Saturday 27 June 2015

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

చదివే ముందు ఫాదర్స్ డే సందర్భంగా మాలిక వెబ్ మాగజైన్ 
లో నా కార్టూన్స్ చూడండి 
(cartoons link ikkada )

 ''మేడం ఆటో తెచ్చాను '' కింద నుండి డ్రైవర్ ఫోన్ . 
కిందకు వచ్చి ఆటో లో కూర్చోపోతూ చూసాను . ఈ మధ్య 
కొంచెం స్కూటీ లో పోలేక ఆటో లో వెళుతున్నాను స్కూల్  కి .
వేరే వాళ్ళు పెద్దగా ఎక్కరు ఆ రూట్ లో . సీట్ మీద బాటరీ ,మైక్ . 
పక్కన వాల్ పోస్టర్స్ . ముందు ఒక పెద్దాయన డ్రైవర్ పక్కన . 
అవన్నీ చూసేసరికి మా సినిమా హాల్ గుర్తుకు వచ్చింది . ఇంకా 
ఇలాగ ప్రచారం చేస్తున్నారా ! నేనింకా వాల్ పోస్టర్స్ వేసి వదిలేస్తున్నారు అనుకున్నాను . 
పిల్లలు అందరం మైక్ లో మాట్లాడాలి అని పోట్లాడే వాళ్ళం . 
''నేడే చూడండి .... మీ అభిమాన హీరో నటించిన .... క్రియేషన్స్ ... ''ఇలాగ 
హుషారుగా చెప్పాలి. పనులు చేసుకొనే వాళ్ళు కూడా ఒక 
నిముషం పని ఆపేసి బయటకు వచ్చి ఏ సినిమా అని బయటకు 
వచ్చి రిక్షా కి కట్టిన పోస్టర్ ఆసక్తిగా చూసేవాళ్ళు . ఒక్క సారి అవన్నీ 
గుర్తుకు వచ్చి హుషారు వచ్చింది . '' ఏ సినిమా ?'' అడిగాను . 
''కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ '' ఇద్దరు చెప్పారు . 
అరె ఇది రేపు రిలీజ్ అని  ముందు రోజు చూసానే !  
సుదీర్ బాబు ,నందిని బాగానే నటిస్తారు . అది కాదు ఖదీర్ బాబు 
మాటలు అని చూసి చూడాలి అనుకున్నాను . ఎలా ఉంటుందో 
చూద్దాము అని ,ఓనమాలు కూడా చూసాను . ఇది చూద్దాము . 
మెల్లిగా శ్రీవారి చెవిలో వేసాను . ఇక ఆయనకు తీరి ,నాకు వీలు 
కుదిరి ఎప్పుడైతే అప్పుడు . ప్రస్తుతానికి సరే అన్నారు . 

సినిమా తీసిన వాళ్ళు శిరీష శ్రీధర్ అంట . మంచి టేస్ట్ ఉంది . 
సినిమాకి మ్యూజిక్ పెద్ద హైలెట్ . పక్కన ఈయన మాత్రం అన్నీ 
కలలేనా అని వొంక పెడుతూనే ఉన్నారు . మరి జంట మధ్య ప్రేమ 
గౌరవంగా చూపిస్తూ ఉంటిరి . కల కాక ఇలలో ఎలా జరుగుద్ది !
కధకు వస్తే కృష్ణాపురం హై స్కూల్ లో చదివిన ఫ్రెండ్స్ 
''పూర్వ విద్యార్ధుల సమ్మేళనం '' నిర్వహించి ఎక్కడ ఎక్కడ ఉన్న 
ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు . రాధ ను కలవాలని తన ప్రేమను 
గెలుచుకోవాలి అని కృష్ణ లండన్ నుండి బయలుదేరి వస్తాడు . 

