Wednesday 15 July 2015

ఛా .... ఎంత బాగా వ్రాయాలి అనుకున్నానో పుష్కరాల గురించి :

ఛా ....  ఎంత బాగా వ్రాయాలి అనుకున్నానో పుష్కరాల గురించి :(
ఏదో జీవిత కాలం లో ఒక్కసారే వస్తాయి 144 ఏళ్ళకే మళ్ళీ వచ్చేది అని
చెప్పారు . సరే బ్లాగ్ లో వ్రాద్దాము రేపు మా మనవళ్ళు ,మనవరాళ్ళు
చూసి సంతోషపడుతారు అనుకున్నాను .
తొక్కిసలాట లో దాదాపు 30 మంది చనిపోయారు అని తెలిసి చాలా
బాధ వేసింది . పాపం ఎవరిదీ తప్పు ?నిజంగా ఇంత మంది ని ఒక
దగ్గర నియంత్రించడం ఎంత కష్టం . ఎవరికైనా పుణ్యం వస్తుంది అంటే
వెళ్ళాలి అని ఉంటుంది . కాని చిన్న పిల్లలు కూడా అవసరమా !ఇప్పుడు
బాధ పడితే పాపం పోయిన వాళ్ళ కుటుంభాలకు వాళ్ళు లేని లోటు
తీరుతుందా :(
ఇంకా పోయే వాళ్ళు అయినా కొంత సంయమనంతో జాగ్రత్తగా వెళ్ళండి .

చిత్రం ఏమిటంటే మా నెల్లూరు వాళ్ళం '' పెన్నా బంగాళా ఖాతం మధ్య ప్రదేశే ''
అంటే అంతా పెన్నా పక్కనో ,స్వర్ణ ముఖీ పక్కనో జీవితం మొత్తం ....
కాని ఏదో ఒక తీర్ధ యాత్ర కారణం తో గోదావరి పుట్టిన బ్రహ్మగిరి దగ్గర
నుండి కాళేశ్వరం ,రాజమండ్రి ,పట్టిసం .... ఇంకా అంతర్వేది దాకా
చూసాను . గోదావరి కి నాకు ఏమి అనుభందం ఉందొ కాని .
మీకోసం కొన్ని ఫోటోలు గూగోలమ్మ దగ్గర తెచ్చాను . చూడండి .


ఇది త్రయంబకేశ్వరం దగ్గర బ్రహ్మగిరి నుండి పుట్టిన గోదావరి పాయ
వచ్చే స్థలం . ఇప్పుడు ఇక్కడే కుంభ మేళ జరిగేది . ఇక్కడ
విష్ణువు శేషసాయిగా ఉంటె ఆయన పాదాల నుండి గోదావరి చిన్నగా
ఊరుతూ ఉంటుంది .

ఇది రాజమండ్రి కి కొన్ని గంటల దూరం లో ఉన్న పట్టిసం . ఇక్కడ నుండి ప్రైవేట్ ,
ప్రభుత్వ లాంచీలు పాపి కొండల మధ్య ఉన్న పేరంటాల పల్లె వరకు లేదా
భద్రాచలం వరకు ఉంటాయి . మేము పేరంటాల పల్లె వరకు వెళ్లి వచ్చాము .


చూసారా !గోదావరి మీద లాంచ్ వెళ్ళిపోతుంది . ఇక అటు ఇటు చూస్తూ ఉంటె 
మాట్లాడాలి అని కూడా అనిపించదు . 


మధ్యలో ఇలా కొండల మీద నుండి జలపాతాలు జారిపడుతూ ఉంటాయి . పాపి కొండల 
దగ్గర అయితే నీరు సుడి గుండాలుగా తిరుగుతూ ఉంటుంది . 



చూడండి మధ్యలో ఇసుక తిన్నె మీద లాంచీ ఆగితే ఇలాగా కనిపిస్తాయి పాపి కొండలు . 
నిజానికి రెండు కొండల వరుస మధ్య పాపతి లాగా గోదావరి ఉంటుంది కాబట్టి 
పాపిట కొండలు ..... వాడుకలో పాపి కొండలు . 


ఇదిగో పేరంటాల పల్లె ఒడ్డు  వచ్చేసి అందరు లాంచీ దిగుతున్నారు . 

దిగగానే ఇలా గిరిజనులు వెదురుతో ఎన్నో కళా రూపాలు చేసి అమ్ముతూ కనిపిస్తారు . 
వాళ్ళ కళను చూసి కొనకుండా కదలలేము . ఊరికే డబ్బులు ఇస్తాము అంటే 
తీసుకోరు . 


మరి ఇక్కడ ఏమి ఉంటుంది అంటే ..... బాలండ స్వామీ గారి ''శ్రీ రామ కృష్ణ ముని వాటం ''
అది ఇదే . ఏముంది గుడే కదా !కాకుంటే ప్రకృతి మధ్య అందంగా ప్రశాంతంగా అంటారా !
నేను అంతే అనుకున్నాను . 
కాని అక్కడ కొన్న ఆయన జీవిత చరిత్ర చదివిన తరువాత ఇవన్నీ తెలుసుకొని 
అక్కడ ప్రదేశాలు చూసి ఉంటె బాగుండును అనిపించింది . 
ఆయన చేసిన కతోరమైన తపస్సు ,తిరిగిన అడవులు ,చివరికి గిరిజనుల కోసం 
ఆయన చేసిన సేవలు .... ఎంత గ్రేట్ . 
మహానుభావులు అంతే !ఎంత తపస్సు చేసినా వాళ్ళ తపస్సు అంతా సాటి 
మనుషుల ఆకలి ,కష్టాలు తీర్చడానికే . మీకు వీలు అయితే ఆయన కధ  చదవండి . 

222222
ఇక ఇది చివరగా గోదావరి సాగరం లో కలిసే అంతర్వేది . లక్ష్మి నరసింహ స్వామీ గుడి 
నుండి పడవ లో సాగర సంగమం దగ్గరకు వెళ్ళాలి . సముద్రం దగ్గర పడుతుంటే 
కనపడే అలలు సముద్రం ఉనికి ఎక్కడ నుండి అనేది తెలిసిపోతుంది . ఒక వైపు నది ,
అది కలిసే సముద్రం అలలు బట్టి బాగా తెలుసుకోవచ్చు . 
నేను నది లో నీళ్ళు చల్లుకుందాము అని నీళ్ళలోకి రెండు అడుగులు వెసానో 
లేదో మోకాలి లోతు వండ్రు మట్టిలో దిగిపోయాను . సముద్రం లో కొంత దూరం 
పోయినా ఏమి కాదు . నది లో బురద భలే డేంజర్ . జాగ్రత్తగా ఉండాలి . 
ఇక్కడ భార్యా భర్త కలిసి మునిగితే జన్మ జన్మ లకు వాళ్ళే భార్యా భర్తలు గా 
ఉంటారు అంట . ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ,నిదానంగా అందరినీ అడిగి 
విశేషాలు తెలుసుకుంటూ చూడండి . 
''పుష్కర పుణ్య ప్రాప్తిరస్తు '' 
               @@@@@@@@@@@@ 
                               
                         












No comments: