Tuesday 22 December 2015

మా నేల తల్లి (3)

( part 2 link ikkada )

''నాన్నా '' పరిగెత్తుతూ వస్తున్న నన్ను చూసి నాన్న
వెనక్కి తిరిగాడు . 
''చిన్నగా చిన్నగా '' ''అబ్బే మొద్దా ఏంది  ఈ బురద ''
అదంతా పట్టించుకోకుండా '' అటు చూడు అటు చూడు ''
గబ గబ అన్నాను . 
''ఏముంది అక్కడ !'' ఆశ్చర్యంగా అన్నాడు . 
''చూడు నాన్న మన చెట్లు అన్నీ ఎలా తొక్కేస్తున్నారో ''చూపించాను 
పక పక నవ్వాడు పొలం లోని మడి వైపు చూస్తూ .... 
మడి  లో నడుము అంత  పెరిగిన మొక్కల్ని దున్నేస్తూ తిరుగుతున్న 
కాడికి కట్టిన ఎద్దులు . 
''అది జనుము తల్లి , నేలకి సత్తువ '' 
''పేడ  చల్లారు కదా నాన్నా మళ్ళీ ఈ చెట్లు చంపడం ఎందుకు ''
''పంటకు పంటకు మధ్య ఇలా పేడ  , జనుము వేస్తె అది నేల తల్లికి 
భోజనం తల్లి. నువ్వు అన్నం తింటేనే కదా బలంగా ఉంటావు . 
నేల కూడా అంతే '' కొంచెం అర్ధం అయినట్లే ఉంది . 
ఆడవాళ్ళు వంగి నారు వేస్తూ ఉన్నారు . చేతులకు ఉండే గాజుల చప్పుళ్ళు , 
కొంచెం పైరు గాలి హాయిగా ఉంది . 
గనిమ మీద గోతం లో తెల్లగా ఆవాలు . పాలేరు కొన్ని బుట్టలోకి వంచుకొని 
నారు వెయ్యని పొలం లోకి దిగి చల్లుతూ ఉన్నాడు . 
ఇదేమిటి నాన్నను చూసి తల ఎగరేసాను . 
''అదీ బలానికే ఫాస్పేటు , మనకు బోలెడు పంట రావాలి కదా '' చెప్పాడు . 
''మరి ఇదే వెయ్యండి నాన్న . పేడ వద్దు యాక్ '' 
''తప్పు తల్లి . ఇది నువ్వు ఎప్పుడైనా పండక్కి స్వీట్ తింటావు కదా 
అలాగ ! జనుము , పేడ , నేలకు అన్నం కూరలు లాగా ,అవి ఎక్కువ తింటే 
నేల కి జబ్బే రాదు '' 
అర్ధం అయింది . నేనేమైనా మొద్దు పిల్లనా ఏమిటి !
''నాన్న అన్నం తెచ్చాను . తిందాము రా '' 
''ఉండమ్మా ఈ మడి నారేతలు అయిపోనీ , ఈ మోటార్ కూడా బాగు 
అయిపోతుంది . వాళ్ళు కూడా అన్నానికి వెళ్ళాలి కదా . 
ఈ రోజుకల్లా ఈ పొలం పూర్తి అయిపోవాలి . లేకుంటే కూలోళ్లు 
రేపు దొరకరు '' చూసాను . 
చీర దోపుకొని వంగి చిన్ని మొక్కలు సుతారంగా 
నేలలోకి నిలుపుతూ ముగ్గు జారినట్లే ఉంది ఆడవాళ్ళు ఏమి 
చేసినా ఇంత  అందంగానే ఉంటుందో ఏమో ! 
ముక్కు మీద జారుతున్న చెమట 
ముత్యాలుగా రాలుతున్నా తుడుచుకోకుండా
 శ్రద్దగా ఒక్కో వరుస వేసుకుంటూ ఉంటె 
,పై నుండే మబ్బు వాళ్ళను చూస్తుందో నీళ్ళలో 
దాని మొహాన్ని చూసుకుంటున్నట్లు నటిస్తుందో !
చుట్టూ చూస్తె ఎదురు గనిమ దగ్గర కొబ్బరి చెట్లు వరుసగా 
పక్కనే వీళ్ళ టిఫిన్ క్యారియర్ లు . ఏముంటుంది లోపల 
నాకు తెలుసు !మా అమ్మ మాకు కూడా అదే ఉదయం పెట్టేది . 

నిండుగా అన్నం . అది మునిగే దాకా నీళ్ళు . అందులో ఉప్పు కలిపి 
మేము రెండు చేతులు దోసిలిగా పడితే అందులో అన్నం పెడుతుంది . 
దాని మీద కొంచెం పచ్చడి . అన్నం కొంచెం అది కొంచెం అంతే !
ఒక్కో ముద్దకి బోలెడు చలవ . ఇక మధ్యాహ్నం బడి నుండి 
ఇంటికి వచ్చేదాకా ఆకలి అనే మాటే లేదు . అన్నం లో నీళ్ళు 
మా నాన్న తాగేస్తాడు . అందుకే మా నాయనకు బోలెడు బలం . 
నేను కూడా అలాగే తింటాను . అప్పుడు నాకు కూడా బోలెడు 
బలం వస్తుంది . ఇక నేలకి , దానికి బోలెడు బలం జనుము 
పేడ వేస్తున్నాము కదా !
 మా నాన్నకి పిల్లలు అయినా పొలం 
అయినా బోలెడు ప్రేమ . 

అయ్యా కొత్త బెల్ట్ బాగా పనిచేస్తుంది . 
మోటార్ వెయ్యమంటారా ?
మెకానిక్ అడిగాడు . 
నాన్న తల ఊపగానే మోటార్ వేయడం 
నీళ్ళు జయ్యని కాలవలోకి పోయి పొలాన్ని తడుపుతూ . 
''బాగుంది కదరా కొత్త బెల్ట్ , అంగడి లోకి  తెప్పిస్తాను ''చెప్పాడు నాన్న . 

ఏ కొత్తది అయినా నాన్నే ముందు వాడి చూస్తాడు . బాగుంటే 
అందరికంటే ముందే షాప్ కి తెప్పించి అమ్మేస్తాడు అది కూడా 
తక్కువ ధరకి . ఎక్కువ లాభం తో తక్కువ అమ్మే దానికంటే 
తక్కువ లాభం తో ఎక్కువ మందికి అమ్మాలి అంటాడు . 
అందుకే మా అంగడి అంటే చాలా ఇష్టం ఎంతో  మందికి. 

''రా బురద కడుక్కో '' 
నీళ్ళ తొట్టి లోకి దిగి తల నెమ్మదిగా మోటార్ కింద పెట్టాను . 
దబ  దబ నీళ్ళు ,ఉక్కిరి బిక్కిరి అయిపోయి తల తీసేసాను . 
పది సార్లు మునుగో మునుగు . 
బయటకి వచ్చి చూస్తె నాన్న ఇంకా పనిచేయిస్తూ ఉన్నాడు . 
రెండు చేతులు చాచాను రెక్కలు లాగా . జుయ్య్ .... 
గనిమ మీద పొలం అంతా పరిగెడుతూ .... రెండు సార్లు తిరిగే సరికి 
గౌన్ ఎప్పుడో ఆరిపోయింది . 
రెండో సారి పరుగులో చూసాను ఆ పిల్లని , నాకంటే కొంచెం పొడుగు . 
చేతిలో నార కట్ట పట్టుకోలేక అవస్థ పడుతూనే ఒక్కో మొక్క తీసి 
నేలలో గుచ్చుతూ ఉంది . మెల్లిగా అలవాటు పడుతున్న వేళ్ళు 
వేగాన్ని పుంజుకుంటూ ..... ఒక్కో మొక్క ఆ చేతి నుండి తీసుకోవడం 
విరగకుండా సుతారంగా గుచ్చడం , మధ్యలో మిగిలిన వాళ్ళ 
వరుస లో ఉన్నానా చూసుకుంటూ ఉంది . 
నాకు భలేగా ఉంది ఆ పిల్ల చేసే పని .... చూస్తూ ఉన్నాను 
ఆ చిన్న చేతుల వైపు , అవి పైకి లేస్తే నా చూపు కూడా పైకి , 
అవి కిందకి వెళితే నా చూపు కూడా కిందకి . 
ఒక నిర్ణయానికి వచ్చాను . 
అంటే మా నాన్నకి నాతొ ఇబ్బంది  మొదలైనట్లే మళ్ళీ 
'' నాన్నా '' పరుగు '' ఏమిటి తల్లి ? ''
'' ఏందంటే "
                          **********
                                                             ( ఇంకా ఉంది )



Monday 14 December 2015

శార్వరి గారు దిగులుగా ఉంది

శార్వరి గారు దిగులుగా ఉంది 

ఆయన 12/12/15 తేది  శివైక్యం జరిగింది అని తెలిసినప్పటి
నుండి . ఇక ఆయన నుండి మార్గదర్శనాలు రావా ! 
అసలు నేను ఎందుకు బాధ పడాలి ?
ఆయన ఏమైనా నాకు మాష్టారా . కాదేమో ! అవునేమో ! 
కాని ఒకటి ఖచ్చితంగా చెప్పగలను నేను పోతున్న దారిలో నాకంటే 
ముందు నడిచిన వారు , ఇంకా తన అనుభవాలను గ్రంధస్తం చేసి 
నాలాంటి వాళ్లకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన వారు . 
ఇంత వ్రాసి మిమ్మల్ని కదిలిస్తున్న అక్షరాల వెనుక ఉన్న శక్తి నాది 
కాదు , అసలు నేను ఏమి వ్రాసానో .... వ్రాసిన తరువాత మళ్ళీ 
చదువుతాను అని ..... లోపలి అంతరిక శక్తుల మర్మం చెపుతారు . 

తొమ్మిదేళ్ళ క్రితం , ఒక సారి వడదెబ్బ కొట్టి చచ్చి బ్రతికిన 
అనుభవం తరువాత నన్ను ఇక్కడకు మళ్ళీ నా విన్నపాన్ని 
మన్నించి పంపినది ఎవరు , అసలు అక్కడ ఏమి జరుగుతుంది !
అనే ఒక ఆలోచన నాలో . ఎప్పుడూ మేలుకొని ఉన్నంత సేపు 
అష్టాక్షరి జపమే తప్ప  ఇంకొకటి నాకు తెలీదు .
 కాని దీనికి భిన్నమైనది ఇంకొకటి ఉంది . 
తెలుసుకోవాలి అనే తపన . 

ఇక్కడ పిరమిడ్ క్లాసెస్ రాఘవేంద్ర గారు , గాంధి గారు 
చక్కగా నడుపుతున్నారు అని తెలుసుకొని మా ఇంట్లో 
ఒక వారం క్లాస్ పెట్టమని అడిగాను . 
ధ్యానం తరువాత ఏమి కనిపించాయి అని అడుగుతూ ఉంటారు . 
ఏమిటి కనపడేది ! నేను సైన్స్ స్టూడెంట్ ని ఒక పట్టాన నమ్ముతానా !
తెల్లవారు జామున ధ్యానం చేస్తుంటే ఒక్క సారి నుదురు దగ్గర 
ఎలక్ట్ర సిటీ స్పార్క్ వచ్చినట్లు మెరుపు , ముందుకు వాలి పోతూ 
ఉంటె విష్ణు చక్రాలు లాగా ఒక వరుస .... ఏమిటివి ? 

మళ్ళీ సామూహిక ధ్యానం లో పొట్ట లోపలికి వెళుతూ ఉన్నట్లు 
ఏదో పైకి ఉబుకుతున్నట్లు .... ఒకటే నోట్లో నీళ్ళు ఊరుతూ , 
ఇంత మంది నేను లేస్తే డిస్టర్బ్ అవుతారు . మింగేసాను . 
ఏమిటది ? ఇంకో జవాబు తెలియని ప్రశ్న . 

సగం రాత్రి లేస్తూ ఉంటాను , ఏవో శబ్దాలు యేవో వాయిద్యాలు 
మ్రోగుతున్నట్లు , శివ లింగం నుండి వెలువడుతూ ఓంకారం .... 
ఏమిటి ఈ పిచ్చి కలలకు అర్ధం . ఎంతగా  లైట్ తీసుకో ఏవో భ్రమలు 
అని సర్ది చెప్పుకున్నా ..... ఒక్క గురువు ఉంటె బాగుండును . 
ఇవన్నీ చెప్పేవాడు కదా అని బాధతో ఏడ్చేదాన్ని . 
బ్రతికి ఉన్న బాబాలు , గురువుల మీద నాకు నమ్మకం లేదు . 
కాని నాకు ఒక గురువు కాక పొతే సందేహాలు తీరే జ్ఞానం కావాలి , 
అదే ఆలోచన . అసలు వీటిని ఎవరితో పంచుకోవాలి , పిచ్చిదాన్ని 
అనుకుంటారు . లోపల నుండి మాత్రం తెలుసుకోవాలి అనేబలమైన 
తపన .... రామకృష్ణ పరమహంస గారు చెపుతూ ఉంటారు 
''పక్క గదిలో ధన రాసులు ఉంటె దానిని పొందడానికి దొంగ 
యెంత తపన పడతాడో అంత  తపన పడాలి దేవుడి కోసం . 
అప్పుడే ఆయన నీ కోసం వస్తాడు '' అని . 
నిజంగా లోపల ఏదో వ్యధ , ఏదో కోల్పోతున్నట్లు , ఏదో కావాలన్నట్లు . 

అప్పుడు మా అక్క ఇచ్చింది ''అసతోమా సద్గమయా '' శార్వరి . 
ఆహా దప్పిక నీళ్ళు అడిగితే దేవుడు అమృతమే పంపాడు . 
మూడు పేజీలు  తిప్పగానే కళ్ళు మూతలు పడిపోతాయి . 
శరీరం ఉందొ లేదో ! తెరిపన పడాలి అనే అవసరం లేక పోతే 
నిద్ర లోకి వెళ్ళిపోవడమే . 
ఇక వరుస '' మాస్టర్ సి . వి . వి '' మాష్టారు గారి అద్భుత ప్రయోగాలు . 
నిజమా ఎలా నమ్ముతాము . పాలల్లో వెన్న ఉంది అంటే నమ్మేస్తామా . 
మాష్టర్ సి . వి .వి నమస్తే అనుకోండి , కుండలిని బోరింగ్ ఈజీ గా 
చేసేస్తాడు . అంత  ఈజీనా ! పట్టు పడితే తేల్చుకునేదాకా వదలను నేను . 

పైకి వెళ్లి  ఆకాశం చూస్తూ కూర్చున్నాను . మెల్లిగా కళ్ళు మూసుకొని 
మాష్టర్ సి . వి . వి గారు నమస్తే . ఏమి జరిగింది , ఏమి లేదు . 
కాదు ఏదో ఉంది . మెల్లిగా వెనుక వైపు ఏదో ఎగసి పైకి వస్తూ 
తల మొత్తం భారంగా , అలాగే చాలా సేపు కూర్చుండిపోయాను . 
ఇక అంతే  లైబ్రరీ లో శార్వారీ పుస్తకాలు వదలకుండా చదువుతూ ఉంటె 
వాళ్ళు '' మేడం శార్వరి వి ఎక్కువ చదవకండి . ఎవరికీ అలవాటు 
పడకూడదు . అందరి జ్ఞానం మనం తెచ్చుకోవాలి . జ్ఞానం ముఖ్యం '' 

''కుండలినీ '' అదిగో బుక్ దొరికేసింది . నా సందేహాలన్నీ తీరిపోతూ 
లలన చక్రం ఎనర్జీ వచ్చినపుడు నోట్లోకి ఊరుతూ అమృతం , ఇదేనా ! 
ఓహో ఇదంతా మనం మన లోపలి పోయే దారిలో ఒక క్రమం అన్న మాట . 
కొందరి దారి వేరేగా ఉండవచ్చు . 
''మృత్యోర్మా అమృతంగమయా '' ఆహా ఇక సందేహాలు పెద్దగా లేవు . 
ముందుకు పోయే దారి ఇంకా తెలుసుకోవాలని తప్ప . 
నాతొ చుట్టూ ఉండే కొందరిలో ఇప్పుడు ఆత్మీయత బంధం కనిపిస్తూ 
ఉంది . కాని వాళ్లకి తెలిసిన బంధాలతో దానిని నిర్వచించలేనపుడు 
వెల్లడి చేయడం లో ప్రయోజనం లేదు . ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు 
ఆత్మ శాంతి పేరుతొ వెతుకుతూ ఉన్నారు . జ్ఞానం కలగనిదే 
ఆత్మకు శాంతి లేదు . జ్ఞానం అంటే ! దేవుడిని తెలుసుకోవడం కాబోలు . 
అలాగైతే ఇక ఆయనను చూడాల్సిందే ఎలాగైనా . 
ఇక చివరిగా చూసిన ఆయన బుక్ ''శంబల '' దానిని చదవాలి 
ఎలాగైనా , విశాలాంధ్ర వాన్ వచ్చినపుడల్లా అడిగేదాన్ని . 
లేదు మేడం , ఈ సారి మీకోసం తప్పక తెస్తాము అనేవాళ్ళు . 
ఒక రోజు నివాస్ ఫోన్ . 
''అమ్మా విజయవాడ లో బుక్ ఎక్జిబిషన్ లో ఉన్నాను . 
నీకేమి బుక్ తెమ్మంటావు ?"
నాకేమి ఇష్టమో వాడికి బాగా తెలుసు . 
''శంబల తీసుకుని రారా , శార్వరి గారు వ్రాసినది '' 
చెప్పాను . 
నా కొడుకు చేతుల్లో నుండి దానిని తీసుకున్నప్పుడు ఎంత 
ఆనందమో !! ఆపకుండా చదివేసాను . రెప్పలు వాలిపోతున్నా సరే . 
అవును శంబల , ఎనర్జీ లెవల్స్ బాగా ఉండే మాష్టర్స్ ఉండే చోటు . 
ఊరికినే మనం కారెక్కి వెతికితే కనిపిస్తుందా , కుదరదు అంత 
ఎనర్జీ లెవల్స్ కి పదార్దం చేరలేదు , ఆస్ట్రో ట్రావలింగ్ చేయాల్సిందే . 
మన కోసం శార్వరి గారు చేసి ప్రతి అనుభూతి అక్షరాలుగా 
మనకు అందించారు . ఎనర్జీ లెవల్స్ శరీరం భరించలేనంత 
చేరినపుడు వాళ్ళు శరీరం లో ఉండరు . వదిలేసి తేజో రూపాలకి 
వెళ్ళిపోతారు . మాష్టర్ సి . వి . వి గారు ఇది చాలా క్లియర్ గా 
చెప్పారు . అలాగే శార్వరి గారు కూడా వెళ్ళిపోయి ఉంటారు . 
శంబల కేనా !! మరి ఈ సారి ఆ విశేషాలన్నీ అక్షర రూపం 
ఎవరి ద్వారా రూపం దాల్చుతాయో , మాష్టార్ల సంకల్పం ఎలా 
ఉందొ . 
దేవుడిని చూడాలి అని పట్టు బట్టి ధ్యానం చేసాను కదా , 
ఇంతకీ అక్కడ కనపడింది ఎవరు .... నేనే !! అద్దం లో 
చూసుకున్నట్లు .... ఎంత  బాగున్నాను చూస్తూనే ఉండాలి 
అనిపిస్తూ ఉంది . మైనం పోసిన స్పూన్ నీళ్ళలో వేసి ఎండలో 
చూస్తె దాని చుట్టూ మెరిసినట్లు ఏదో మెరుపు పూత నా చుట్టూ . 
చూస్తూ ఉంటె ఎంత  బాగుంది . 
అన్నీ బాగున్నాయి కాని అక్కడ నేనే ఉంటె దేవుణ్ణి అడగాలి 
అనుకున్న వరాల లిస్టు ఎవరిని అడగాలి ? ఎవరి కాళ్ళకి 
మొక్కాలి !
                          @@@@@ 




Tuesday 8 December 2015

మా నేల తల్లి 2

( నేల తల్లి పార్ట్ 1 లింక్ ఇక్కడ )
( link here )

''అబ్బా '' అరిచాను . గనిమ మీద నుండి జర్రున జారి .... 
కింద పడి  గౌను , కాళ్ళు మొత్తం బురదే .
పరిగెత్తాడు పాలేరు . లేపాలంటే ఒక చేతిలో పార , 
రెండో చేతిలో నాయన కోసం తీసుకొని పోయే క్యారియర్ . 
నేనే లేచి నిలబడ్డాను . దూరంగా పడింది కాలి చెప్పు . 
అంతా కోత కోసేసిన కయ్యాలు . ఇంకా వీళ్ళు దున్నుకోలేదు . 
నేల నీళ్ళు తాకి మెత్త బడుతూ నారు కోసం ఎదురు చూస్తూ 
ఉంది , అన్నం వండి బిడ్డ కోసం ఎదురు చూసే తల్లి లాగా , 
నిజంగానే నేల తల్లి . ఎదురు ఆశించకుండా మనకు ఆనందాన్ని 
పంచేవి , ఆకలి తీర్చేవి తల్లి అంత  గొప్పవే !!

''చెప్పు తెచ్చుకో బుజ్జమ్మా ,ఆలీసం అయితే సెట్టయ్య 
తిడతాడు '' 
''ఊహూ నేను పోను బురద , యాక్ '' 
గౌను వైపు చూస్తె బురద . 
పార చేతికిచ్చి , గనిమ మీద నుండి దిగి చెప్పు తీసుకొని 
వచ్చాడు . వేసుకున్నాను . 
''నేను నడవను . ఎత్తుకో '' చెప్పేసాను మొండిగా నిలబడి . 
''పద బుజ్జమ్మా , మళ్ళా ఇంకో మడి  దున్నాలా !!'' 
నచ్చ చెప్పాడు . 
''ఈ బురద అంతా  చూడు , నేను నడవను '' 
నిస్సహాయంగా చుట్టూ చూసాడు . 
దూరంగా ఎద్దుల బండి . మాదే . ఎద్దుల కొమ్ములకు 
రంగు చూడు . పెద్ద పండుగ కు పూస్తాము . ఇంకా గూడలి 
తిరణాలకి నాయనమ్మ వాళ్ళతో ఈ బండిలోనే పోయేది . 

''సరే బండెక్కి వస్తాలే '' చెప్పాను . హమ్మయ్య ఇంక 
పెద్ద కాలువలో నడిచే పని లేదు . 
బండి దగ్గరకు వస్తుంటే వాసన . పేడ ! 
''ఎక్కలేవులే బుజ్జమ్మా , ఎరువు బండి '' 
నిజమే దానిని తోలే వాడే ఎద్దుల కాడి మీద కూర్చుని ఉన్నాడు . 
వెనుక బుట్ట లాగ పెట్టి దాని నిండా గడ్డి , పేడ . 

ఇదంతా మా నాయనమ్మ ఇంటి నుండి వస్తున్నట్లు ఉంది . 
నాయనమ్మ ఇల్లు అంటే ఒక వీధి  చివరి నుండి ఇంకోవీధి  చివరి దాకా !
ముందు అంగళ్లు . వెనుక ఇల్లు . ఆ వెనుక పంచ . అక్కడ 
అవ్వ , మేనత్తలు ఎప్పుడూ విస్తరాకులు కుడుతూనే ఉంటారు . 
ఎక్కువ వస్తే అమ్మేస్తారు . వెనుక పెద్ద పెరడు , మునగ  చెట్లు
బాదం చెట్లు .... మా నాయనమ్మ అవన్నీ అమ్ముతుంది . 
మా అవ్వ , జేజినాయన , నలుగురు కొడుకులు 
ఎందరు ఉండారో అందరు పనిచేసేవారే , ఒకరు చేయడం 
ఒకరు ఖాళీగా ఉండడం లేదు . పని అందరిది . ఆదాయం అందరిది . 
 వెనుకరేకుల పంచ,  దానిలో పాడి , దాని పక్కన 
చీమ చింత గుబ్బల చెట్లు , దాని వెనుక రోజు పాలేరు 
వేసి పెట్టె పేడ  కుప్ప . అదే ఇక్కడకు తీసుకుని వచ్చి నట్లున్నారు . 

''యాక్ , ఏమి చేస్తారు దీన్ని ? ''
'' అది ఎరువు బుజ్జమ్మా , అది వేస్తె నేలకు సత్తువ
నాయనకు చాలా వడ్లు వస్తాయి '' 
ఓహో , పేడ వలన ఇంత  ఉపయోగమా !!
నేనింకా కళ్ళాపు చల్లడానికి అనుకున్నాను . 

''తొందరగా పొతే కరంట్ ఉంటాది , మోటార్ వేస్తె 
బురద కడి గేసుకోవచ్చు '' చెప్పాడు . 

హా ..... అని గునుస్తూనే మెల్లిగా ముందుకు కదిలాను .... 
అదాటున చూస్తె కలువ పూవుకు బురద అంటినట్లు  కనిపిస్తుందేమో ! 

పెద్ద కాలువ వచ్చేసింది . సన్నటి దారి మలుపు తిరుగుతూ లోపలి కి . 
వంగి చూసాను . నీళ్ళు పారుతూ ఉన్నాయి . పక్కన గడ్డి దుబ్బలు 
నాకంటే ఎత్తుగా . ఇంకా వాటి మొదుళ్ళ  లో చిన్న కలుగులు , 
వెనక్కి పరిగెత్తాను . నేను రాను . గుండె గబ గబ కొట్టుకుంటూ ఉంది . 

''నేను రాను , ఎత్తుకుంటేనే వస్తాను '' మొండిగా కూర్చున్నాను . 
ఎలాగా ఎత్తుకునేది , నిస్సహాయంగా చూసి పార పట్టుకో 
అని ఇచ్చి ఎత్తుకొని మెల్లిగా నీళ్ళలో దిగాడు . పాదాలు మునిగి 
కొంచెం పైకి పారుతున్నాయి నీళ్ళు . వీపు మీద నుండి చూసాను 
భయంగా , కలుగు దగ్గర రిబ్బను లా తిరుగుతూ ..... గబుక్కున కళ్ళు మూసుకున్నాను . 

''దిగమ్మ , పద '' 
''ఒక వైపు కయ్యల్లో వంగి నాట్లేస్తూ కబుర్లు చెప్పుకుంటూ , నవ్వుకుంటున్నారు 
ఆడవాళ్ళు . 
''మే కానీండి , పొద్దయి  పోతా  ఉండాది'' ఆదిలించినాడు . 
ఉలిక్కిపడి పని తొందరగా చేస్తున్నారు . 
పెద్ద పాలేరు అంటే సెట్టిగారు తరువాత , డబ్బులు , పని అన్నీ మందల 
చెప్పేవాడు కదా . 
''మా నాయన ఏడి ? '' అడిగాను . 
''ఆ పక్క మోటార్ కాడ ఉండాడు '' 
పొలానికి ఇబ్బంది లేకుండా రెండు వైపులా మోటార్లు . 
ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు , ఇంకా పంట కాలువ లో 
కూడా ఉంటాయి . కష్టం పడాలే కానీ ఆ తల్లి పచ్చటి సంపద 
దోసిట్లో పోస్తుంది . చెమట అంటే దానికి ఎందుకంత ఇష్టమో ! 
ఒక్కో సారి పొలాన్ని రెండు భాగాలుగా చేసి అటు తమదలొ , సజ్జలో 
ఇటు ఐ . ఆర్ . ట్వంటీ లో , మొలగోలుకులో వేస్తాడు . 
వర్షాన్ని బట్టి ,ఉండే కాలాన్ని బట్టి ఏవి ఎయ్యాలో మా నాయనకు 
భలే తెలుసు . 
గనిమ మీద నుండి పరిగెత్తుతూ వెళ్లాను . 
ఒక వైపు ఇందాక వచ్చిన బండి నుండి ఎరువు తీసి చల్లుతూ 
ఉన్నారు . 
ఇంకో వైపు పచ్చటి మొక్కలు . ఏమిటో అవి ? 
'' నాన్నా అని అరుస్తూ పరిగెత్తాను . 
ఆ పొలం వైపు వేలు చూపిస్తూ ..... 
ఏమైంది ? మా నాన్న కళ్ళలో ఆశ్చర్యం . 
                                           ( ఇంకా ఉంది )

Saturday 28 November 2015

కేజ్రివాల్ మీద జాలితో




ఈ లాలు ప్రసాద్ యాదవ్ ఏమి చేసినా భలే తమాషాగా అనిపిస్తుంది . 
అందరు టికట్ రేట్ పెంచుతుంటే రైల్వే మంత్రిగా టికట్ రేట్ తగ్గించడం ,
ఐ . బిఎం లో గెస్ట్ లెక్చర్లు , మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గా 
ఉంటారా అంటే సిగ్గుపడటం , నిన్నటికి నిన్న కేజ్రివాల్ ని హగ్ చేసుకోవడం .... 
అన్ని బోలెడు కాలక్షేపం చాటింగ్ లో . 
రాజకీయాలు నాకేమి పెద్దగా తెలీవు . కాని ఇలాంటివి వచ్చినపుడు 
పక్కన మేడమ్స్ ని అడుగుతుంటాను . 
''ఎలా తగ్గిస్తారు శైల  టికట్ ?మళ్ళీ బడ్జెట్ నష్టాలలోకి వెళ్లి పోతుంది 
కదా ! మళ్ళా లాభాలు పెరిగాయి అని గెస్ట్ లెక్చర్ ఎలా ఇస్తాడు ? ''
శైల వాళ్ళ శ్రీవారు రైల్ వేస్ లో ఏ . ఎస్ . ఎం . 
''ఏమి లేదులే శశి గూడ్స్ కి ఒక వాగన్ పెంచేశారు . అక్కడ కవర్ 
చేస్తారు '' 
మరి లోడ్ ఎక్కువైతే ఇంజెన్స్ ఇబ్బంది కాదా ! 
గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే రాజకీయ నాయకులను ఒక్క కిచ్చారెడ్డి లక్ష్మా రెడ్డి ని 
ఒక్కటే చూసాను . మా లీడ్ ఇండియా ట్రైనింగ్ లో ఇచ్చారు . 
అప్పుడు దాని మీద రెస్పాన్స్ నేనే చెప్పాను . మెచ్చుకున్నారు కూడా !

ఇక ఇప్పుడు కేజ్రివాల్ వంతు . లాలు నే హగ్ చేసుకున్నాడు , 
నాకేమి ప్రేమ లేదో అని మొత్తుకుంటున్నాడు . 
ఆకు ముల్లు  సామెత ఇప్పుడు అర్ధం అయిందా !
తప్పు మాది కాక  పోయినా , మాది తప్పు అనేస్తే నిరూపించుకోవడానికి 
మేము ఎంత తంటాలు పడతామో అర్ధం అయిందా . 
తన దాకా వస్తేనే తెలుస్తుందని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు . 

కేజ్రివాల్ గారు బాధ పడకండి . మీ తప్పేమీ లేదని నమ్ముతున్నాము . 
లాలు సంగతి మాకేమి కొత్త కాదు :-)
                               @@@@@@@ 

Tuesday 24 November 2015

మా నేల తల్లి ..... పచ్చని వరాలు (1)

మా నేల తల్లి .... పచ్చని వరాలు (1) ( ఎర్ర అరుగుల కధలు సీరీస్ )

''అమ్మా '' పిలిచాను . 
కుంపటి పై ఉడికే సాంబారు పరిమళం బయట వాన మట్టి 
తో కలుస్తూ ఒక చిన్నపాటి వెచ్చదనం ,కొంచెం హాయిగా ,కమ్మగా 
ఇంగువ , కరివేపాకును  కలుపుకుంటూ పలకరిస్తూ ఉంది . 
వాసన ను  బట్టి ఉప్పును లెక్కేసి కొంచెం ఉప్పు వేసి కలిపింది అమ్మ . 
ఇంకొంచెం ఘుమ ఘుమ ..... వెంటనే వేడి అన్నం తినాలి అనిపించేటట్లు . 
సాంబార  పొంగ కుండా కలుపుతూ ''చెప్పు '' అంది , మంచం పై 
పడుకున్న రెండేళ్ళ తమ్ముడు వాసు లేచాడేమో గమనిస్తూ . 

''ఇదిగో చూడు , ఇది సీ అంటే సముద్రం అన్న మాట '' 
వళ్లోని ఒకటో క్లాస్ పుస్తకం లో చూపించాను . నేను నేర్చుకున్న 

ఇంగ్లిష్ అమ్మకు నేర్పించి , మరల అమ్మకు ఒప్పచెప్పడం అమ్మ మాకు 
చేసిన అలవాటు . 
చిన్నగా నవ్వింది , బాగుంది అన్నట్లు . నిజంగానే అమ్మ నవ్వితే 
బాగుంటుంది . వీపు మీద వాలి ఊగాలి అనిపిస్తుంది . ఎప్పుడూ 
పని చేస్తూనే ఉంటుంది . 
''నీకు తెలుసా ! మనకు పది కిలోమీటర్ల దూరం లోనే సముద్రం 
ఉందంట . దాని పేరు బంగాళా ఖాతం . బోలెడు నీళ్ళు , అన్నీ 
ఉప్పు నీళ్ళే . యాక్ .... అయ్యేమి చేసుకుంటారు !పడవలు 
కూడా తిరుగుతాయంట , మా కుమారి మిస్ చెప్పింది '' కళ్ళు 
పెద్దవి చేసుకుంటూ గబ గబ చెప్పాను . మరి అమ్మ కూడా నాలాగా 
''ఓ యమ్మ '' అని అనాలి కదా . 
పోయిన ఏడాది నుండి కాన్వెంట్ కి వెళ్ళడం . పెద్ద కాన్వెంట్ కాదు . 
ఏదో ఒక రెడ్డిగారు వాళ్ళ పాప కోసం పెట్టిన కాన్వెంట్ . 
మా క్లాస్ లో అయితే నేను , మా పెదనాన్న కొడుకు ప్రసాద్ , 
ఇద్దరమే . ఒక్కో ఏడాది ఎన్ని క్లాస్ లు అయినా చదివెయొచ్చు . 
పుస్తకం అయిపోతే ఇంకో పుస్తకం . 
''తెలుసు లేవే .... ఇంకా అక్కడ చేపలు కూడా పడతారు . 
సముద్రం లో ఉంటాయి కదా ! ఎప్పుడైనా సముద్ర స్నానానికి 
వెళదాము . '' చెపుతూ ఉంది అమ్మ . 
బయట నుండి పిలుపు ''శెట్టేమ్మా '' అంటూ . 
తొంగి చూసాము . పెద్ద పాలేరు వీర రాఘవయ్య . 
''ఏమి రాఘవయ్య ?'' అడిగింది అమ్మ . 
''శెట్టేయ్య అన్నం తీసుకొని రమ్మన్నాడు '' చెప్పాడు . 

''ఏ కైల్లో ఉన్నాడు ?'' అడిగింది . 
''పెద్ద కైల్లో , నారేతలు వేయిస్తున్నాడు . తొందరగా రమ్మన్నాడు '' 
''అంటే అరటి తోటా అమ్మా ? '' కుతూహలంగా అన్నాను . 
''కాదులే శశి , దూరంగా ఉండే పెద్ద కయ్యలు '' చెప్పింది . 
మూడు దగ్గరల మూడు రకాలు వేస్తాడు మా నాయన . 
ఒక దగ్గర వరి , ఒక దగ్గర వేరు సెనగ , ఒక దగ్గర అరటి తోట . 
పెద్ద పొలం లో కొన్ని సార్లు తమదలు , ఏవో రక రకాలు 
ఏడాదికి రెండు సార్లు పంటలు , పక్కనే పోతున్న స్వర్ణ ముఖీ 
చల్ల కాలువ పుణ్యమా అని . ఎప్పుడూ ఏదో ఒక పంట 
వేస్తూనో , కోస్తూనో . మళ్ళా వచ్చి అంగడి పని చూసుకునేవాడు , 
బాబాయి లతో కలిసి . 

''ఉండు రాఘవయ్య , పులుసు ఉడుకుతూ ఉంది , సర్ది 
ఇచ్చేస్తాను . ఇదు నిమిషాలు '' చెప్పింది అమ్మ . 
''అమ్మా దాహం గుంది . కొంచెం నీళ్ళు పొయ్యి '' అడిగాడు . 

అమ్మ పైన ఉన్న క్యారియర్ తీస్తూ ఉంది . 
''నేను ఇస్తాను ... నేను ఇస్తాను '' పరిగెత్తాను చెంబు నిండా 
నీళ్ళు ముంచుకొని . ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కదా !
నాన్న బయట నుండి రాగానే నేనే ఇస్తాను . 

ముందు నిలబడి ఉన్నాడు . నీళ్ళు చూడగానే వంగాడు . 
అరిచేయి నోటికి ఆనించుకొని పొయ్యమన్నట్లు ..... 
ఇప్పుడేమి చెయ్యాలి ? నాకేమి అర్ధం కాలేదు . చెంబు 
తీసుకోవాలి . ఇదేమిటి ? 
''పొయ్యి బుజ్జమ్మా '' అన్నాడు . 
అరిచేతులో నీళ్ళు పోస్తే తాగుతున్నాడు . 
దూరంగా జరిగాడు . నేను అంత  ఎత్తు పోయ్యలేక , 
ముందుకెళితే .... 
''బుజ్జమ్మా , ఎంగిలి నీళ్ళు నీ గౌను పైన బడుతున్నాయి 
దూరంగా పొయ్యి '' అన్నాడు . 
ఇదేమో నాకు కొత్త . నాకు ఎలా తెలుసు !!
మొత్తం తాగేసి దూరంగా నిలుచున్నాడు . 
చెంబుతో కాకుండా ఇలాగా కూడా తాగుతారు కాబోలు . 

