Monday 26 March 2012

మనని మనం తెలుసుకుంటే.....పూర్ణాత్మతో ఉంటె......

మనని మనం ఎలా తెలుసుకోవాలి?ఆనందంగా ఎలా జీవించాలి?
ప్రతి ఒక్కరు....దాదాపుగా జీవితం వెనుక పరిగెత్తి అలిసిపోయిన 
క్షణం తప్పకుండా వేసుకొనే ప్రశ్న.....అందరం సక్రమంగా ఆలోచిస్తే 
చక్కగా నవ్వుతూ ఉన్నంతలో హాయిగా ఉండగలిగితే......
అంత కంటే కావలసింది ఏముంది.
ఒక మనిషి పూర్ణాత్మతో ఉంది కాంతిని తన జీవితం లోకి ఆహ్వానించ గలిగితే 
......పరిపూర్ణ జీవితాన్ని  గడుపుతూ ఆనందంగా  ఎలా జీవించవచ్చో 
''పూర్ణాత్మ''పుస్తకం మనకు చెపుతుంది.
ఒక సారి చదివితే మాత్రం మనం మన జీవిత విధానాన్ని మార్చుకొని 
సంతోషంగా జీవించగలం.
ఇందులో''వాయిడ్'' అనే స్తితి గూర్చి చాలా బాగా వ్రాసి ఉన్నా


మాలిక ఉగాది సంచిక లో నా పుస్తక సమీక్షlink 

కొన్ని పేజెస్ మీ కోసం



Thursday 22 March 2012

ఉగాది రోజు ఇలాటి పోస్ట్ వేస్తానని అనుకోలేదు....

ఉగాది రోజు ఇలాంటి పోస్ట్ వేస్తానని ....అందులో నా బ్లాగ్ మొదలైన తరువాత
మొదటి ఉగాది ఇలాటి పోస్ట్ వేస్తానని అనుకోలేదు.......
గురువారం రాత్రి చాప తీసుకొని మిద్ది పైకి పడుకొని చుక్కలతో
కబుర్లు చెప్పటానికి పోతున్నాను.బోజనాలు అయిపోయినాయి.
ఇక మిగిలినదంతా నా టైం.దానిని ఇలాగే వాడుకుంటూ ఉంటాను.
మెట్లు ఎక్కుతూ ఉంటె రాజ్ ప్లస్ లో వేసిన పోస్ట్ గుర్తుకు వచ్చింది.
''మన పుస్తకాలు,మన ఇష్టాలు,మన పనులు అన్నీ ప్లస్ లో పోస్ట్లకు
సమాధానాలు చెప్పటం లో మాడిపోతున్నాయి...వాటిని బతికించుకోవాలంటే
ప్లస్ లో నుండి వెళ్లిపోవాలి అని సారాంశం.''(ప్లస్ ను వదిలి  పోను...అని సెటైర్
వేసాడు చివరలో)
నిజమే చాలా టైం దానికే ఇవ్వాల్సి వస్తుంది...కాని దేశ విదేశాలలో ఉన్న వాళ్ళు
యెంత దగ్గరగా,ఆప్యాయంగా.....పలకరింపులు,సంతోషాలు,బాధలు,సహాయాలు
కలికాలం లో ఇంతటి ఆప్యాయతని టైం కోసం ఎలా వదులుకోవటం.....


కాదు....ఇలా కాదు..మధ్యే మార్గం ...ప్రతి శుక్రవారం రాత్రి ప్లస్లో ఒకరి పోస్ట్లో
రచ్చబండ ...కాదు..కాదు...రచ్చా స్క్వేర్ బండ పెడితే సరి.....వాళ్ళ రచ్చ అంతా
 గుర్తుకు వచ్చి పెదాలపై చిన్న నవ్వు...పెద్దదిగా విరుస్తూ ....నేనంటే పెద్ద కామెంట్స్
పెట్టను ...కాని వాళ్ళ రచ్చ అంతా ఆప్యాయంగా ఫీల్ అవుతుంటాను.


చిన్నగా మెట్లు ఎక్కుతూ ఉంటె మెట్ల పక్కన వేపకొమ్మల నుండి క్రింద ఉన్న
చిన్న గుడి దగ్గర వెలిగే దీపపు కాంతులు వెలుగు నీడలుగా గాలికి ఊగుతూ
ముద్దుగా తొంగిచూస్తున్న వేప పూత ఉగాదిని వాకిళ్లలోకి రమ్మని ఆహ్వానిస్తూ..
బాబుని షార్ట్ టర్మ్ కోసం హాస్టల్ కి పంపి వారం అయింది....వాడు లేకుండా
ఉగాది...పడుకొని చుక్కలు చూస్తూ వాడి అల్లరిలోకి జారిపోయాను....
పక్కన అలికిడి.....ఈయనే ఎప్పుడు వచ్చారో.....''బాబు ఫోన్ చేసాడు ...వాడి ఫ్రెండ్
రేపు వస్తాడంట....ఏమైనా చెయ్యి ..వాడికి రేపు పంపిద్దాము''...నన్నంటాడు కాని
ప్రేమ ఎక్కువ అని వాడిని వదిలి ఫీల్ అయ్యేది ఆయనే ఎక్కువ....చిన్నగా యేవో
మాట్లాడుకుంటూ ఉన్నాము.

''అమ్మా''పెద్దగా కేక పెట్టింది పాప.ఏమైంది ఉలిక్కిపడ్డాము ''ప్రసన్నా ఆంటీ వాళ్ళ నాన్న ఉన్నట్లుంది కింద పడిపోయాడంట''గస  పోస్తూ చెప్పింది.
ఈయన టవల్ పైన వేసుకొని పరిగెత్తారు.నేను మిద్ది పైనుండి కిందకు చూసాను.
గార్డెన్ మధ్యలో కింద పోర్షన్ అతను చొక్కా వేసుకుంటూ పరిగిస్తూ ఉన్నాడు.అంటే అక్కడికే ....కాంప్లెక్స్ లో కింద నాలుగు,పైన నాలుగు ఇళ్లు,ముందు చిన్న తోట,పక్కన మూడు కార్లు పెట్టగల పార్కింగ్.
ప్రసన్నా వాళ్ళు కింద పోర్షన్ లో ఉంటారు.
మేము ఫస్ట్ ఫ్లోర్  లో....వాళ్ళ అమ్మ వాళ్ళు కాంప్లెక్స్ పక్కన చిన్న ఇంట్లో ఉంటారు.
ఇప్పుడు వాళ్ళ నాన్న బయట కూర్చొని ఉన్న అతను ముందుకు పడిపోయాడు.
అందరు అక్కడికే వెళుతున్నారు.

నేను కిందకు వచ్చేసరికి ఆడవాళ్ళు ,పిల్లలు అందరు వచ్చేసి ఉన్నారు.
మరి కార్ వచ్చిన వాళ్ళు కావాలి కదా....లాస్ట్ పోర్షన్  లో రియల్ ఎస్టేట్
వాళ్ళు ఉన్నారు.వాళ్ళ ఆయన స్నానం చేస్తూ ఉన్నారు.విషయం తెలీగానే పరిగెత్తి
కార్ తీసాడు.(నేను వెంటనే సెలవలలో కార్ నేర్చుకోవాలి అని నిర్ణయం
తీసుకున్నాను)

ప్రసన్న,వాళ్ళ అమ్మ వాళ్ళ  నాన్న ను పట్టుకొని ఏమి చెయ్యాలో తెలీక ఏడుస్తున్నారు.
కొత్త కార్ తెలుపు ది మొన్ననే తీసుకొచ్చారు  వాళ్ళు....ప్రసన్నా వెంటనే
ఎందుకో వద్దులెండి....ఆటోలో వెళతాము అనింది.వాళ్ళు గట్టిగా అరిచారు.
ముందు మనిషి ముఖ్యం .....ఇవన్ని ఆలోచిస్తావేంటి అని....గబా గబా అందరు కలిసి
హాస్పిటల్ కి వెళ్ళిపోయారు.ప్రసన్నకు ఇద్దరు పిల్లలు.''మానస్,రిషి''మా వారు
రిషిని బండిలో ఎక్కించుకొని వెనకే వెళ్ళిపోయారు.ఇంటి వొనర్  ఆంటీ
అందరికి కుర్చీలు వేసారు. బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాము.
పిల్లలను వళ్ళో కూర్చోపెట్టుకొని.....పిల్లలు....రెండేళ్ళు దగ్గర నుండి ఇరవై
ఏళ్ళ వరకు ఉన్నారు....అందరు బిక్క మొహాలు వేసుకొని ....ఏమి జరుగుతుందో
అని బయపడుతున్నారు.పాపం పిల్లలు ఇక్కడ కలిసి మెలిసి ఉంటారు.
పెద్ద వాళ్ళు  చిన్న పిల్లలను దగ్గరకు తీస్తారు,నేర్పిస్తారు....వాళ్ళు అంతే......
మూడేళ్ళ నిశ్చల్ వచ్చాడు వాళ్ళ అమ్మ దగ్గరకు''అమ్మా మానస్ ఏడుస్తున్నాడు''
అన్న ఏడుస్తున్నాడని వాడి కళ్ళలో కన్నీళ్ళు.ఏదో తరగతి చదువుతున్న
మానస్ కళ్ళలో వాళ్ళ  తాత జ్ఞాపకాలు నీళ్ళుగా.....వాడొక్కడే మిగిలాడు.
అందరు హాస్పిటల్కి వెళ్ళారు.
వెంటనే అందరం లేసి దగ్గరకు తీసుకున్నాము వాడిని .....నడుముకు చుట్టుకున్న
చేతుల్లోని బయం ,పొట్టకు  తగిలే కంటి చెమ్మ తప్ప,ఎవరి బిడ్డ అని తల్లి మనసు
చూస్తుందా....దగ్గరగా తీసుకొని లాలిస్తుంది కాని.