ఎనిమిదో తరగతి లో ప్రారంభం అయిన ప్రేమ ఇంటర్ లో 
ఒకసారి ,ఇంజినీరింగ్ లో ఒకసారి చెప్పాలి అనుకోని చెప్పలేకపోతాడు . 
మరి రాధ కు పెళ్లి అయి ఉంటుందా !ఉంటె వీళ్ళు కలుస్తారా !
చాలా డిగ్నిఫైడ్ గా తీసారు . హరి సంగీతం చాలా బాగుంది . 
మాటలు చక్కగా సన్నివేశం కి తగినట్లు ఉన్నాయి . ముఖ్యంగా 
ఇంటర్ కాలేజ్ ప్రిన్సపాల్ గా పోసాని మాటలు చాలా ఆలోచింప చేసేవి 
గా ఉన్నాయి . 
''ఒక్కో వయసులో ప్రేమకు ఒక్కో అర్ధం ఉంటుంది . దానితో పాటు 
అమ్మాయి మారిపోతూ ఉంటుంది '' అని . మేము కూడా 
టీనేజ్ పిల్లలకి ఇలాగే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము . విన్న వాళ్ళు 
జీవితం లో మంచి జాబ్స్ లోనే ఉన్నారు . 
ఇంకా చివరి మీటింగ్ లో కృష్ణ మాటలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి . 
''చెదిరిన అక్షరం లాంటి నన్ను 
అర్ధవంతమైన వాక్యం చేసావు ..... ''కవిత చాలా బాగుంది . 

ఇంకా రాధ కృష్ణ ను ఇన్సపైర్ చేయడానికి ''టార్గెట్ 3 బిలియన్ '
అబ్దుల్ కలాం గారి బుక్ ఇవ్వడం నాకు నచ్చింది . 
కుటుంభం తో కలిసి ఏ సందేహం లేకుండా వెళ్ళగలిగిన సినిమా . 
                         @@@@@@@@@@@@

Monday 15 June 2015

ఆయన జీవనమే మానవత్వపు వేదం

ఆయన జీవనమే మానవత్వపు వేదం 
ఎవరి గురించి వ్రాస్తున్నాను ,ఇంత లేట్ గా వ్రాయడం ఏమి 
బాగుంటుంది !ఏమి కాదులే పెద్దాయన నేను తలుచుకున్నాను అని 
సంతోషపడతారు . చదవరుల సంతోషమే రచయితల సంతోషం :)

ఈ లోపల మాలిక వెబ్ మాగజైన్ లో నా కధ ''స్పేస్ షిప్ '' చదివి రండి . 
sapace ship link in malika magzine

ఆయన పేరు ''దాశరధి రంగాచార్యులు ''గారు ,ఆయన పుట్టినది 
తెలంగాణా లోని చిన్న గూడూరు లో . వారి అన్నగారు కృష్ణమాచార్యులు 
గారు కవి అయినప్పటికీ ఈయన వచన రచన లోనే ప్రసిద్ధులు . 
తెలంగాణా మాండలీకం లో ఈయన వ్రాసిన చిల్లర దేవుళ్ళు ,నాటి 
నైజాం పాలన లో ప్రజల కష్టాలను తెలియచేస్తుంది . 

ఇలాగే వ్రాయాలి కదా !

కాని ఏమిటో ఆయన నాకు ఏ అక్షరాలుగా పరిచయం
 అయ్యాడో ,ఆయన 
శైలి నాకు ఎంత నచ్చుతుందో చెప్పాలి . 