లోపలి వెళ్లాను . అమ్మ క్యారియర్ గిన్నెలు తీసి సర్దుతూ ఉంది . 
ఐదు గిన్నెలు . స్టీల్ వి . పై వరకు ఒక స్టాండ్ వాటిని 
పట్టి పెడుతూ , అది పడిపోకుండా అడ్డంగా ఒక స్పూన్ . 
దానితో వడ్డించు కోవచ్చు . 
ముందు ఒక దానిలో చింతకాయ పచ్చడి పెట్టింది . 
ఒక దానిలో తాళింపు . పై గిన్నెలో పెరుగు . ఒక దానిలో 
సాంబారు . కింద గిన్నెలో, వార్చిన అన్నం గిన్నె పైకి లేపి 
వేడి అన్నం నింపింది . చిన్న గిన్నె తీసింది ,రెండు స్పూన్ ల 
నేయి వేసి అన్నం మధ్యలో పెట్టింది గిన్నెని . పొలానికి వెళ్లేసరికి 
కరుగుతుంది . క్యారియర్ మొత్తం సర్దేసి రాఘవయ్య చేతికి 
ఇచ్చి '' ఆకులు అక్కడ ఉన్నాయి కదా ? '' అడిగింది . 
''అరిటాకులు లుండా యిలె చెట్టుకు '' చెప్పాడు . 

''పొలం నుండి బంతి పూలు , పచ్చి మిరప కాయలు తీసుకుని 
రమ్మని చెప్పు . ఉప్పుడు కాయలు ఊరేయ్యాలి ''చెప్పింది . 

''అట్నే శెట్టేమ్మ '' చెప్పేసి క్యారియర్ ఒక చేత్తో , రెండో చేత్తో 
రెండు పారాలు తీసుకున్నాడు . 

''అమా నేను కూడా కైలు దగ్గరికి పోతాను మా '' చెప్పాను . 
'' వద్దులేమ్మా , అంత దూరం నడవలేవు . ఎప్పుడైనా బండి 
మీద పోతువు లే '' 
చిన్నగా అపుడప్పుడు పడుతూ ఉన్న తుంపర , దూది వంటికి 
తాకుతున్నట్లు భలే ఉంది . 
''మా పోతాను మా '' ఇంట్లోనుండి బయటకు పరిగెత్తాను . 
''బుజ్జమ్మ వాన పెద్దది అయితే కష్టం ,వద్దమ్మ '' అన్నాడు . 
ఊహూ .... ముందుకు పరిగెత్తాను . 

''వాళ్ళ నాన్న మొండి వచ్చింది దీనికి . తీసుకొని పోలే . 
మళ్ళీ ఎవరైనా వస్తుంటే పంపెయ్యండి '' చెప్పింది అమ్మ . 

హయ్య .... గాలికి ఊగే పైరు . సరిగా గుర్తు లేదు కాని , 
ఇంతకూ ముందు వెళ్లాను . మోటార్ వేసి తొట్టి లో 
ఎగరొచ్చు . గనిమల మధ్య కాలవలో నడవొచ్చు . మా నాయన 
ఏమి అనడు . ఇంకా నీళ్ళ మోటార్ చాలా సేపు వేయిస్తాడు 
మా కోసం . పొలం కి వెళ్ళడం ఏమి హాయి . కాకుంటే ఒక్కటే 
బాధ . మధ్యలో ఉండే పెద్ద కాలువ . తాడి చెట్టు కంటే ఎక్కువ 
వెడల్పు అందుకు దాని మీద ఏమి వేయరు . నడిచి పోవాలి 
మధ్యలో , అది కాదు ఇంకో భయం ఉంది దానిలో .... 

సరే ముందు ఒకటిన్నర  కిలో మీటర్లు నడవాలి . 
ముందు పరిగెడుతూ ఉంటె వెనుక రాఘవయ్య వస్తున్నాడు 
''జాగ్రత్త '' అని అరుచుకుంటూ . 
నాకేంటి జాగ్రత్త చెప్పేది ఇంత  పెద్ద అయ్యాక .... 
''అబ్బా '' అని అరిచాను , వెనక నుండి పరిగెత్తాడు . 
                                           ( ఇంకా ఉంది ) 
                               ********* 


Sunday 22 November 2015

మీరు మీకు తెలిసినవి చెప్పండి

 దేవుడా .... ఎక్కడున్నావు ? 
ఈ వానలు ఏమిటి తండ్రి అని అడగాలి అంటే భయం . 
మళ్ళీ ఎక్కడ లేకుండా పోతాయో అని !!
ఏడాది వానలు ఆరు రోజుల్లో కురిపిస్తే ఎట్టా చెయ్యాలి ?
నువ్వట్టా కురిపించావు , అయ్యి ఇట్టా కట్టలు తెంపుకొని 
సముద్రం లో కలిసిపోయాయి ! ఇక కురిపించి ఏమి లాభం ! 
కాసిని నీళ్ళు అయినా భూమి కింద దాచిపెట్టు , ఎండాకాలం 
కావొద్దా . .... 
లాభం అంటే గుర్తుకు  వచ్చింది ....... 
మొన్న రైల్వే స్టేషన్ లో చూసాను . చాలా మంది కూలీలు , 
ఆడవాళ్ళు మగవాళ్ళు ,పక్కన బిందెలు , కట్టెలు , బట్టలు . 
ఇంత తుఫాన్ లో ఎక్కడికి పోతున్నారు ! 
గుంటూరు నుండి వచ్చిన కూలీలు అంట . నారేతలు వేస్తారు అంట. 
రోజు కూలీ కాదు , ఎకరానికి ఇంత అని కాంట్రాక్ట్ . వాళ్ళ పని నచ్చి ఇక్కడ 
వాళ్ళు ఇంకొంచెం అదనంగా కూడా ఇస్తారంట . వానలు పడుతున్నాయి 
అని చూసుకుంటే కుదరదు , నారు ముదిరి పోతూ ఉంది . 
( ఇది ఇక్కడ వాళ్ళ పొట్ట గొట్టినట్లు కాదా ,ఏమో మరి !) 
వ్యవసాయం వ్యాపారపు హంగులు అద్డుకుంటూ  ఉంది .
తప్పదు లాభం , నష్టం అనేవి మన ప్రాణాలతో చలగాటం ఆడే 
స్థాయి  వచ్చేసినాక రైతు కూడా వ్యాపార మెళుకువలు నేర్చుకోవాల్సిందే !
నేర్చుకోకపోతే వచ్చిన ఇంకో పని చూసుకోవాల్సిందే . 

మరి మనకు తిండి గింజలో .... అనవాకండి . 
అన్నపూర్ణ ఏమవుతుంది . అన్నం పెట్టె దేవుడు రైతు , 
రక్తం తో తడిసి పుడుతుంది వడ్ల గింజ , కాకుంటి రైతు 
తెల్లని చెమట రక్తం తో .... ఇలాంటి ఎమోషన్స్ ఇప్పుడు 
వద్దు . 
ఇలాంటి సెంటిమెంట్స్ తరువాత ,ముందు సమస్య ఎక్కడ ? ఎలా 
ఉంది ? కొత్త వి ఇంప్లిమెంట్ చేస్తూ , పాత లోపాలు పూడ్చుకోవడం ఎలా 
అని కార్పోరేట్ కంపెనీ లాగా ఆలోచించండి . 
ఈ రోజు శంకర్ కార్టూన్ చూస్తె ఇవే మనసుకు వచ్చాయి . 
సానుభూతి మాటలు కావాల్సిందే ,కాని అవి మాత్రమె 
పని జరిపిస్తాయా ? చూడండి . యూనివర్సల్ టాపిక్కి  
పనికొచ్చే సైలెంట్ కార్టూన్ . 



పనిలో పని ... నా కార్టూన్ కూడా . రైతు మొక్కలు నాటే టప్పుడు 
ఎంత ఆశగా ఉంటాడో , అవి ఆక్ట్ ఆఫ్  గాడ్ లేదా మనుషుల్లోని 
రాజకీయ గ్రద్దలు తన్నుకుని పోయేటపుడు ఎలా ఉంటాడో చూడండి . 


ముందు వ్యవసాయాన్ని వ్యాపారం అనుకుంటే కొంత పరిష్కారం 
ఆలోచించవచ్చు . 
వ్యాపారానికి ఏమి కావాలి ? 
పెట్టుబడి ,ప్లానింగ్ ,కార్మికులు , పబ్లిసిటీ , మార్కెటింగ్ . 
ఇలాగా వాళ్ళు ఎడ్యుకేట్ అయితే బాగుంటుందేమో !  
పెట్టుబడి లో యెంత తాము పెట్టగలరు , బాంక్ నుండి యెంత 
తేగలరు ,యెంత బయట వడ్డీ కి తేవాలి ? 

మొదలు పెట్టె పంట కు డిమాండ్ ఉందా ? వ్యవసాయ అధికారుల 
సలహా పొందగలమా ? అసలు పంట సరియన సమయం లోనే 
మొదలు పెట్టామా ?
కొత్త పద్దతులు ,నైపుణ్యాల పెంపుదల 
అంతర పంటలు వేయడం , గట్లు వెంబడి వేయగల 
పంటలు వేసి కుటుంభ ఖర్చు కు ఉపయోగించుకోవడం . 
పశువులు ,కోళ్ళు పెంచుకోవడం . వాటికి కావలిసిన 
ఆహారాన్ని తానె ఉత్పత్తి చేసుకోవడం . 

పంటలు మార్చి వేయడం , ఎరువుల ఖర్చు , 
పురుగు మందుల ఖర్చు తగ్గించే ప్రక్రియల వైపు 
ఎడ్యుకేట్ అవ్వడం .

వర్షాలు వరదలు ,కరువు లాంటి వాటికి మనం ఏమి 
చెయ్యలేము ,కాని  చిన్నపాటి ఆదాయం వచ్చే 
కుటీర పరిశ్రమలు ఉంటె బాగుంటుంది . 

ఇక వర్షపు నీరు నిలువ చేయడం , చెరువుల్లో 
పూడిక , గట్లు బాగు చేసుకోవడం , పెద్ద కమతాలు గా 
వ్యవసాయం , నీళ్ళలో ఎక్కువ రోజులున్నా , తక్కువ 
నీరున్నా పాడవని విత్తనాలు వాడటం . 

ఇవన్నీ అందరికీ తెలిసినవే . ఇంకా మీకు ఏమైనా తెలిస్తే 
చెప్పండి . భవిష్యత్తు లో ఇది చూసిన  వారికి ఇలాగా 
అప్పట్లో ఉండేది అని తెలుస్తుంది :-) 
సానుభూతి వలన ప్రయోజనం లేదు , చాలా మంది 
దగ్గర స్మార్ట్ ఫోన్స్ లో  ఇలాటి విషయాలు వాళ్లకు ఎక్కువగా 
ప్రచారం చేస్తే బాగుంటుంది . మాకెందుకు అవన్నీ ప్రభుత్వం 
పనులు అనుకుంటున్నారా ? ధరలు చూసారా ?
మీ జీతం మారలేదు అనుకుంటున్నారు ఏమో ? మీకొచ్చే 
సామాన్లు విలువతో పోలిస్తే మీకు ఇప్పుడు జీతం సగం అయినట్లు లెక్క . 

మా బాబు రెండు నెలల క్రితం '' ఆకృతి 3డి సొల్యుషన్స్ '' లో 
''స్మార్ట్ విలేజ్ / సిటీ '' లో పాల్గొంటూ ఉంటె నేను ఒకటే మాట 
చెప్పాను . 
''రేయ్ , ప్రైజ్ రావడం ముఖ్యం కాదు . రైతు కు పనికి వచ్చేది 
కనిపెట్టారా , రైతు దెబ్బ తినేది ముఖ్యంగా నిలువ ఉంచుకోలేక 
పోవడం వలన , తన సరుకు అవసరం ఎక్కడ ఉందొ తెలుసుకోనలేక 
పోవడం వలన , వీటికి పరిష్కారాలు ఆలోచించరా '' అన్నాను . 

