారుతుంటే 
అమ్మ తొలి చూలు బిడ్డను చూసుకున్నంత తృప్తి . 
కవిత్వం అంటే అంతే . ఇంకేమి లేదు .  

ఫేస్ బుక్ గ్రూప్ ''కవి సంగమం '' లో నా కవిత 

   

          ఎందుకో మరి కవిత్వమై 


ఒక్కోసారి .... 
ఎందుకో తెలీదు 

తొలి కిరణపు ముందటి గాలినై 
నిద్ర మబ్బులో ఉన్న మొగ్గల్ని 
లేపుతుంటాను 

సంజె వెలుగుతో చేరి 
పక్షుల ముక్కులపై 
కువ కువలాడుతుంటాను 

నల్లమబ్బు నుండి జారే 
తొలి చినుకులా తుళ్లి 
అలలపై చేరి 
ఆటలాడుతుంటాను 

అవమానిత ఎద
 గాయపు మంటనై 
ఆగ్రహపు సెగలు 
కక్కుతుంటాను 

అబలల ఆక్రందనలు 
మోసుకు తిరిగే 
కన్నీటి చుక్కనై
నేలకు రాలుతుంటాను  

దైన్యాన్ని కప్పుకొని 
నాలోకే ఒదిగి 
మౌన తపస్వినిగా 
మారుతుంటాను

తలపులను విదిల్చి 
కలపు రెక్కలు కదిల్చి
అక్షరాలను 
వెదజల్లుతుంటాను   

అవధుల్లేని ఆకాశాన్ని తాకి 
నా హద్దులు మరిచి 
విశ్వానికి ఊపిరులు 
ఊదుతుంటాను 

నా ఉనికికి 
ప్రపంచానికి 
మధ్య రేఖ ను కానక 
నేనే అది 
అదే నేను అయిన 
విశ్వాత్మగా 
నిలిచిపోతుంటాను .... 
కవిత్వమై కదిలిపోతుంటాను .... 

ఒక్కోసారి .... 
ఎందుకో తెలీదు . 

Monday, 17 March 2014

కాలం మారిందంట ... ఏమి మారిందో

 ''ఈ రోజు నాయుడుపేట లో మహిళా దినోత్సవం 
యు . టి . ఎఫ్ వాళ్ళం బాగా చేస్తున్నాము . నువ్వు 
రారాదా ?''శ్రీవారి సజెషన్ ,మహిళా దినోత్సవ 
శుభాకాంక్షలు చెపుతూ . 
అయ్యో మా స్కూల్ లో ప్రీ ఫైనల్ జరుగుతున్నాయి . 
సెలవు పెట్టకూడదు ''అని .... 
''అయినా మేము మగాళ్లకంటే తక్కువే నంట కదా ,
మాకెందుకు లెండి ఇవన్నీ ''మనసులో మాట ఉంచుకొనే 
అలవాటే లేదు కాబట్టి గబుక్కున అనేసాను . 

అదీ కాక ఈ రోజు మా స్కూల్ లో పిల్లల చేత వివిధ 
రంగాలలో విజయం సాదించిన మహిళల గూర్చి వ్యాసాలు 
వ్రాయించి 'గోడ పత్రిక ' ప్రదర్శిస్తున్నాను . ఇంకా అందరి కంటే 
స్కూల్ కి ముందు వెళ్లి పిల్లలు నేను కలిసి స్కూల్ కి 
వచ్చే ఒక్కో మేడం కి చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలికి 
చాక్లెట్స్ ఇస్తూ విషస్ చెప్పేలా ప్లాన్ వేసి ఉన్నాను . 
అసలు అనుకోకుండా అలా విషస్ పొందేసరికి మేడమ్స్ 
మొహాలు వెలిగిపోయాయి . మాకెందుకు మేడం అని 
కొందరు పైకి మొహమాట పడ్డారు . 

''లేదు మీకు కాకుంటే ఎవరికి చెపుతారు పిల్లలు ... 
మీరు విద్య సాదించారు ,ఆర్ధిక స్వావలంభన సాదించారు , 
ఇంకా ఇంత మంది పిల్లలకు బోదిస్తూ సమాజ సేవ చేస్తున్నారు . 
పిల్లలకు జీవిత సార్ధకత ను గూర్చి మీకంటే లైవ్ ఎక్సాంపుల్ 
ఎవరున్నారు ''అని చెప్పాను . 

నిజంగా కొద్ది పాటి ప్రశంస కూడా దొరక్క అందరు ఎంత 
నిసృహ లోకి వెళుతున్నారు అంటే ,వాళ్ళ సామర్ధ్యాలను 
వాళ్ళే మర్చిపోతున్నారు . 
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆదివారం అల్లా సెలవు 
ఇవ్వకపోతే పోనీ .... కనీసం ఈ ఒక్క రోజు వాళ్ళు చేసిన 
పనుల్లో ఏదో ఒక మంచి పనికి మెచ్చుకోవచ్చు కదా !
వంట చేయవచ్చు కదా!తప్పు లకు  వెంటనే విమర్శించే 
మీరు, నాటకీయమే కావచ్చు ... మెచ్చుకోవడం ,లేదా 
విషస్ ,లేదా బహుమతి ఇవ్వడం ఎంత ఆనందంగా 
ఉంటుంది . మురిసిపోయి పళ్ళెం నిండా మురిపాలు వడ్డించరా   
ఏమిటి ?ఏమిటో కాలం మారిందంట . ఇంకా ఆడవాళ్ళను 
ఎలా సంతోషపెట్టాలో తెలీదు కాని పెద్ద . 

సరే పిలిచారు కదా అని పర్మిషన్ పెట్టి స్కూల్ నుండి 
స్కూటీ లో బయటకు వచ్చేసరికి ఎదురుగా ఒక గుంపు . 
చెన్నై హైవే మీద మా స్కూల్ దగ్గర డివైడర్ కట్ అవుతుంది . 
కారు ,రోడ్ దాటే స్కూటర్ డిష్యుం . మనిషి బోర్లా 
పడున్నాడు . ఎవరో 108 కి ఫోన్ చేస్తున్నారు . హమ్మయ్య 
అనుకోని ఏమి కాకూడదు అని ప్రార్ధించుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళే సరికి 
108 వస్తూ కనిపించింది . ఇదంటే నాకు భలే ఇష్టం . 
మనిషి బాగానే ఉన్నాడు . హమ్మయ్య . లేకుంటే ఇంక
రాత్రికి నిద్ర కష్టమే . ఎంత మంచి రోడ్స్ వేస్తే అన్ని ఆక్సిడెంట్ లు 
పెరుగుతున్నాయి . ప్రమాదానికి పేదా గొప్ప తేడా లేదు . 
ఏదో శాటిలైట్ ప్రపంచం అంట .... ప్రమాదం తరువాత మొదటి 
అరగంట ఎంతో విలువ అనితెలిసి కూడా ప్రాణాలు కాపాడుకోలేక పోతున్నాము , 
కాలం మారిందంట ఏమి మారిందో ?

మీటింగ్ కి వెళ్లాను . కొంత మంది ఆడవాళ్ళు వేదిక మీద . కాని 
కావలిసిన ఏర్పాట్లన్నీ చక్కగా స్వీట్ హాట్ తో సహా మగవాళ్ళే 
అందిస్తూ మీటింగ్ చక్కగా సాగటానికి సహకరిస్తున్నారు . 
వాళ్ళు యు . టి ఎఫ్ . వాళ్ళు చక్కగా చేయాలి అని చెప్పారు 
అంట . వెనుక మా వారు కూర్చొని ఉన్నారు లెండి . అందుకు అన్ని 
విషయాలు నాకు తెలిసాయి . 
రిటైర్డ్ ఎం . ఈ . ఓ సుశీల గారిని ,ఉత్తమ ఉపాధ్యాయురాలు బారతి 
గారిని నన్ను చక్కగా సన్మానించారు . అందరు మాట్లాడాల్సిందే అని 
ఒక హెచ్చరిక . విధి లేక చాలా మంది మాట్లాడారు . ఏమో అనుకున్నాను 
వీళ్ళు బయటకువచ్చి మాట్లాడారు కాని ఎంత చక్కటి కోణాలు 
టచ్ చేస్తూ మాట్లాడారో .... ఒక అందమైన  రంగుల హరివిల్లు 
జీవితాన్ని చూపిస్తూ ఆవిష్కరింప బడింది . 
సుశీల అన్నారు చదువుకొని ఉద్యోగం చేసేవాళ్ళు అన్నా కొంత 
మనసునివిశాలం చేసుకొని సమాజం గూర్చి ఆలోచించాలి అన్నారు . 
భారతి గారు తాను ఇక్కడకు బయలుదేరగానే వాళ్ళ భర్త 
ఎదురొచ్చిన సంగతి ''వంట చేసి ఎక్కడికైనా పొమ్మని ''విశాల 
హృదయం తో పర్మిషన్ ఇచ్చిన సంగతి ,శోభా రాణి గారు తను 
కస్తూరిబా డ్రాప్ అవుట్ స్కూల్ లో ఒకో సారి అక్కడే ఉండి  పల్లెలు తిరిగి 
పిల్లలను ఇప్పించిన సంగతి చెప్పి వాళ్ళ భర్త కు కృతజ్ఞతలు 
చెప్పారు . అనిత గారు అయితే తాను అందరికి ఈ మీటింగ్ కోసం 
ఫోన్లు చేసినా ఎవరూ రాలేదని బాధపడి మనకు వాళ్ళే వేదిక ఏర్పాటు 
చేసి మాట్లాడుకోమన్నా మనం ఇలా రాక పోతే మన సమస్యలు ఎలా 
పరిష్కారం అవుతాయి అని ప్రశ్నించారు . ఇంకా తను తన బాబు చేత 
కూడా అన్ని పనులు చేయిస్తాను అని ,చిన్నప్పటి  నుండి ఆడ మగ 
తేడా చూప్న్చాకూడదు అని చెప్పారు . 
ఇక వసంతమ్మ గారు పోయన సారి ఈ సారి సభ మేమే చేసుకుంటాము 
అన్నాము కాని వీలు కాలేదు . ఈసారి తప్పకుండా మా వేదిక మేమే 
చేసుకుంటాము అని చర్విత చరణపు హామీ ఇచ్చారు . 

ఇక నేను ''స్వేచ్చ కావాలనడం తప్పు కాదు . కాని దానిని సద్వినియోగం 
చేస్తేనే మన మీద గౌరవం తెచ్చుకోగలం . ముందు సభలకు హాజరు 
కావాలి . అపుడు సంఖ్యా బలమే చాల చట్టాలు తెచ్చు కోవడానికి 
ఉపయోగపడుతుంది'' అని చెప్పాను .

ఇంతా చేస్తే మీటింగ్ తరువాత వచ్చిన వాళ్లకి ''జ్యూస్ సెట్ ''ఇచ్చారు ,
అయినా కాని  చూద్దుము కదా .... ఆడవాళ్ళు అందరు ఇంటికి వెళ్లి పోయారు .
ఏమంటే వంట సగం లో వదిలి వచ్చారంట . 
హ్మ్ .... కాలం మారిందంట . ఏమి మారిందో ?
మనలో మాట ..... మహిళా దినోత్సవం అయిపోయి ఎన్ని రోజులు 
అయింది ?ఇప్పటి దాకా వ్రాసి ఇప్పటికి పోస్ట్ వేసాను అంటే ,
పనుల వల్లే కదా :))


Tuesday, 4 March 2014

''టెంపుల్ రన్ '' చూసారా ?

''టెంపుల్ రన్ '' చూసారా ?
హ్మ్ ... పిల్లలు ఇద్దరూ వాళ్ళ లాప్ టాప్ లు 
వాళ్ళు తీసుకొని ఎగిరి పోయాక,ఇంట్లో ఉండే 
డస్క్ టాప్ లో హార్డ్ డిస్క్ పోయే సరికి అధ్దో 
అప్పుడు చూసాను చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ 
వైపు ... అవసరమే అన్నిటికీ అమ్మ కదా !


సరే ఏ టెక్నాలజీ అయినా పిల్లలు నేర్పితేనే కదా 
అమ్మలకు తెలిసేది (కొన్ని సార్లు నాయనలకు కూడా )
వాళ్ళే కొన్ని ఆప్స్ డౌన్లోడ్ చేసిచ్చారు . పాటలు 
డౌన్లోడ్ చేసీమంటే పెద్ద పోజ్ .... ఇప్పుడు మా మేనల్లుడు 
అఖిల్ చక్కగా ప్లే స్టోర్ ఆప్ డౌన్లోడ్ చేసిచ్చాడు ,హ్యాపీ 
గా నెట్ అందుబాటులో ఉంటె పాటలు వినొచ్చు ,
డౌన్ లోడ్ చేసుకోవచ్చు . 

వీటితో పాటు ఇదిగో '''టెంపుల్ రన్ '' అనే గేం 
కూడా డౌన్లోడ్  చేసారు . మామూలుగా వాళ్ళు 
ముగ్గురూ యేవో ఆడుతుంటారు కాని నేను ఎపుడూ 
పెద్దగా ఆడను . సరే ఇదేమిటో చూద్దాము అని ఆడాను . 

సింపుల్ గా చెప్పాలంటే ఒక గుహ నుండి ఒక మనిషి 
పరిగెత్తుతూ బయటకు వస్తాడు . (టెంపుల్ ఎక్కడ ఉండబ్బా ?)
అతని వెనుక గబ్బిలాలు తరుముతూ వస్తూ 
ఉంటాయి . అతను ఒక పాత బ్రిడ్జ్ మీద పరిగెడుతూ 
ఉంటాడు . మధ్యలో బ్రిడ్జ్ తెగి పోయి  ఉంటె మనం దూకాలి . 
(అంటే మనిషి మనం ఎలా కదిలిస్తే అలా కదులుతాడు ,
ఒక రకంగా ఆ మనిషి మనమే ,మళ్ళా మనం కాదు . 
కాని మనమే కదిలిస్తాము . వాడు పడిపోతే మాత్రం 
మనకు దెబ్బలు తగలవు కదా ... ఏదో మొత్తానికి 
మనమే పరిగేత్తినట్లు ఉంటుంది )
ఇంకా అక్కడక్కడ  మర్రి చెట్టు వేళ్ళు అడ్డం వస్తూ ఉంటాయి . 
ఇంకా బ్రిడ్జ్ మలుపు దగ్గర మనం తిరుగక కుండా 
నేరుగా పోతే సముద్రం లో పడిపోతాము . 
అంటే పరిగెత్తే టపుడు బ్రిడ్జ్ ను చూసుకోవాలి . 
మర్రి వేళ్ళు వస్తే యెగిరి దూకాలి . మలుపు వస్తే 
తిరగాలి . వీటిలో ఏది తప్పుగా చేసినా మనిషి 
చనిపోతాడు . గేం ఓవర్ . ఎంత పరిగెత్తి తే అంత 
స్కోర్ . 
ఇంకా ఇలా పరిగెత్తేటపుడు మధ్యలో వచ్చిన కాయిన్స్ 
టచ్ చేస్తే బోలెడు స్కోర్ . మనలో మాట నాకింకా 
పరిగేత్తడమే సరిగా రాలేదు . ఇంకా కాయిన్స్ ఎక్కడ 
స్కోర్ చేసేది . కాపాడుకోవడం ,సంపాదించడం చేస్తూ 
వెనుక వచ్చే గబ్బిలాలకు దొరక్కుండా ఎంత సేపు 
ఆడితే అదీ ఆట . మధ్యలో ఎన్ని ఊహించనివి ఉన్నాయో !
చాలా స్కోర్ చేస్తే కొన్ని శక్తులు కూడా వస్తాయి . 