వార పత్రికలలోనే ఆయన రచనలు పరిచయం . రచన బోలెడు సార్లు 
చదువుతాను కాని ,వ్రాసినది ఎవరు ,ఎక్కడి వారు పెద్దగా పట్టించుకోను . 
ఏదో నదీ మూలానికి ప్రయాణం గూర్చి వ్రాసారు . ఈయన నడిచి వెళ్ళగలరు . 
కమల గారిని డోలి ఎక్కిస్తే ఆ జనాలలో ఆవిడ ముందు వెళ్ళిపోతుంది . 
ఆమె జాడ ఈయనకు తెలీదు . ఈయన ఎంత కంగారు పడుతారో 
అని ఆవిడకు కంగారు . తెలియని బాష . చివరికి ఎవరినో బ్రతిమిలాడుకొని 
తన క్షేమ సమాచారం పంపుతుంది ఈయనకు . హమ్మయ్య అని 
ఈయన ప్రాణం కుదుట పడుతుంది . 
ఏమిటో ఇది అని మొదలు పెట్టిన నాకు వాళ్ళు ఇద్దరు కలిసే వరకు 
చదవకుండా ఆపలేక పోయాను . మామూలు పదాల నిర్మాణం . 
దానిలోని అంతర్లీన నిజాయతీ మనలను అక్షరాల వెంట నడిపిస్తుంది . 
పెద్దవాళ్ళకు ఇంత ప్రేమ ఉంటుందా ,అనుకున్నాను . ఇప్పుడు 
పిల్లల పెళ్లి అయినాక అనుభవం లో తెలుస్తూ ఉంది . 
అది మొదలు రంగాచార్య అని పేరు కనపడితే ఆపకుండా చదివేస్తాను . 

అప్పటి అలవాట్లు ,పద్దతులు ఎందుకు పాటించేవారో ,ఎంత చక్కగా 
వ్రాస్తారో !మన పెద్ద అన్నయ్య మన పక్కన కూర్చొని చెప్పినట్లు 
ఉంటుంది . 
వాళ్ళ నాన్న గారు ఆ రోజుల్లో నడిచి ప్రయాణం చేసేటపుడు ఒక 
ఊరు దగ్గర ప్లేగు వ్యాధి ఉందని లోపలి రానివ్వరు . మళ్ళీ బ్రాహ్మణుని 
అభోజనంగా ఉంచకూడదు అని స్వయం పాకం ఇస్తారు . కాని 
వండుకోను పాత్రలు ఇవ్వరు . ఇక ఇప్పుడు ఏమి చేస్తాడు !
నాకు కూడా తెలుసుకోవాలి అనిపించింది . ఎందుకంటె మనిషి 
జయించ లేనివి  నిద్ర , ఆకలి . 
ఆయన పై పంచెలో బియ్యం ,పప్పు అన్ని పోసి మూట గట్టి ఏటి 
నీళ్ళలో ముంచి కడుగుతాడు . ఇప్పుడు ఉదికించేది ఎలాగా 
అనుకున్నాను . చిన్న చెలమ ఇసుక లో చేసి ఊరిన నీళ్ళలో 
మూటను ఉంచి పైన ఇసుకను కప్పి మండే చితుకులు వేసి 
అవి ఆరిపోయిన తరువాత మూటలో ఉన్నది తినేస్తాడు . 
అసలు అలాగ చెయ్యొచ్చా ?ఎవరి కైనా తెలుసా ? ప్రతీ అలవాటు , 
పద్ధతి ఆయన వివరిస్తుంటే భారతీయ జీవిత విధానం మీద 
ఎంతో గౌరవం పెరిగిపోతుంది . 
మొన్న ఆయన చనిపోయిన రోజు జీవన వేదం చదివి ఈయనతో 
ఆన్నాను . ''ఆయన ఒక్క రోజు కూడా భార్య మీద కోపం చూపించ లేదంట ''
ఈయన శైలి లో ఈయన జవాబు 
''పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే కోపాలు ఉండవమ్మ . అంతా ప్రేమే . 
వాళ్ళు ఉన్నపుడే వాళ్ళ చదువులు , పెంపకం , ఆర్దిక ఇబ్బందులు . 
వాటి వలన కోపాలు . పెద్దవాళ్ళు అయినాక ప్రేమలు పెరుగుతాయి '' 
నిజమే కాబోలు . ఈయనకు తెలీనిది నాకు మాత్రం ఏమి తెలుసు .... 
                                              @@@@@@@@