ఎలాగు ఏదో ఒక విషయం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము . 
అదేదో ఇలాగా అందరి మేలుకు ఉపయోగపడే ఆలోచన 
చేస్తే యెంత బాగుంటుంది ! మరి ఇప్పుడే ఆలోచించండి . 
                         @@@@@@@@  





Tuesday 17 November 2015

అనుకోని అతిధి

''పొద్దునే  వచ్చిన వానా ,పొద్దు పోయి వచ్చిన చుట్టం 
పోనే పోరు '' 
అనుకోని అతిధులు వచ్చినా హోస్టింగ్ చేయడం ఎలాగో నాకు 
తెలుసు . కాని నేను అతిధి గా వెళ్ళాల్సి రావడం చాలా ఇబ్బంది 
అనిపించింది . 
అబ్బ ఏమి వర్షాలు .... ఏమి వరదలో  ఏమిటో ! 
అటు చెన్నై నుండి ఇటు నెల్లూరు వరకు అందరినీ తల క్రిందులు 
చేస్తూ ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని పరిగెత్తే టట్లు చేస్తున్నాయి . 
అటు చిత్తూరు ,ఇటు నెల్లూరు , కడప , ఇక తిరుమల కొండ 
  ,పొంగని వాగు వంక , నది లేదు . దేవుడు సముద్రాన్ని 
సృష్టించబట్టి ఇన్ని నీళ్ళు తనలో దాచుకుంటుంది కాని లేకుంటే 
ఈ నీళ్లన్నీ ఎక్కడికి పోవాలా !!!! 
ఉదయం వాన మబ్బు లో  ఇక పోలేము స్కూల్ కి అనుకున్నాను . 
అక్కడ క్వార్టర్స్ లో ఉంటూ ఇక్కడికి వస్తూ అటో కాలు ఇటో కాలుగా 
ఉన్నాను . మొన్న ఈయన గారు టూ వీలర్ పై నుండి పడి 
ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటి నుండి , ఒక్కరినే వదలాలి 
రాత్రి  అంటే  భయంగా ఉంది . పక్కన తోడూ , కాసింత వెచ్చదనం , 
ఊరట ఇచ్చే మాట , జీవితం లో ఒక పార్ట్ అనుకొనే దశ నుండి 
అవసరం అనుకొనే  దశకు వచ్చేసినట్లు ఉన్నాము . 
రెక్కలు వచ్చిన చిన్న పక్షులు ఎప్పుడో గూడు విడిచి ఎగిరిపోయి 
వాటి బ్రతుకు పోరాటం లో మునిగిపోయి ఉన్నాయి . 
ఏదో భారత దేశ గృహస్తు జీవన విధానం పుణ్యమా అని ఒకరికి ఒకరం , 
ఈ పద్దతే లేకుంటే ఒంటరి బ్రతుకే నేమో !!!
ఉదయాన్నే చూస్తే న్యూస్ పేపర్ టైం కి వచ్చేసి ఉంది . 
''అరె  చిన్న పిల్లవాడు ఇంత వానలో సమయానికి పేపర్ 
అందిస్తే , పెద్దవాళ్ళం   కర్తవ్యాన్ని నిర్వహించొద్దా ?'' ఆత్మ సాక్షి 
ప్రశ్నిస్తూ  ఉంది. రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోయాము . 

ఇంటికి వెళ్ళే వేళకి చుట్టుకున్న ప్రశ్నలు అందరి దగ్గర నుండి , 
''ఎలా వెళుతారు ? సూళ్ళూరు పేట నాలుగు పక్కల నీళ్ళే , 
మీ ఇంటికి దారి ఎక్కడ ఉంది ? ''
దేవుడా హై వే  పై దారి మూసుకోనక ముందే ఇంటికి చేరాలా !
ఆటో తో బస్ క్రాస్స్ చేసి ఎక్కేసాము హమ్మయ్య అనుకుంటూ . 
సరిగా మూడు కిలో మీటర్లు వెళ్ళగానే బస్ ఆపేశారు . 
నిమిషాల్లో ముందు వెనుక లారీలు , బస్ లు పై నుండి 
వర్షం . హై వె రెండు వైపులా కాళింగి నది నుండి పొంగిన నీళ్ళు . 
వరుసలో మాది పదో బస్ . రోడ్ మీదకు వచ్చిన ప్రవాహం 
 తగ్గితే వెళ్లిపోతాము అనే ఆశ . నిముషాలు అర గంటగా
మారిపోయిన తరువాత , ఇక ఏవి అవతలకి వెళ్ళవు అని కబురు . 
చెన్నై నుండి వస్తున్న పసి బిడ్డలు పాలకి అప్పుడే ఏడుపు మొదలు పెట్టారు . 
ఊరికి ఇంత  దూరం లో ఏమి దొరుకుతాయి ?

ఇంకా ఇంటికి వెళతాము అనే ఆశ చావలేదు . దిగి వాహనాల వరుస 
వెంబడి ముందుకు వెళ్లి చూసాము . ఉరకలు వేస్తూ రోడ్డు కు ఆ వైపు నుండి 
ఈ వైపు యెర్రని నీళ్ళ ప్రవాహం . ముందు నిలబడిన రెండు బస్ ల టైర్లు మునిగి 
వాటిలోకి నీరు వెళ్లి పోతూ ఉంది . అవి కూడా పడిపోతాయో ఏమో ! అలా 
ఊపెస్తున్నాయి నీళ్ళు . అంతా  అధికార యంత్రాంగం , పోలీస్ లు 
మీడియా నిలబడి , ఆదిలిస్తూ హెచ్చరికలు చేస్తూ బాధ్యతలో తల మునకలుగా 
ఉన్నారు . మమ్మల్ని చూసి వెనక్కి వెళ్లి పొండి , ఈ రోడ్డు కూడా మునిగి
 పోతూ ఉంది  అన్నారు .    
వెనక్కి నలుగురం నడక ప్రారంభించాము . ఇలా యెంత దూరం నడవడం !
భయం , చలి తడి బట్టలు, పాదాలు ముందు కు వెళ్ళ మని మొండికేస్తున్నాయి . 
ఇళ్ళ దగ్గర నుండి అందరికీ ఫోన్ లు , ఎక్కడ ఉన్నారు అని భయంతో 
కూడిన ఆరాలు . మూడేళ్ళు పిల్లల గలిగిన వాళ్ళ కళ్ళ నుండి నీళ్ళు 
ఉబుకుతున్నాయి . మనసు ఇంటికి లాగుతుంటే , పాదాలు తప్పనిసరై 
వెనక్కి వెళుతూ ఉన్నాయి . ఎన్ని కార్లు ను బ్రతిమిలాడినా ఎక్కించు 
కోవడం లేదు . అదిగో ఆటో ! ప్రాణం లేచి వచ్చింది . 
వంద అయితే వస్తాను , ప్రాణ సంకటం లో డిమాండ్ గెలుస్తుంది . 
ఎక్కగానే ఇంకో ఫోన్ . హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుండి బయలుదేరింది . 
''బాబు రైల్వే స్టేషన్ కి పోనివ్వు '' చెప్పాము . 
శ్రీహరి కోట సర్కిల్ కి రాగానే అర్ధం అయింది ,సూళూరు పేట 
మొత్తం జల దిగ్భందమే !! నేను నీళ్ళలోకి రాను అని మొండికేసాడు ఆటో . 
లోపలి కి  వెళ్లక పొతే రైలు వెళ్ళిపోతుంది , ఉన్న ఒక్క ఆశ చేజారినట్లే !
మా ఏడుపు మొహాలు చూసి , సరే బై పాస్ మీద ఆ వైపుకు తీసుకువెళతాను . 
ఆ వైపుకు వెళ్ళాము . చెంగాళమ్మ గుడి కి వచ్చేసరికి రోడ్ మీద నీళ్ళు 
పొంగుతూ .... ఇక ఇటు వెళ్ళ లేమా , ఒక్క సారి నిరాశ అందరిలో 
ఉప్పెన కంటే పెద్దదిగా ముంచేస్తూ . ముందు నడుము లోతు 
నీళ్ళు , కాళింగి నది గేట్ విరిగి పొంగిపోయింది . అందరిలో చిన్న 
తెగింపు . ఎలాగోలా దాటేద్దాము కానీండి , లేకుంటే ఇక ఊర్లోకి 
వెళ్ళలేము . ఇంకా నీళ్ళు వచ్చేస్తున్నాయి . 
డివైడర్ను  కాళ్ళతో నీళ్ళలో తడుముకుంటూ నడుస్తున్నాము . 
ఉన్నట్లుండి ప్రవాహానికి తూలీ పడిపోతూ పక్క వాళ్ళను 
పట్టుకుంటూ దాటేసాము . అందరం నీళ్ళు కారిపోతున్నాము . 
పళ్ళు కట కట కొట్టుకుంటూ .... తుపాను చలి ( ఎపుడైనా చూసారా ? )
మళ్ళీ ఆటో ,రైల్వే స్టేషన్ వైపు పోతూ ఉంటె అందరిలో ఆశ , 
వెళ్లి  పోదాములే  ఇంటికి . లోపలి వెళ్ళగానే ప్లాట్ పాం నిండా జనాలు . 
కూర్చొను కూడా స్తలం లేదు . అంతా చలి లా ముసురుకున్న దిగులు . 
ఇంతలో పిడుగు లాగా న్యూస్ . '' హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ఇటు 
రాదు , గుత్తి వైపు మళ్ళించారు '' 
ఒక్క సారి అందరిలో అప్పటిదాకా కూడకట్టుకున్న శక్తి ఏమైందో !!
ఉసూరుమంటూ ..... ఇక ఏమి చేస్తాము , స్కూల్ కి వెళదాము 
తిరిగి . అక్కడ ఉన్న చిన్న క్వార్టర్స్ లో ఉన్న వాళ్లకు పోగా 
మాకు పొడి బట్టలు , దుప్పటి దొరుకుతాయా !అన్నం 
దిగుల్లేదు . అసలు ఈ దిగులుకు ఆకలి వేయడం లేదు . ఫోన్ లు 
రావడం లేదు . బి ఎస్ ఎన్ ఎల్ టవర్ పోయింది . ఎక్కడా 
నో సిగ్నల్ . చుట్టూ చీకటి . ఆటో వాళ్ళను నమ్ముకొని అంత 
దూరం పోవాల్సిందే . వాన ఆగడం లేదు . 
సరే నైటీ అన్నా కొందాము . 
''ఈ రోజు సోమవారం ఎక్కడా షాప్స్ ఉండవు ''సమాధానం . 
ఇక్కడ షార్ ఉద్యోగులు అందరు ఆదివారం షాపింగ్ చేస్తారు కాబట్టి , 
ఆదివారం సెలవు ఉండదు . సోమవారం సెలవు షాప్స్ కి . 
షాప్ దగ్గర దిగేసరికి అక్కడే మా బంధువులు ఉండే విషయం 
గుర్తుకు వచ్చింది . మిగిలిన వాళ్ళను వదిలి ఎలా వెళ్ళేది !
వాళ్ళది పాపం చిన్న ఇల్లు . విషయం చెప్పాను . మేడమ్స్ 
''మీరు వెళ్ళండి . మేము స్కూల్ కి వెళతాము '' చెప్పారు . 

నిజానికి వాళ్ళు పెద్దగా తెలీదు . నాన్న వాళ్ళ పిన్నమ్మకు 
మనుమడు . ఎప్పుడైనా నాన్న తో వెళ్ళినపుడు చూస్తాను . 
ఇప్పుడు వెళ్ళాలి తప్పదు . వెళ్లాను . ముందు షాప్ . 
వెనుక ఇల్లు . పెద్ద ఇల్లు కాదు . రెండు మంచాలు పట్టే రూం . 
వెనుక వంటిల్లు . వెనుక పెరడు . ఒక మంచం మీద పిల్లలు 
పడుకొని ఉన్నారు . పాప మూడు , బాబు ఆరు తరగతులు . 
ఎంతో  ప్రేమగా ఆహ్వానించారు . సునీల్ నా కోసం వెంటనే 
వెళ్లి పాల పేకెట్ తెచ్చి కాఫీ పెట్టించాడు . నాకు ఇబ్బందిగా 
ఉంది , వాళ్లకు భారం అవుతాను అని . నిజానికి 75 ఏళ్ళనాటి 
ఇల్లు . ఆ మంచాల దగ్గర తప్ప మిగిలిన దారిలో చుక్కలుగా 
నీళ్ళు పడుతూ ఉన్నాయి . పాత కాలం గచ్చు పీలుస్తూ 
ఉంది . ఇంత అసౌకర్యం లో కూడా సునీల్ , బాగ్య నా సౌకర్యం 
కోసం తపన పడటం వాళ్ళ ఔదార్యాన్ని సూచిస్తూ ఉంది . 
పొడి బట్టలు తెచ్చి ఇచ్చింది . కాఫీ త్రాగేసరికి కొంచెం 
అక్కడకు అలవాటు పడ్డాను . పిల్లలు కబుర్లు చెపుతూ 
ఉన్నారు . కొత్త పెదమ్మ వాళ్లకి కొత్త గా ఉంది . 
వాళ్ళ వోడాఫోన్ నుండి మా ఎదురింటి వారికి అక్కడ 
నా క్షేమ సమాచారం అందించి , మా వారిని కొంచెం గమనించుకోమని 
చెప్పాను . వాళ్ళు అందరు పక్కన కూర్చొని క్షేమ సమాచారాలు 
మాట్లాడటం , బంధువుల విశేషాలు , పిల్లల ముద్దు మాటలు ... 
ఎన్ని రోజు అయిందో మన వాళ్ళతో ఇలా గడిపి !ఏదో ఒక 
రొటీన్ చక్రం  లో టార్గెట్ ల వెనుక పరిగెత్తడం అలవాటు , 
ఇదేదో కొత్తగా ఉంది . చక్కగా వేడి కారం దోసాలు తిని 
నిద్ర లేచే సరికి ,ఇంటి ముందు ఎక్కడిదో చిన్న పిల్లి పిల్ల , 
ఎవరో వదిలేసారు . పిల్లలు దానితో ఆడుకుంటూ ఉంటె , 
నేను ఎంజాయ్ చేస్తూ .... వాళ్ళ బుక్స్ చదివించి అలవాటు 
ప్రకారం ఐ క్యూ చూసాను . పాప కరక్ట్ గా ఉంది . బాబు తెలుగులో 
డల్ . చిన్నప్పుడు చదువుతూ వ్రాయించని ఫలితం . 
బాబుకి కౌన్సిలింగ్ ఇచ్చాను . కొత్త వాళ్ళ మాటలు తల్లి తండ్రుల 
తిట్లు కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి . 