ఇదంతా సాఫ్ట్ వేర్ డిజైనింగ్ పుణ్యమే కదా . ఎన్ని 
ఆప్షన్స్ డిజైన్ చేస్తే అంత మజా !టెక్నాలజీ ఎంత గొప్పగా 
ఉంది అనుకున్నాను . 

ఇంతలో ఒకటి అనిపించింది . మనిషి జీవితం మాత్రం 
ఇంత కన్నా ఏ మాత్రం భిన్నంగా ఉంది . వెనుక 
తరిమే మృత్యువు కి దొరకకుండా ఎదురు దెబ్బలు 
తగలకుండా జాగ్రత్త పడుతూ .... మధ్యలో డబ్బులు 
సంపాదిస్తూ ... ఏదో స్కోర్ కోసం ఎప్పుడూ పరుగులే 
కదా !జీవితం నుండే ఆట వచ్చిందా ?
ఫిక్షన్ కూడా నాన్ ఫిక్షన్ నుండే  వచ్చిందా ?
ఏమో మరి మనిషి జీవితం మాత్రం నాకు ఎప్పటికీ 
అర్ధమే కావడం లేదు . 

Tuesday, 25 February 2014

హర హర మహాదేవ ... ఆశ్రిత మందారా

హర హర మహాదేవ ... ఆశ్రిత మందారా 
నాకు కృష్ణుడు అంటే  బోలెడు ఇష్టం . 
శివుడు అంటే బోలెడు గౌరవం . 
ఎందుకంటె ఇదిగో మా అమ్మమ్మ వాళ్ళ 
ఇంట్లో చిన్నప్పటి నుండి ఈ రామేశ్వరం ఫోటో 
చూస్తూ పెరిగాను . హాల్ లో వేలాడదీసిన 
ఊయల పై పెద్ద ఊపులు ఊగుతూ ఆ ఫోటో 
దగ్గర కు వెళ్ళినపుడు ఫోటో ఇంకా పరిశీలనగా 
చూసేదాన్ని . ఇప్పుడు ఈ ఫోటోలో సీతా రాములు 
ఒక జంట ,శివ పార్వతులు ఒక జంట . కాని నాకెందుకో 
శివ పార్వథులనె చూస్తూ ఉండేదాన్ని . 

ఆ కధ  కూడా తెలుసు .  

(my old post odugu yeduguthavu link )

అసలు పెళ్లి మంత్రాలు సంస్కృతం లో ఉండేసరికి 
వాటి విలువ చాలా మందికి తెలీడం లేదు . 
పెళ్లి కొడుకు చెపుతాడంట 
''సఖీ నీ ద్వారా పది మంది సంతానాన్ని ఇవ్వు . 
పదకుండో  బిడ్డగా నన్నే స్వీకరించు '' అని . 

భారత దేశం లో పెళ్లి ముఖ్యంగా ''గృహస్థ ఆశ్రమ ''
నిర్మాణానికి , పిల్లలను కానీ పితృ ఋణం 
తీర్చుకోవడానికి ఉద్దేశింప బడినది . దానికి 
భార్య చాలా ముఖ్యం . ఏదో లే ఒక ఒక మనిషి 
ఉంది అన్నట్లు కాకుండా ... నిజంగా భార్య ను 
ఎలా గౌరవించాలో ఇద్దరి సమతుల్యత లోనే 
జీవితం తృప్తి గా ఎలా సాగుతుందో ''అర్ధ నారీశ్వరుడి ''
గా శివుడు ఆచరించి చూపాడు . 
సమస్య లు వచ్చినపుడు నీదే తప్పు అంటే నీదే తప్పు 
అనుకోవడం కాకుండా ... అవతలి  ప్రేమతో 
వారి కోణం నుండి కూడా ఆలోచిస్తే ,భార్య ను 
తగు రీతిలో గౌరవించి ఒకరికి ఒకరు గా మాత్రమె 
కాదు .... ఒకరిలో ఒకరుగా జీవిస్తారు . 

''బ్రహ్మ కుమారీ '' లో చెపుతారు . శివుడు వేరు , 
  శంకరుడు వేరు . శంకరుడు కూడా ''శివ శక్తి ''
కోసం నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు అని . 

 అది నిజం . లింగోద్భవ కధలో నేల నుండి నింగికి 
ఎగిసి ఆది అంతాలు లేని ఒక శక్తి స్వరూపాన్ని 
ఆ రోజే శివరాత్రి అని ఒక కధనం . 