ఫోన్ వచ్చినపుడల్లా ఉలికి పడుతున్నాము....ప్రసన్న వాళ్ళ ఆయన లేడు.
నెల్లూరికి వెళ్ళాడు.ఇద్దరు ఆడవాళ్లే ఉండేది....అందరికి  వాళ్ళు ఎవరు అనేది
గుర్తు లెదు...అవతల వాళ్లకి కష్టం అనేది తప్ప...పిల్లలు అయితే...పరిగెత్తి
ఏమి పనులు చెపితే అది చెయ్యటం కలిసి మెలిసి....అవతల వారి కష్టం తీరితే
చాలు అన్నట్లు....అదుగో కార్ వచ్చేసింది.ఎమైందా అని తొంగి చూసాము.


అర్ధం అయిపొయింది...గొల్లుమన్నా ఏడుపులు చూసి.....వొనర్ ఆంటీ పెద్దరికం
తో సూచనలు చెయ్యటం ప్రారంబించింది.మరి భర్తని హాస్పిటళ్ళు అన్నీ తిరిగి
క్యాన్సుర్ కి అర్పించింది.అనుభవం సూచనలు ఇస్తుంది.''కొడుకు పాట్నా లో
ఉన్నాడు.వచ్చేసరికి రేపు సాయంత్రం అవుతుంది....ఐస్ బాక్ష్ తెపొండి''
ఎవరు ఎవరికి చుట్టాలు.....సాటి మనిషికి సాయం చెయ్యటానికి ఏమి కావాలి ...
మనం మనుషులమే అనే స్పృహ తప్ప....శవాన్ని బాక్సలో ఉంచారు.


ఒక్కక్కోరే వస్తున్నారు.అవును అందుకే నలుగురు కావాలి అనేది....నువ్వు
గొప్ప అనుకున్నావో నువ్వు ఒక్కడివే మిగులుతావు........
''యెంత గొప్ప చావు.....ఎనబై ఏళ్ళ  మనిషికి ...చక్కగా ఇప్పుడే భార్య పెట్టింది
సంతోషంగా తిన్నాడు...ముందుకు వాలాడు''అనుకుంటూ వెళుతున్నారు.


''త్రయంబకం యజామహే సుగందిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యో మ్రుత్యోవ మామ్రు తాత్''

మృత్యుంజయ స్తోత్రం......మృత్యువుని జయించలేము...కాని మృత్యు
బయాన్ని జయించాలి.ఉన్న కాలాన్ని మన కోసమే కాదు ...పక్క వారి
కోసం కూడా వినియోగిస్తే అదే జన్మకు సార్ధకత.......


దోస పాదు   నుండి దోస పండు పండినపుడు దానికే తెలియ కుండా 
తొడిమ పాదు నుండి ఊడిపోతుంది.దగ్గరకు వెళ్లి చూస్తె కాని తెలీదు.
అలాగే మన జీవితం నుండి మనకే తెలీకుండా బంధాలు తెంచుకొని 
వెళ్లి పోవాలని ఈ మంత్రం చదువుతారు.


''యావత్ పవనో నివసతి దేహే
తావత్ ప్రుచ్చతి కుశలం గేహే
గతవతి వాయవ్ దేహా పాయె
భార్యా బిబ్నతి తసమిన్ కాయే''
భజ గోవిందం....భజ గోవిందం...
''
శ్వాస వెళ్లి పోయినాక మిగిలిన వారే కాదు
భార్య కూడా ఆ కాయాన్ని పలకరించదు''


పక్క రోజు (అంటె ఈ రోజు)ఒక వ్యాన్ వచ్చింది ....ఐ కేర్ హాస్పిటల్
నుండి ....ఆయన కళ్ళు డొనేట్ చేసి ఉన్నారు....ఈ గొప్ప విషయం చాలదా
ఆయన కోసం నలుగురు పరిగెత్తి  సహాయం చెయ్యటానికి....
జీవితం తరువాత కూడా ఇంకొరికి వెలుగు దానం చేసిన ఆయన 
గొప్పదనానికి నమస్కరించాటానికి.......ఉగాది రోజు ఒక కొత్త పాటం......