తిరిగి స్కూల్ కు వెళుతూ ఉంటె సునీల్ బాగ్య 
''ఇది మీ అవ్వ గారిల్లు కూడా . మీరు ఎప్పుడైనా రావొచ్చు '' 
ఇంతకంటే ఒక గృహస్తు జీవనానికి పరీక్ష ఏమి ఉంటుంది . 
వాళ్ళు ఎప్పుడో గెలిచారు . 
అనుకోని అతిధి లాగా వచ్చిన వాన కూడా ఇలాగా సింపుల్ 
గా వెళ్లిపోవాలి కాని ఇలాగా జనాల్ని బాధ పెడితే ఎలా !
''రెయిన్ రెయిన్ గో అవే , కం అగైన్ అనదర్ ఇయర్ '' 
                       @@@@@@@ 
                          



  

Saturday 7 November 2015

కంచె ..... ఇంకొన్ని మాటలు

 '' కంచె '' ఎప్పటిది . ఇప్పుడు వ్రాస్తున్నాను . చూడాల్సిన 
వాళ్ళు అందరు చూసి రేటింగ్ ఇచ్చెసినాక . ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో 
క్రిష్ ఊపిరి పీల్చుకొని ఉంటాడు . మరి మా సీ సెంటర్స్ కి ఇప్పుడే 
వచ్చింది . ఇక ఇప్పుడే కదా చూస్తాము . 

అసలు ఈ ఫోటో పెట్టడానికే కొంత సేపు పట్టింది . ఎందుకంటె క్రిష్ చూపిన రెండు 
కోణాలు దీనిలో ఉండాలి అనుకుంటే ఈ ఫోటో ఆప్ట్ అయింది . 
నాకు ఫేస్ బుక్ నుండి మా పాప నుండి బాబు నుండి ముందే రివ్యు 
వచ్చేసింది . నువ్వు చూడాల్సిన సినిమా మా ,తప్పకుండా వెళ్ళు . 
ఎప్పుడు వస్తుందా అని అప్పటి నుండి వాల్ పోస్టర్స్ ని గమనిస్తూ 
ఉన్నాను , శ్రీవారిని కొంచెం ముందే మోటివేట్ చేసి . పిల్లలు చెప్పారు 
అంటే సినిమా నన్నేమి నిరాశ పరచదు ,ఖచ్చితంగా . 

సినిమా కధ కు వస్తే రెండో ప్రపంచ యుద్ధం నేపద్యం లో 
కులాలు అంతరాలు ఎదిరించి కలిసి పోవాలి అనుకునే 
ఇద్దరు ప్రేమికుల కధ . లవ్ అండ్ వార్ ఎప్పుడూ మానవాళి కి 
ఇంటరెస్టింగ్ విషయాలు . రెండిటిలో చిక్కటి స్క్రీన్ ప్లే ,ఘర్షణ 
ఉంటాయి . వీటికి సంభందం ఎలా కలిపాడు క్రిష్ అనేది ఇంకా 
ఇంటరెస్టింగ్ . వాళ్ళు కలిసారా లేదా అనేది ఆ రోజులకే కాదు 
 ఈ రోజు పరిస్త్తితుల్లో కూడా సాహసికమైన కధ . 

హీరో హరి  చిన్న కులం ,హీరోయిన్ సీత  జమిందారులు . 
కలపడమే మద్రాసు  లో కలిపేస్తాడు క్రిష్ . ఎక్కువ టైం 
తీసుకోకుండా ఒక్క పాటలోనే వాళ్ళ మధ్య ప్రేమను 
వండర్ఫుల్ సెల్యులాయిద్స్ గా మనసుకు తగిలించేస్తాడు , 
ఎప్పటికీ మాసిపోని గుర్తులుగా . ముందే తన ఊహల్లో ఆ ఫోటో 
ప్రేమ్స్ తీసుకొని ఉంటాడు . అలాగే దించేసాడు .
హీరో గా వరుణ్ తేజ , హీరోయిన్ గా ప్రజ్ఞ చాలా బాగున్నారు . 
''ఏమోయ్ షేక్ స్పియర్ '' అని హీరో చిన్న కవితలకు మురిసిపోయి 
సీత అందం బాగుంది . కాక పోతే కవితలు కాబట్టి 
''ఏమోయ్ కీట్స్ '' అనాలేమో . పర్లేదు . హృదయాలు ఒకటైనపుడు 
పేర్లు వాటికి సంభందించిన పరువు , పలుకుబడి , అంతస్తు 
అధికారం ,అవేమి అవసరం లేదు . చివరికి వాళ్ళ సొంత పేరుతో సహా . 

హీరోయిన్ కాస్ట్యూమ్స్ గూర్చి ఖచ్చితంగా చెప్పుకోవాలి . 
ఎవరు చెప్పారు విప్పుకుంటేనే  అందం అని , చక్కగా చీరలో 
యెంత బాగుందో !  కుటుంభం లో అందరం హాయిగా 
చూడొచ్చు . 
పాటలు , సంగీతం చాలా బాగున్నాయి . 
ముఖ్యంగా ఆ యుద్ధ వాతావరణం , పల్లె వాతావరణం 
అక్కడ దేశాలు మధ్య ఏర్పడ్డ కంచెలు , ఇక్కడ మనసుల మధ్య 
కొందరి వలన ఏర్పడిన కంచెలు .... ఒక్కో సీన్ అక్కడ కొంత 
ఇక్కడ కొంత పేర్లల్ గా చూపించడం , నిజంగా క్రిష్ కత్తి 
మీద సాము ని సక్సెస్స్ గా చేసాడు . అసలు ఈ రోజుల్లో 
ఈ కధ  తీసుకోవడమే ఈ టీం చేసిన సాహసం . 
ముఖ్యంగా ఒక అమ్మాయి జర్మన్ సేనలు ముందు నగ్నంగా నిలబడి 
వీళ్ళను కాపాడటం , శ్రీనివాసులు ఏడుస్తూ నీవు నా తల్లివి 
అని మనసు మార్చుకోవడం ,నిజమే మనది కాని శరీరం 
లోని నగ్నత  మన మాత్రుత్వాన్నే గుర్తు చేస్తుంది కానీ 
కోరిక రగిలించదు . యుద్ధం మధ్యలో చిన్ని పాపను 
చూపడం సినిమాలో భాగం అనుకున్నాను కాని పాపే 
ఈ సినిమాకి కేంద్రం అయిపోతుంది అనుకోలేదు . 
పాపను రక్షించడం .... 
చివరికి పాప కోసం అందరు ప్రాణాలు ఒడ్డి పోరాడటం గ్రేట్ . 

మధ్యలో హీరో చేత చెప్పిస్తారు ...... మనది ఎంత ఊరు , 
ఇంత ప్రపంచం లో , ఇంత గ్రహ కూటమి లో ,ఇంత విశ్వం లో 
మనం ఎంత . దీనిలో మనం దేని కోసం పోరాడటం . 
ఎక్కడా పోరాటమే , చివరికి ఆ చిన్ని పాప కూడా 
పాలు కోసం కాదు ప్రాణాలు కోసం పోరాడుతుంది . 
దానికి పాపం పుట్టాను అనే సంగతే తెలీదు . ఇక చావు గురించి 
తెలిసే అవకాశమే లేదు . ఎవరి కోసం చేస్తున్నాము ఇన్ని 
యుద్దాలు ముందు తరాలలో పుట్టబోయే వారిని కూడా 
ఫణం గా పెట్టి ...... వరుణ్ తేజ చేసిన రెండు సినిమాలలో 
స్పిరుచ్యువల్ బేస్ ఉండటం యాదృచ్చికం కావొచ్చు . లేదా అతని 
పాషన్ కావొచ్చు . కాని ఎందుకో ఈ వాక్యాలు మాత్రం క్రిష్ 
మైండ్ లోవి కాదు హృదయం లోవి అనిపించింది . 

సాయి మాధవ్ బుర్రా గురించి చెప్పుకోక పోతే ఈ రివ్యు కే  పెద్ద లోపం 
సీత చెపుతుంది హర్ష తో .. నన్ను మొదట ప్రేమించిన మగాడు అర్జున్ 
మా అన్నయ్య '' అని దేనిని నేను వదులుకోను అనే ప్రేమ , స్త్రీ 
సహజత్వాన్ని చిత్రిస్తూ , ఇక అర్జున్ చెప్పే మాట '' ఆఫ్ట్రాల్ స్త్రీవి '' 
మొత్తం వాస్తవ దుస్థితి రిఫ్లెక్షన్ ,
ఇంకా బామ్మ చెప్పే డైలాగ్ మనం మన గర్భాలలొ వారసులను కనివ్వడానికే , 
అదే గొప్ప అనుకోని సర్దుకుని పోవాల్సిందే . 
ఇంకా సైన్యం లో ఊరికినే చేరి కష్టాలు ను విసుక్కున్న శ్రీనివాసులు 
మారిపోయి పాపను రక్షిద్దాము  అన్నప్పుడు హీరో చెప్పే మాట 
''ఇప్పటిదాకా సైన్యం లో ఉన్నావు . ఇప్పుడు సైనికుడివి అయినావు '' 
నిజమే మనం కూడా ఇప్పటిదాకా మనుషుల్లో ఉన్నాము కాని 
మనిషి అయినామో లేదో తెలీడం లేదు . 
ఇక చివరగా ఒక్కటి ...... 
నేనంటే ఇష్టమా షేక్స్ పియర్ అన్న సీతతో 
''కాదు ప్రేమ '' 
''రెండింటికి తేడా ఏమిటి అంటే ''
''ఇష్టం ఉంటె రోజా పోవును కోసేస్తాము , 
ప్రేమ ఉంటె దానికి నీరు పోస్తాము '' 
ఎక్సలెంట్ . రెండికీ తేడా తెలీకనే ఈ కత్తి పోట్లు , 
ఆత్మ హత్యలు , ఆసిడ్ దాడులు . 

ఎటో పరిగెత్తుతున్న జనాలను విశ్వ మానవులుగా 
ఆలోచింప చేయడం లో ఈ సినిమా సూపర్ సక్సెస్ . 
ఎప్పుడూ  జేబు కోసం కాదన్నయ్యా ..... జనాల మంచి కోసం 
కూడా సినిమాలు తియ్యాల ..... అంతేనంటారా :-) 

Tuesday 18 August 2015

నవ తెలంగాణా లో నా బ్లాగ్ పరిచయం

నవ తెలంగాణా లో నా బ్లాగ్ పరిచయం 
నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది . 
నవ తెలంగాణా పత్రిక వారు నా బ్లాగ్ పరిచయం వ్రాయడం . 
వ్రాసిన శైలి నాకు చాలా నచ్చింది . 
నా బ్లాగ్ నాకు చిన్న పర్ణ శాల లాంటిది . 
దానిలో ఉన్నవి అన్నీ నాకు అపురూపమే . 

దాని గూర్చి ఇలాగా వ్రాయడం నాదైన ప్రపంచాన్ని 
ఆత్మీయంగా ఇకొకరు పలకరించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది . 
నవ తెలంగాణా థాంక్యు . 
ఇంకా నా బ్లాగ్ నిర్మించడం లో తోడ్పడిన వారు అందరికీ 
నా కృతజ్ఞతలు . 
( blog introduction link here )


''ఛా.. ఎంత బాగా రాయాలనుకున్నానో పుష్కరాల గురించి... 144ఏళ్ళకే మళ్ళీ వచ్చేది అని చెప్పారు. సరే బ్లాగులో రాద్దాం రేపు మా మనవళ్ళు, మనవరాళ్ళు చూసి సంతోషపడతారనుకున్నాను. కాని తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను...'' అంటూ పుష్కరాలలో చనిపోయిన వారి గురించి రాస్తూనే జాగ్రత్తలను కూడా వివరించారు శశికళ గారు తన బ్లాగులో... అంతలా అందరి గురించి ఆలోచించే శశి... ''ఇప్పటికీ నాకు ఏమీ తెలీదు... '' అంటూ బ్లాగుకి ట్యాగ్‌లైన్‌ ఇచ్చుకుంది. ఇదేనేమో ఎంత తెలిసినా ఒదిగి ఉండాలనే. ఈ శశి ప్రపంచం బ్లాగును ఒకసారి సందర్శిద్దామా!
'' సిస్టం వచ్చిన కొత్తలో ఏవైనా మంచి రచనలు చూసినపుడు పత్రికలకు అభిప్రాయాలు పంపేదాన్ని. అప్పుడు మీకు ఇంట్రెస్ట్‌ ఉంటే నా బ్లాగ్‌ చూడండని ఒక మహానుభావుడు తన బ్లాగు ఐడి పంపారు. ఆయనెవరో నాకు తెలీదు. కాని ఇలా ఒక బ్లాగ్‌ లో రచనలు అన్నీ చూడడం మంచి మాధ్యమంగా అనిపించింది. అక్కడ అన్నీ క్లిక్‌ చేసి చూసుకుంటూ నేను కూడా బ్లాగ్‌ మొదలు పెట్టాలనుకున్నాను. కాని ఎలా మొదలుపెట్టాలో నాకు తెలియదు. నెట్‌ సెంటర్‌కి వెళ్ళి అక్కడ అందరినీ అడిగాను. ఎవరూ తెలియదన్నారు. నిరాశగా ఉన్న నాకు.. అప్పుడే వచ్చిన ఆ అబ్బాయిని అడిగి చూద్దాం అనిపించింది. మీకు బ్లాగు గురించి తెలిస్తే చెబుతారా? అని అడిగాను. ఆతను వెంటనే బ్లాగ్‌ ఓపెన్‌ చేసి పోస్ట్‌ లు వేయడం నేర్పించాడు. అలా ఒకొక్కరి సహకారంతో 2011 నుంచి బ్లాగు రాయగలుగుతున్నాను అంటున్నారు శశి.
బ్లాగు దేశ విదేశాల మధ్య తెలుగు వారధిలా ఉంటుంది. కాబట్టి మన అభిప్రాయాల వల్ల ఎవరి గౌరవానికి భంగం కలగకుండా రాయడం మంచిదన్న విషయాన్ని ప్రతి బ్లాగరు నిర్వర్తించే నియమం. అలాగే శశి తన బ్లాగులో సామాజిక అంశాలు, రాజ'కీ'యాలు, పుస్తక పరిచయం, సినిమా పరిచయం, స్ఫూర్తి, మధురిమలు, కబుర్లు, అనుబంధాలు, కథలు... ఇలా ఎన్నో విషయాలను కథల రూపంలో షేర్‌ చేస్తూ... నొప్పించక తానొప్పగ అన్నట్లుగా రాస్తుంటారు.
స్కూలు టీచర్‌గా పనిచేస్తున్న శశికళకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. స్కూల్లో పిల్లలు కథలు చెప్పమన్నప్పుడు అప్పటికప్పుడు కథలను అల్లుతారు కూడా. అంతలా ఇష్టం సాహిత్యం అంటే. అందుకే తన బ్లాగులో ఎన్నో విషయాలు కథల రూపంలోనే ఉంటాయి. అంతేకాదు, ఈమెకు మాట్లాడటం అదే కబుర్లు చెప్పడమంటే చాలా ఇష్టం. ఇష్టమైన సినిమా రోజా, సంగీత దర్శకుడు రెహమాన్‌. రైలు బడి, సుభాష్‌ పత్రి పుస్తకాలంటే ఎంతో ఇష్టం. అంతేకాదు, ఏ విషయమైనా తెలియకపోతే తెలియదని నిజాయితీగా ఒప్పుకుంటే... దాని గురించి నేర్చుకునే అవకాశం ఉంటుందన్న నియమాన్ని ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటానంటున్న
శశికళ ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే వెంటనే  ఇది శశి ప్రపంచం  బ్లాగును సందర్శించండి

Thursday 30 July 2015

కలాం గారిని తలుచుకుంటూ

మొన్న 27/7/2015 షిల్లాంగ్ ఐ . ఐ . ఎం లో విద్యార్ధులతో 
ప్రసంగిస్తూ ఏ . పి . జె . అబ్దుల్ కలాం గారు కుప్ప కూలిపోయి 
పరమపదించారు అనే విషయం తెలిసి నప్పటి నుండి మనసు 
మనసు లో లేదు . పైకి బాగున్నా మనసులో ఏదో బాధ బరువుగా .... 
కన్నీళ్ళ విలువ ఇలాంటప్పుడే తెలుస్తూ ఉంటుంది . కాని అవి 
కూడా రావడం లేదే !!
ఎంత బాధలో ఉన్నా కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం అనేది 
ఉద్యోగులందరికీ అనుభవమే . ప్రిన్స్పాల్ గారితో మాట్లాడి 
ఆయనకు శ్రధ్ధాంజలికి అన్ని ఏర్పాట్లు పూలమాల తెచ్చి సభ 
ఏర్పాటు చేసాము . వారి బాల్యం ,సుభాషితాలు , అవార్డ్లు 
నిరాడంబరత ఇలా ఒక్కొక్కరు మేడమ్స్ ఒక్కో కోణాన్ని పిల్లల 
ముందు ఆవిష్కరించారు . పెద్ద వాళ్ళు వెళ్లి పోయినపుడు 
ఆ స్పూర్తిని విద్యార్ధులకు అందించి మంచి తరాన్ని చేయడం 
మా టీచర్ వృత్తిలో బాగం . 
నా వంతు  వచ్చేసరికి ఏమి చెప్పాలి . మైండ్ కి మనసుకు ఎక్కడో 
సమన్వయము లేదు . ఆయనను దగ్గర నుండి చూసిన 
జ్ఞాపకాలే మనసులో తిరుగుతున్నాయి . ఆయనను చూసిన 
అనుభవమే చెప్పాను . సమైఖ్యాంధ్ర స్ట్రైక్ లో బస్ లు లేకపోయినా 
జిల్లా నుండి ఎనిమిది మంది సెలెక్ట్ కాబడిన విద్యార్ధులను తీసుకొని 
హైదరాబాద్ కి ఆయన సభలో పాల్గొనడానికి వెళ్ళిన సంగతి 
చెప్పాను . గొప్పవారిని చూసే అవకాశం వచ్చినపుడు ఎంత 
కష్టం అయినా ఎదుర్కొని ఎలా వెళ్ళాలో చెప్పాను . ఆయనను 
చూడగానే మనసు ఎంతగా పొంగిపోయిందో చెప్పాను . పిల్లలతో 
ఆయన తన భావాలను ఎంత చక్కగా పంచుకున్నదీ ,ఆయన 
వాళ్ళ పై ఎంత ఆశలు పెట్టుకున్నది చెప్పాను . 
''కల అంటే నిద్రలో వచ్చేది కాదు . మిమ్మల్ని నిద్ర 
పోనీకుండా చేసేది ''...... అబ్దుల్ కలాం . 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఆయన స్ఫూర్తి ని 
విద్యార్ధులకు అందించాలి అని భావించాను . 
అవే ఈ రోజు ఈనాడు నెల్లూరు  స్పెషల్ లో వచ్చిన 
మా ''లీడ్ ఇండియా 2020'' ప్రోగ్రాం ఆర్టికల్ . 
ఇంకోటి ఆంధ్ర జ్యోతి నెల్లూరు స్పెషల్ లో వచ్చిన కవిత . 
చూడండి . 

lead india programme link in eenadu






Thank you Eenaadu and Andhra Jyothi
  రాలిపోయిన ధ్రువ తార      
ఒక్క క్షణం 
భారత దేశం నిశ్చేష్టగా నివ్వెరపోతూ 
ఒక మహామహుని తన వొడి నుండి 
కోల్పోతూ 
ఎన్ని కీర్తి కిరీటాలు తెచ్చాడో 
ఎన్ని విజయాలు పొందాడో 
అన్నీ తనను కన్న దేశమాత కోసమే !
పేపర్ బాయ్ గా మొదలైన ప్రస్థానం 
చదువుకు పేదరికం అడ్డు కాదంది 
ఎన్ ఐ టి లో కన్నస్వదేశీ  కల 
కోట్ల ప్రజల గుండె దీపాలు వెలిగించింది 
కుల మత బేధాలు లేని స్నేహం 
మాయా మర్మం తెలియని పిల్లల మనసు 
చెరగని చిరునవ్వు 
కల లు వెలిగించే స్ఫూర్తి 
నిరంతరం భోధనలోనే తృప్తి 
పద్మ భూషణ్ లు పద్మ విభూషణ్ లు 
41 డాక్టరేట్లు 
విజయ పధాన మెరిసిన ఉపగ్రహ ప్రయోగాలు 
రాష్ట్ర పతి పదవులు 
గౌరవ సన్మానాలు 
ఎన్ని మెట్లు ఎక్కినా 
ఎన్ని బిరుదులూ పొందినా 
అహపు గాలి అంటని అగ్ని అతడు 
తన ''జర్నీ '' అయిపోయిందని తాను కుప్ప కూలినా 
గుండె లోతుల్లో నిలిచిపోయిన గురుతు  అతడు 
ఒక మిస్సైల్ 
ఒక లక్ష్యం 
ఒక కల 
ఒక దేశపు శ్వాస 
ఒక చరిత్ర 
ఒక విజ్ఞాన ఖని 
ఒక యోగి 
ఎన్ని కలలకు స్ఫూర్తి అతడు 
విశ్వానికే వన్నె తెచ్చిన జ్యోతి అతడు ..... 

అబ్దుల్ కలాం గారికి కన్నీళ్ళతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ...... 

Monday 27 July 2015

బాహుబలి గురించి ఇంకొంచెం


ఎలాగు రాజమౌళి బాహుబలి గురించి కొంచెం కొంచెం తీస్తూనే ఉంటాడు .
విజయేంద్ర ప్రసాద్ వ్రాస్తూనే ఉంటాడు . ఇంకా కొంచెం చెప్పేది ఉంటూనే ఉంటుంది .
ఈ తెలుగు రాష్ట్రాలకి ఏమైంది !ఎక్కడికి వెళ్ళినా రెండే ప్రశ్నలు .... 
ఒకటి పుష్కారాలకు వెళ్ళావా ?
రెండోది బాహుబలి చూసావా ?
ఇల్లు స్కూల్ తప్ప ఇంకో విషయం గురించి మాట్లాడుకోను కూడా 
ఇంటరెస్ట్ లేని మా స్టాఫ్ రూం కి కూడా ఇవి బోలెడు ఇష్టం అయిన టాపిక్ 
అయిపోయాయి . దేనికి వెళ్ళ  లేదు అన్నా .... నీ జన్మే వృధా పో అన్నట్లు 
జాలిగా చూస్తున్నారు . ఎలాగు పుష్కరాలకు వెళ్లక సగం జన్మ వృధా 
అయింది . కనీసం సినిమా చూసి అయినా జన్మ సార్ధకం ఎలా చేసుకోవాలి 
అనుకున్నప్పుడు ...... అల్లుడుగారు నెల్లూరు ఎస్ 2 కి అదీ రంజాన్ లాంటి 
రష్ రోజు టికట్స్  తెచ్చారు . అల్లుడు గారు అత్తగారు వాళ్లకు చూపించే 
మొదటి సినిమా అంటే ఈ మాత్రం గొప్పగానే ఉండాల్సిందే !అప్పుడు 
చూస్తే ఇప్పుడు వ్రాయడం ఏమిటి అంటే ఒకటి కాదు రెండు కారణాలు . 

ఒకటి నిన్న ఫండే లో చూసిన గురవారెడ్డి గారి ఆర్టికల్ బాహు బాలి మీద 
గురవా రెడ్డి గారు , చందు శైలజ గారు అక్షర ఆత్మీయులుగా మనకు 
ఈ బ్లాగ్  లోకం లో సుపరిచితులే . (ఆర్టికల్ కింద ఇచ్చాను )

రెండోది నిన్న నెల్లూరు లో ''కె శివారెడ్డి '' గారు  అతిధి గా వచ్చిన 
శ్రీ పొట్టిశ్రీరాములు రచయితల సంఘం  ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనడం . 
ఆలస్యంగా శివారెడ్డి గారు మాట్లాడుతుండగా వచ్చిన నేను రెండో వరుసలో 
కూర్చుని బుద్ధిగా వినకుండా వెనుక ఉన్న ఆత్మీయుల కళ్ళ లోని 
ప్రశ్నార్ధకానికి సమాధానం చెపుతూ ఉన్నాను . ఉన్నట్లుండి శివారెడ్డి గారు 
మాట్లాడకుండా గమ్ముగా ఉండిపోయారు . ఏమిటని చూద్దును కదా 
''అమ్మా నీ మాటలు అయిపోతే నేను మాట్లాడుతాను '' అన్నారు . 
తప్పుకు నాలుక కరుచుకొని సభా ముఖంగా నా చిన్నతనానికి సారీ 
చెప్పేస్తే పెద్దలందరూ హుందాగా నవ్వి క్షమించేసి సభకు నిండుదనాన్ని
నాకు ఒక మంచి సాహిత్య జ్ఞాపకాన్ని ఇచ్చేసారు . నా కవిత కు బహుమతి 
వచ్చి ఆయన చేతులు మీదుగా తీసుకున్నప్పుడు నవ్వుతూ అభినందించి 
ఇంకోసారి పెద్దరికాన్ని చాటుకున్నారు . 
మీటింగ్ మధ్యలో అన్నారు ''ఆయన రాజ మౌళి ఏదో బాహు బలి అట 
తీసారు . ఏమి సత్యం చెప్పారు దాని వలన '' 
ఇంకా బోలెడు మంది బోలెడు చెప్పారు . కామెడీ లేదంట . ఏదో సినిమాకి 
కావలిసిన దినుసులు లేవట .... ఇంకా ..... ఇంకా ..... 