ఏది ఏమైనా పురుషుడు శ్రమ , స్త్రీ ప్రేమ శక్తి . 
శక్తి ని తనకు అనుగుణంగా ప్రేమతో మార్చుకొంటే 
వారి అనురాగ లయ విన్యాసాలకు పుడమి మొత్తం 
పులకరించి పచ్చల అందాలు అద్దుకుంటుంది . 
ప్రకృతి పురుషుల సంగమమే సృష్టి కి అస్తిత్వాన్ని 
అందిస్తుంది . 
దాని గూర్చి  పోస్ట్ ఇప్పుడు లింక్ ఇస్తున్నాను . 
చదివి ఆ ఆది దంపతుల ఆశీస్సులు పొందండి . 
   ''హర హర మహాదేవ శంబో  శంకర ''
                     @@@@@ 
(నిజానికి ఏమి పోస్ట్ వేయడానికి ఈ ''రాష్ట్ర విభజన ''
సమయం లో మనస్సు రాలేదు . చెప్పలేను కాని 
ఇక్కడ అందరి లో బయటకు రాని  ఏదో బాధ తో 
ఉన్నారు . కనీసం దుఖం రూపం లోనో లేదా 
కోపం రూపం లోనో లేదా నిరసనగా నో అది 
బయటకు రాకుండా  ఉండి ,ఒక రకమైన నిర్వేదం 
అందరిలో ఇక్కడ చూస్తున్నాను . 
రాజధాని కోసం పై వాళ్లు  ఏదో కొట్టుకుంటున్నారు ,
 స్వార్ధ పరులు  హడావడి చేసుకుంటున్నారు . 

కాని నిజంగా సామాన్యుడి కి తన జీతం గురించి 
పిల్లల చదువులు , కొలువుల గురించి  చెప్పలేని 
దిగులు .   దగ్గరకు తీస్తుంది అనుకున్న అమ్మ 
 వీపు మీద బాది రూం లో పడేస్తే మోకాళ్ళలో 
 పిల్లవాడు దిగులు . చేసేది లేదు . జీతాలు 
ఇబ్బంది  మాత్రం  దాని పై ఆధార పడిన 
వ్యాపారాలు అన్నీ కుదేలే .  ఏమీ  చేయలేము . 
కాలం  నడవడం తప్ప )

Tuesday, 18 February 2014

గొప్పలు ఎందుకు?

ముద్ద నోట్లో  పెట్టుకోగానే మొహం లో రంగులు మారిపోయాయి 
నరేష్ కి . ''ఛీ ఉప్పు'' అనుకోని పక్కన తింటూ ఉండే ఫ్రెండ్స్ 
వైపు చూసాడు మొహమాటంగా ఏమి అనుకుంటారో అని .... 
వాళ్ళకి  కూడా నచ్చకపోయినా మొహమాటానికి మౌనంగా 
తింటూ ఉన్నారు . కోపం తో భార్య వైపు చూసాడు . 

 కాపురానికి వచ్చి మూడు రోజులు అయింది . 
ఊరు కాని ఊరుకు వచ్చీ రాగానే 
''నువ్వు వంట బాగా చేస్తావు అని 

మీ అమ్మ వాళ్ళు   చెప్పారు . 
మా ఫ్రెండ్స్ అందరికి ఆ విషయం చెప్పాను . 
ఈ రోజు భోజనానికి పిలిచాను అని ''
పురమాయించే సరికి ఉదయం నుండి పది 
 మందికి ఒక్కటే అన్నీ సిద్ధం చేసింది . కొంచెం ఉప్పు ఎక్కువ 
అయినందుకు ఈ కోపం . 
కళ్ళ నీళ్ళు నింపుకుంటూ మౌనంగా 
లోపలి వెళ్ళింది . 

  వెనుకనే లోపలి కి వెళ్ళింది సరిత . ఓదార్పుగా చూస్తూ 
''పర్లేదులే రమా ,మరీ తినలేనంత ఉప్పు కాదు . పప్పు 
చాలా బాగుంది తెలుసా ?'' చెప్పింది ప్రేమగా . 

''లేదండి నాకు కొంచెం వంట వచ్చు కాని ఇంత మందికి 
ఎప్పుడూ చెయ్యలేదు . నేను నీ వంట గూర్చి గొప్పగా 
చెప్పాను నువ్వు సూపర్ గా చెయ్యాలి అని ఉదయం 
నుండి టెన్షన్ పెట్టారు . పొరపాటుగా ఉప్పు ఎక్కువ అయింది ''
బాధగా చెప్పింది . 

''పర్లేదులే నువ్వు మా నరేష్ భార్య వనే అభిమానంతో నిన్ను 
ప్రేమగా చూసుకుంటాము కాని నువ్వు వంట బాగా  చేస్తావనో 
కట్నం తెచ్చావు అనో  ఇంకోటో ఇంకోటో  గొప్పతో కాదు . 
అయినా అందరి  ముందు విసుక్కో కుండా భర్త గౌరవం 
కాపాడుతూ లోపలి వచ్చావు . ఈ సంస్కారం చాలదా 
నిన్ను గౌరవించడానికి ?ప్రేమించడానికి ?''
మెల్లిగా కళ్ళు తుడుచుకుంది రమ. 

''నువ్వేమి బాధ పడ వాకు నరేష్  ఏదో భార్య గొప్ప 
చెప్పాలి అని తెలీక చేసి ఉంటాడు . నేను చెపుతాలే . 
ఈ సారి వారం మా ఇంటికి రండి . నువ్వు  ఆ రోజు 
తొందరగా వచ్చి హెల్ప్ చెయ్యక పోతే ఉప్పే కాదు 
కారం కూడా ఎక్కువ వేసి కసి తీర్చుకుంటాను ''
నవ్వుతూ తమాషాగా చెప్పిన సరిత ను చూసి ఆపుకోలేక 
రామ కూడా నవ్వేసింది . 
''అదీ అలాగే నవ్వుతూ ఉండు ''చెప్పింది ప్రేమగా సరిత . 
తరువాత నరేష్ దగ్గరకు వెళ్ళింది . 

''సారీ సరిత మిమ్మల్ని భోజనానికి పిలిచి మంచి 
భోజనం పెట్టలేకపోయాను . ''చెప్పాడు కొంచెం బాధగా . 

''పర్లేదు నరేష్ తను ఆ మాత్రం చేయడం గొప్ప కదా . 
మేము ఏమి అనుకోవడం లేదు . 
నువ్వే ముందు ఎక్కువ చేసి చూసుకున్నావు . 
ఇప్పుడు బాధ పడుతున్నావు . నీకు రవి తెలుసు కదా ,
మా బంధువుల అబ్బాయి ''

''తెలుసు ఎల్ . కె. జీ నుండి ఫర్స్ట్ రాంకర్ కదా ,
మంచి జీనియస్ అని చెపుతుంటావు. ఇప్పుడు 
ఎంసెట్ కూడా బాగా వ్రాసి ఉంటాడు కదా ''
చెప్పాడు నరేష్ . 

''అవును జీనియస్ .... కాని ఇప్పుడు ఈ ప్రపంచం లో లేడు '' 

ఉలిక్కిపడ్డారు నరేష్ తో పాటు మిగిలిన మిత్రులు . 
అమాయకంగా ఎప్పుడూ పుస్తకాలు 
ముందు వేసుకొని చదువుకుంటూ 
ఉండే రవి మొహం గుర్తుకు వచ్చి అందరి కన్నులపై 
సన్నటి నీటి పొర . 

''ఏమైంది '' ఒకే సారి అన్నారు . తాము విన్నది 
తప్పు అయితే బాగుండును అనుకుంటూ . 

''ఏమవుతుంది ? ఎంసెట్ లో ఫస్ట్ రాంక్ రాదేమో అని 
రిజల్ట్స్ రాక ముందే దిగులుపడి ఆత్మహత్య 
చేసుకున్నాడు ''

సరిత కళ్ళ నుండే జాలువారే కన్నీరు రవితో తనకు 
ఉండే అనుభందాన్ని ఒక సారి తడుముకుంటూ ఉంది 
జ్ఞాపకాల నీడల్లోకి మసక వెలుతురు లాగా వెళ్లి . 

''ఆ అబ్బాయి దిగులుగా ఉండేది ఎవరు గమనించలేదా ?
 అయినా ఫస్ట్ రావాలి అని అంత పట్టుదల ఎందుకు ?''
బాధగా అడిగాడు నరేష్ ... పూయకుండా నేల రాలిపోయిన 
చిన్నారి మొగ్గ ను గుర్తు చేసుకుంటూ . 

''చిన్నప్పటి నుండి వాడి తెలివి కి అన్నీ ఫస్ట్ రాంక్స్ 
వచ్చేవి . ఇక వాళ్ళ పేరంట్స్ సంతోషం చెప్పలేము ... 
అడిగిన వాళ్లకు అడిగిన వాళ్లకు ఒకటే చెప్పడం వాడి రాంకుల 
గూర్చి . వాడిని ఒక షో పీస్ చేసేసరికి .... వాడికి 
అది అలవాటు అయిపోయింది . ఎప్పుడైనా రాదేమో అనిపిస్తే 
రాత్రి అంతా మేలుకొని చదివే వాడు . ఎలాగో సాదించేవాడు . 
అప్పటికీ వాళ్ళ నాన్నకు చెప్పేదాన్ని . ఎందుకు అలాగ 
అందరికి గొప్పలు చెప్పుకోవడం  వాడి పై అంత టెన్షన్ 
పెట్టొద్దు . వాడి ని లైఫ్ ని కూడా కొంత ఎంజాయ్ చేయనీయండి . 
చదువే జీవితం కాదు అని . 
కాని వాళ్ళ నాన్న వాడు నా కొడుకు సరిత సాధిస్తాడు చూడు 
అనేవాడు . ఇక వాడికి జీవితం లో ఎంత టెన్షన్ అయిన వాళ్ళే 
సృష్టించారో చూడండి . ఇప్పుడు పిల్లవాడే ప్రాణాలతో లేక 
పోయినాక ఆ ప్రాణం లేని రాంకులు ఏమి చేసుకుంటారు '' 

''ఇప్పుడు ఫస్ట్ రాకపోతే ఏమి కొంపలు మునిగి పోయాయి . 
దేవుడు ఏ రాత రాసుంటే ఆ తీరానికి చేరేంత మాత్రం 
కృషి చేస్తే చాలదా !పోయిన ప్రాణాలు తీసుకు రాగలరా ?
ఎవరు ఎంత సున్నితంగా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలుసు ?''
బాధగా అన్నాడు నరేష్ . 

''ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం తప్పు కాదా ?నువ్వు 
టెన్షన్ పెట్ట బట్టే కదా రమ ఉప్పు ఎక్కువ వేసింది . 
మళ్ళా నువ్వు తప్పు చేసి కోపం తన పైన చూపుతున్నావే ?''
నిలదీసింది సరిత . 

''సారీ రమ '' మనస్పూర్తిగా చెప్పాడు . 

''నువ్వే కాదు నరేష్ ,అందరు అలాగే ఉన్నారు . 
ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడమే . దాని వలన 
ఏమి జరుగుతుంది ?టెన్షన్ పెరగడం తప్ప . ... 
కారు గొప్ప చెప్పుకుంటే దానికి రిపేర్ వస్తే 
అవమానం ,ఆస్తి గొప్ప చెప్పుకుంటే నష్టాలు 
వస్తే అవమానం ,పెళ్లి గొప్పలు చెప్పుకుంటే 
ఎంగిలి ఆకులగానో ,వాడిపోయిన పువ్వులగానొ 
మారిన డబ్బులకు లక్షల్లో అప్పులు,వడ్డీలు  కట్టుకుంటూ
మనసులోనే కుములుతుంటారు . ఎక్కడో 
దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం . 
మన మెప్పు అవతలి వాళ్లకు ప్రోత్సాహంగా మాత్రమె 
ఉండాలి కాని ,గొప్పలతో  టెన్షన్ పడేలా ఉండొద్దు . 

గొప్పలు చూపిస్తేనే లోకం లో ఫ్రెండ్స్ ఉంటారు 
అనుకుంటే అటువంటి వాళ్ళు మనకు గొప్పలు 
లేనపుడు మిగలరు . అలాంటి వాళ్ళు వెళ్లి పోయినా 
బాధ పడక్కర్లేదు . మన వ్యక్తిత్వం తో అభిమానించేవాళ్ళు 
కొందరు ఉన్నా చాలు . 
అందుకే పెద్దలు చెప్పారు 
''గంగి గోవు పాలు గరిటడు అయినా చాలు '' 
నిజానికి అలాంటి మంచి వాళ్ళతో 
ఉన్నపుడే మన ప్రశాంతంగా ఉండగలం ''. ... చెప్పింది సరిత . 

అవునని ఒప్పుకున్నారు అందరు . 
                 @@@@@@   

Wednesday, 12 February 2014

నేను అంటే ఏమిటో ?

''అమ్మా నేను ఒక్కదాన్నే రెండు గంటలు 
ప్రయాణం చేసి సి . టి . ఎస్ . జాబ్ డ్రైవ్ కి 
వెళ్లి వచ్చాను '' పాప ఫోన్ లో ఉత్సాహంగా 
చెపుతూ ఉంది . 
ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను . ఒక్కటే బెంగుళూరు లో ... 
వెళ్లి  వారం కాలేదు. కనీసం మాతో చెప్పలేదు . 

''నిన్ను ఒక్కటే ఎవరు పొమ్మన్నారు . మాకు చెప్పే పని 
లేదా ? ఫ్రెండ్స్ ఏమయ్యారు ?''కొంచెం కోపం ,భయం 
కలగలుపుకొని గట్టిగానే అడిగాను . 

''వాళ్ళు ఈ డ్రైవ్ ముందే చేసారు . నలుగురు అందుకే రాలేదు . 
ఇదంతా ఇక్కడ కామన్ . ఎంత మంది డ్రైవ్ కి వస్తారో తెలుసా ?''

''కనీసం సువర్ణ పిన్ని కి  చెప్పకూడదా ?అసలు వాళ్ళు ఉన్నారు 
అనే కదా పంపాను '' ఇంకా కోపం తగ్గలేదు నాకు . 

''అమ్మా వాళ్లకి మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నాను . నేను 
ఇలాగ ఒక్కదాన్నే ఫేస్ చేసినందుకు నువ్వు సంతోషిస్తావు  
అనుకున్నాను . ఈ జీవితం ఇలాగే ఉంటుంది . ఒక సారి 
సాఫ్ట్వేర్ ఎన్నుకుంటే దీనికి తగ్గట్లు ఈ నైపుణ్యాలు అన్నీ 
నేర్చుకోవాలి . లేదంటే ఈ దారి ఎన్నుకోకూడదు . 
జీవితాన్ని బట్టి ఒదిగి గెలవడమే నైపుణ్యం ''చెప్పింది . 

నిజమే ఇవన్నీ వాళ్ళు జీవితం లో సవాళ్లు ఎదుర్కున్నప్పుడల్లా 
నేను చెప్పి ధైర్యాన్ని నింపిన మాటలు . ఎలా మర్చిపోయాను 
 మాటలు . నేను  ఏమి  అయిపోతున్నాను . నా ధైర్యం 
ఎక్కడకు పోయింది ?

ఆడపిల్ల తల్లిని అనే భయం నాకెందుకు ఇప్పుడు ఇంత గట్టిగా 
ఎదురు అవుతుంది ?ఒక చదువుకొని ఉద్యోగం చేస్తున్న 
తల్లికి కూడా తన ఆడపిల్ల భద్రత విషయం లో ఈ సమాజం 
భరోసా ఇవ్వలేకపోతుందా ?హ్మ్ :(
మొన్న చాణుక్య ఒక విషయం షేర్ చేసాడు . 