మీరందరూ సమీక్షకులు ,మీకున్నంత జ్ఞానం మాలాంటి ప్రేక్షకులకు 
లేదు . కాని సినిమాకి మౌత్ పబ్లిసిటీ ఇచ్చి , బోలెడు సార్లు చూసి 
లాభాలు తెచ్చేది మేము . సినిమా మాకు నచ్చితే చాలు . 
నిర్మాతకు కాసుల పంటే !!
అసలు సినిమాలో సత్యం ఏమిటి ?సినిమా అనేది ఒక మనసుకు 
కాలక్షేపం . మాకు లాజిక్ లు వద్దు . మాజిక్ లే కావాలి . అలాగని 
సందేశాత్మక చిత్రాలు కూడా ఆదరిస్తాము. అలాగని ప్రతి సినిమా ఒక 
సందేశం ఎలా ఇస్తుంది . అదొక ఊహ . అందమైన కల . ఊహలు 
వాస్తవం లోకి తెచ్చుకోలేని  వాళ్ళు  దర్శకుడి కళ్ళతో ఊహ ఎదురుగా 
చూసే ఒక కల్పన . ఏమో ఇక్కడ ఏదో సత్యం ఉందేమో !ఇప్పటికి 
పార్ట్ వన్ కదా అయింది . ఎన్ని పార్ట్లు ఉన్నాయో !! 
అసలు మాకు మాత్రం ఒక్కో సన్నివేశం చూసినపుడు ఒక్కో సినిమా 
గుర్తుకు రాలేదా ఏమిటి ! భైరవ ద్వీపం , అవతార్ , మహా భారతం 
ఎన్ని గుర్తుకు రాలేదు దీన్ని చూస్తుంటే . కాని దీనంత అందంగా 
అవి అనిపించలేదు . అప్పట్లో అవి గొప్పవే . ఆ జలపాతం సీన్స్ , 
ముఖ్యంగా పైన చెట్టుకు బాణం వేసి ప్రభాస్ పైకి వెళ్ళడం ,మంచు లో 
తమన్నా ప్రభాస్ జారిపోవడం ఇలా కొన్ని సీన్స్ అయితే అదరహో !!!
(నిజంగా నాకు ఇవి చూడమని చాలా మంది చెప్పారు )
ఇక కీరవాణి సంగీతం , సెంథిల్ ఫోటోగ్రఫీ ఎంత బాగా కుదిరిందో !
అసలు కామెడీ లేదు అన్నారు కాని సినిమాలో స్క్రీన్ ప్లే ఎంత 
బాగుంది అంటే మేము అసలు ఆ విషయమే గుర్తించ నంతగా 
కధలో లీనం అయిపోయాము . అయినా కాల కేయులు మాట్లాడే 
బాష కి బాగా  నవ్వాము. రమా రాజ మౌళి గారు కాస్ట్యూమ్స్ అన్నారు 
కాని అది నాకు కొంచెం నాకు నచ్చలేదు . అసలు తమన్నాకు పాపం 
ఎన్ని డ్రెస్ లు ఉన్నాయి . శివగామి గారి కాస్త్యుమ్స్ బాగున్నాయి . 
రెండో పార్ట్ లో ఇంకా బాగుంటాయి ఏమో !
అసలు ఈ పార్ట్ రాజ మౌళి గారు చెప్పినట్లు శివగామి గారిదే . 


రమ్య కృష్ణ గారి నటన ,రాజ మౌళి గారి స్క్రీన్ ప్లే నచ్చని వాళ్ళు 
లేరు . పల్లెల్లో కి వచ్చి అడగండి . తమ ఊహలలోని అద్భుతాలు కళ్ళ 
ముందు చూసాము అని చెపుతారు .  రాజ మౌళి గారు మీకెందుకు ,
మీకు ఎన్ని పార్ట్లు తీయాలని ఉంటె 
అన్ని తీయండి . ఇంకా కావాలంటే సినిమా హాళ్ళ లోనే కాకుండా 
వెయ్యి రూపాయ పేకేజ్ షో లు ఇళ్లలోని హొమ్ థియేటర్ లకి 
కూడా ఇవ్వండి . ఇలాగే అవుట్ పుట్ ఇస్తే మేము తప్పక 
చూస్తాము . థియేటర్ లు జనాలతో కళ కళ  లాడుతూ ఉండటం 
చూస్తూ ఉంటె ఎంత ఆనందం గా ఉంది . మా నాన్నగారు మా 
థియేటర్ పగల కొట్టించేస్తే ఎంత బాధ పడ్డానో !!! ఏమిటి మంచి 
సినిమాలు ,ప్రజలను హాల్ కి లాక్కొచ్చే సినిమాలు తీసే వాళ్ళే 
లేరా అని !
మీరు ఇంకా పార్ట్లు తీయండి రాజ మౌళి గారు . కాక పోతే 
కొంచెం కామెడీ ,కొన్ని పంచ్ డైలాగ్స్ ,కొన్ని సత్యాలు తక్కువ 
అయినాయి అంట . అవి ఈ సారి గుర్తు ఉంచుకొని తీయండి . 
ఇక అందరు మీ పార్టీ అయిపోతారు . ఒక ప్రపంచ సినిమా తీసిన 
మీకు అభినందనలు . 

పోయిన వారం ఫండే లో నా ఆర్టికల్ 
 (link ikkada )


గురవా రెడ్డి గారి ఆర్టికల్ 

Wednesday 15 July 2015

ఛా .... ఎంత బాగా వ్రాయాలి అనుకున్నానో పుష్కరాల గురించి :

ఛా ....  ఎంత బాగా వ్రాయాలి అనుకున్నానో పుష్కరాల గురించి :(
ఏదో జీవిత కాలం లో ఒక్కసారే వస్తాయి 144 ఏళ్ళకే మళ్ళీ వచ్చేది అని
చెప్పారు . సరే బ్లాగ్ లో వ్రాద్దాము రేపు మా మనవళ్ళు ,మనవరాళ్ళు
చూసి సంతోషపడుతారు అనుకున్నాను .
తొక్కిసలాట లో దాదాపు 30 మంది చనిపోయారు అని తెలిసి చాలా
బాధ వేసింది . పాపం ఎవరిదీ తప్పు ?నిజంగా ఇంత మంది ని ఒక
దగ్గర నియంత్రించడం ఎంత కష్టం . ఎవరికైనా పుణ్యం వస్తుంది అంటే
వెళ్ళాలి అని ఉంటుంది . కాని చిన్న పిల్లలు కూడా అవసరమా !ఇప్పుడు
బాధ పడితే పాపం పోయిన వాళ్ళ కుటుంభాలకు వాళ్ళు లేని లోటు
తీరుతుందా :(
ఇంకా పోయే వాళ్ళు అయినా కొంత సంయమనంతో జాగ్రత్తగా వెళ్ళండి .

చిత్రం ఏమిటంటే మా నెల్లూరు వాళ్ళం '' పెన్నా బంగాళా ఖాతం మధ్య ప్రదేశే ''
అంటే అంతా పెన్నా పక్కనో ,స్వర్ణ ముఖీ పక్కనో జీవితం మొత్తం ....
కాని ఏదో ఒక తీర్ధ యాత్ర కారణం తో గోదావరి పుట్టిన బ్రహ్మగిరి దగ్గర
నుండి కాళేశ్వరం ,రాజమండ్రి ,పట్టిసం .... ఇంకా అంతర్వేది దాకా
చూసాను . గోదావరి కి నాకు ఏమి అనుభందం ఉందొ కాని .
మీకోసం కొన్ని ఫోటోలు గూగోలమ్మ దగ్గర తెచ్చాను . చూడండి .


ఇది త్రయంబకేశ్వరం దగ్గర బ్రహ్మగిరి నుండి పుట్టిన గోదావరి పాయ
వచ్చే స్థలం . ఇప్పుడు ఇక్కడే కుంభ మేళ జరిగేది . ఇక్కడ
విష్ణువు శేషసాయిగా ఉంటె ఆయన పాదాల నుండి గోదావరి చిన్నగా
ఊరుతూ ఉంటుంది .

ఇది రాజమండ్రి కి కొన్ని గంటల దూరం లో ఉన్న పట్టిసం . ఇక్కడ నుండి ప్రైవేట్ ,
ప్రభుత్వ లాంచీలు పాపి కొండల మధ్య ఉన్న పేరంటాల పల్లె వరకు లేదా
భద్రాచలం వరకు ఉంటాయి . మేము పేరంటాల పల్లె వరకు వెళ్లి వచ్చాము .


చూసారా !గోదావరి మీద లాంచ్ వెళ్ళిపోతుంది . ఇక అటు ఇటు చూస్తూ ఉంటె 
మాట్లాడాలి అని కూడా అనిపించదు . 


మధ్యలో ఇలా కొండల మీద నుండి జలపాతాలు జారిపడుతూ ఉంటాయి . పాపి కొండల 
దగ్గర అయితే నీరు సుడి గుండాలుగా తిరుగుతూ ఉంటుంది . 



చూడండి మధ్యలో ఇసుక తిన్నె మీద లాంచీ ఆగితే ఇలాగా కనిపిస్తాయి పాపి కొండలు . 
నిజానికి రెండు కొండల వరుస మధ్య పాపతి లాగా గోదావరి ఉంటుంది కాబట్టి 
పాపిట కొండలు ..... వాడుకలో పాపి కొండలు . 


ఇదిగో పేరంటాల పల్లె ఒడ్డు  వచ్చేసి అందరు లాంచీ దిగుతున్నారు . 

దిగగానే ఇలా గిరిజనులు వెదురుతో ఎన్నో కళా రూపాలు చేసి అమ్ముతూ కనిపిస్తారు . 
వాళ్ళ కళను చూసి కొనకుండా కదలలేము . ఊరికే డబ్బులు ఇస్తాము అంటే 
తీసుకోరు . 


మరి ఇక్కడ ఏమి ఉంటుంది అంటే ..... బాలండ స్వామీ గారి ''శ్రీ రామ కృష్ణ ముని వాటం ''
అది ఇదే . ఏముంది గుడే కదా !కాకుంటే ప్రకృతి మధ్య అందంగా ప్రశాంతంగా అంటారా !
నేను అంతే అనుకున్నాను . 
కాని అక్కడ కొన్న ఆయన జీవిత చరిత్ర చదివిన తరువాత ఇవన్నీ తెలుసుకొని 
అక్కడ ప్రదేశాలు చూసి ఉంటె బాగుండును అనిపించింది . 
ఆయన చేసిన కతోరమైన తపస్సు ,తిరిగిన అడవులు ,చివరికి గిరిజనుల కోసం 
ఆయన చేసిన సేవలు .... ఎంత గ్రేట్ . 
మహానుభావులు అంతే !ఎంత తపస్సు చేసినా వాళ్ళ తపస్సు అంతా సాటి 
మనుషుల ఆకలి ,కష్టాలు తీర్చడానికే . మీకు వీలు అయితే ఆయన కధ  చదవండి . 

222222
ఇక ఇది చివరగా గోదావరి సాగరం లో కలిసే అంతర్వేది . లక్ష్మి నరసింహ స్వామీ గుడి 
నుండి పడవ లో సాగర సంగమం దగ్గరకు వెళ్ళాలి . సముద్రం దగ్గర పడుతుంటే 
కనపడే అలలు సముద్రం ఉనికి ఎక్కడ నుండి అనేది తెలిసిపోతుంది . ఒక వైపు నది ,
అది కలిసే సముద్రం అలలు బట్టి బాగా తెలుసుకోవచ్చు . 
నేను నది లో నీళ్ళు చల్లుకుందాము అని నీళ్ళలోకి రెండు అడుగులు వెసానో 
లేదో మోకాలి లోతు వండ్రు మట్టిలో దిగిపోయాను . సముద్రం లో కొంత దూరం 
పోయినా ఏమి కాదు . నది లో బురద భలే డేంజర్ . జాగ్రత్తగా ఉండాలి . 
ఇక్కడ భార్యా భర్త కలిసి మునిగితే జన్మ జన్మ లకు వాళ్ళే భార్యా భర్తలు గా 
ఉంటారు అంట . ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ,నిదానంగా అందరినీ అడిగి 
విశేషాలు తెలుసుకుంటూ చూడండి . 
''పుష్కర పుణ్య ప్రాప్తిరస్తు '' 
               @@@@@@@@@@@@