''don't teach your girl how to dress 
teach your boy how to behave'' 

నిజంగా ఆడపిల్ల భద్రతా భయం తో సమాజం లో 
పిల్లల పెంపకం లో జెండర్ సమతుల్యతను 
దెబ్బ తీస్తున్నామా ?నా పిల్లలైనా చక్కగా 
పెరిగేటట్లు ప్రార్ధన చేస్తాను . సరే ఎంత మంది 
కోసం చేసినా అదే ప్రార్ధన కదా .... నాలాటి తల్లులకు 
పుట్టిన లక్షలాది పిల్లల మానసిక పెరుగుదల 
బాగుండాలి అని ఆ విశ్వ శక్తిని ప్రార్ధిస్తాను . 

''అచంచలమైన భారతీయ ఆత్మ  మా బిడ్డలందరి 
వెన్నెముకలు ద్రుడతరం చేయుగాక 

మానసిక కల్లోల్లాలు , పాశ్చాత్య పోకడలు అలలు 
వలె విరుచుకపడినా అమేయ మానసిక స్థిరత్వం తో 
ఒడ్డు  వలె నిలుతురుగాక    

వివేకానంద రాక్ లో  వెలిగిన చైతన్య జ్యోతి అందరి  
 హృదయాలనూ  వెలిగించుగాక 

ప్రకాశ కిరణాలుగా మారి వీరంతా ప్రపంచానికి 
వెలుగునిచ్చెదరు గాక ''

''అసతోమా సద్గమయా 
ప్రభూ వీరందరినీ నేను అంటే ఒక శరీరం కాదు 
అందరిలో ప్రతిపలిస్తున్న ఒక ఆత్మ 
అనే సత్యం వైపు నడిపించు ''

''తమసోమా జ్యొతిర్గమయా 
శరీర సుఖాలే పొందవలిసిన లక్ష్యము 
కాదు , విద్యా వివేక వినయాలతో 
నలుగురి కోసం బ్రతికినపుడే మనిషి 
బ్రతుకు కు పరమార్ధం 
అనే జ్ఞానాన్ని కలిగించు '' 

'' మృత్యోర్మా అమృతంగమయా 
తనలోని ఆత్మనే విశ్వమంత టి లో 
దర్శించినవాడు చనిపోయినా జీవం తో ఉండగలడను
జ్ఞానాన్ని ప్రసాదించు '' 

ఏమిటో ఈ మధ్య కధలు వ్రాయాలి అని తెగ అనిపించేస్తుంది . 
మొన్న తొమ్మి దో తేది  ఆదివారం ''ఉమా మహేశ్వర రావు '' 
గారి ''తొలి కధల'' మీద  ఆయనతో ''వాడ్రేవు వీర లక్ష్మి '' 
గారితో నెల్లూరు లోని ప్రభవ లో చంద్రా మేడం గారు 
''ఒక ఆత్మీయ ముచ్చట '' పెట్టారు . 
ఎలాగో కష్టపడి గొన్ని గంటల వెసులుబాటు తో 
అక్కడకు వెళ్లాను . ఎప్పుడో కనిపించే నన్ను 
నెల్లూరు రచయితలు అందరు చక్కగా రిసీవ్ 
చేసుకున్నారు . 
ఈ తొలి కధల ముచ్చట్ల లో భాగంగా అక్కడ చిన్న 
చర్చ వచ్చింది . ఆదేమిటి అంటే ''కధల్లో మాండలీకం 
వాడటం ఎందుకు ?'' 
''వాడకుంటే  బాగుంటుంది .ఎక్కువగా తప్పుడు మాటలు 
వస్తునాయి అని వీరలక్ష్మి గారి అభిప్రాయం '' 
నిజమే కాని ... నేను ఏమి చెప్పాను అంటే 
''కవిత అనే ప్రక్రియలో మనం మాండలికాన్ని దాచలేము . 
కధ అనే లైబ్రరీ లోనే దాన్ని మనం దాచుకోగలము . 
మాండలికం లో వ్రాసినపుడు అందరు మనది ఈ కధ 
అని భావిస్తారు '' అని చెప్పాను . 
మరి మీ అభిప్రాయాలు ఏమిటో మీరే ఆలోచించుకోండి . 

''తొలి కధలు '' మీద నా అభిప్రాయం ఈ సారి వ్రాస్తాను . 

ఇంటికి తిరిగి బస్ లో వస్తుంటే .... కొత్త పుస్తకం చేతిలో 
ఉంటె ఊరుకో బుద్ది కాదు . ''తొలి కధలు '' తీసి చూసాను . 
నా కొత్త సాహిత్య స్నేహితుడు ఉమా మహేశ్వర రావు 
గారు వ్రాసిన కామెంట్ చూసి ఆలోచనలో పడ్డాను . 
''కథలతో  జీవిస్తున్న శశి కళ  గారికి '' 
ఇంకో కొత్త ఐ . డి . నాకు . 

 పుట్టినప్పటి నుండి ఎన్ని గుర్తింపులు .... 
నాలోని ఒక్క నేను కు ఎన్ని విశేషణాలు.... 
ఇవన్నీ నేనేనా ? ఈ  రోజు ఉండే నేను మాత్రమె నేనా ?
లేక ఇవన్నీ కలిపిన నేను నేనా ?
ఏ నేను నేను ?
ఈ వాదం ముగిసేది కాదు .  తరిగేది కాదు .