ఇక్కడ పిల్లలు అంతా కలిసి సహాయం చేసుకోవటం,చిన్న పిల్లలు కూడా
ఒకరి కన్నీళ్లు తుడవటం చూసి నా మనసుకి తృప్తిగా ఉంది.....


''అవును భారతీయ సంస్కృతీ బతికి ఉంది......
చిన్న పిచుకులకు కూడా వరి వెన్నులు పెట్టిన సంస్కృతీ....
పండుగ రోజు ఉన్నంతలో దానాలు చేసి తృప్తి పడే సంస్కృతీ....
మనతో పని చేసే పశువులకు కూడా పూజ చేసే సంస్కృతీ....
కల్లా కపటం లేక కష్ట సుఖాలు పంచుకొనే సంస్కృతీ......
మానవత్వాన్ని మనుషులలో  వెలిగించే సంస్కృతీ.....


చిన్న పిల్లల్లో.....ఆ రేపటి దివ్వేల్లో.....
వారి రక్తంలో......వారి హృదయాలను మనం స్వార్ధం తో 
వారి హృదయాలను మూసేయ్యకపోతే........
వెలగనివ్వండి...రేపటి మానవత్వాన్ని భారతీయతను ఇందనంగా 
పోసుకొని.......మనం కూడా మనుషులం అనిపించుకోవాలి కదా......

Saturday 10 March 2012

మళ్ళీ ...ఎందుకన్నా....నెల్లూరని అభిమానం అన్నా...

మిత్రులు ఒకరిని ఈ పోస్ట్ వేయటం లో హెల్ప్ అడిగాను.
ఇది చాలా మంది చూసారు మళ్ళి ఎందుకు అన్నారు.
నిజమే ఎందుకు ?ఏమో మరి నా హృదయాన్ని కదిలించేవి ,
నాకు సంతోషం కలిగించినవి ......ఒక దగ్గర ఉండాలన్న 
స్వార్ధం కావొచ్చు.......


నెల్లూరంటే అభిమానమెందుకన్న.......
కధలు అంటే ప్రియ మెందుకన్న......
ఈ నీళ్ళు తీపెందుకన్న.........
మొలగోలుకులు రుచి ఎందుకన్నా.....
తిక్కన కలాన్ని .....మదిలో నిలుపుకున్నందుకే నన్నా.....
ఈ నేలపై ఊపిరి పిలుపు అందుకున్న.....
ఆత్మీయతా నెలవుల నీడన మసిలి నందుకన్న........


ఖదీర్ బాబు గారు అభినందనలు.
మీ కలం నుండి ఎన్నో కాలాన్ని ఎదిరించి నిలబడే 
శిలాక్షరాలు....సువర్ణాక్షరాలుగా వెలువడాలని ఆశిస్తున్నాను.


hmtv lo vandella kadhaa lo khadeer babu gaari program link ikkada


Thursday 8 March 2012

''మహి'' లో ''మహి''ళా....ఒక దినోత్సవం

బస్ ఉన్నట్లుండి ఆగేసరికి మెలుకువ వచ్చింది.
బస్సు ను ఆపి ఎదురుగా వచ్చే కాన్వాయ్ ని పంపిస్తున్నారు.
ఎవరబ్బా?.......అదిగో చంద్రబాబు నాయుడు మా వారు చూపించారు.
ఓహో ఎలక్షన్ ప్రచారం కోసం ఎయిర్ పోర్ట్ లో దిగి వస్తున్నట్లున్నాడు.
మెలుకువ వచ్చింది కదా అని చుట్టూ పరిశీలించాను.దూరంగా 
తిరుపతి కొండలు చాలా రోజుల తరువాత వస్తున్నా నన్ను పలకరిస్తూ 
ఆప్యాయంగా ఆకాశానికి నన్ను చూపిస్తూ ఉన్నాయి.
ఇంతకూ ముందుల కాకుండా రేణు గుంట దగ్గర బైపాస్  లో  నుండి 
బస్సు లు వెళుతున్నాయి.దూరంగా కొండపై నుండి నామాలు కనపడుతూ నన్ను దీవిస్తూ ఉన్నాయి.....మామూలుగా పెళ్లి రోజుకు తిరుపతికి వచ్చేవాళ్ళం.
తిరుమల కాకపోయినా ఏదో ఒక గుడి చూసేవాళ్ళం.
ఈ సారి అంతా హడావడి.ఇప్పుడైనా కళ్యాణ్ గారి రిక్వెస్ట్ తో 
బయలుదేరాము.


బస్ స్టాండ్ కి రమాదేవి మేడం గారు వాళ్ళ స్టూడెంటే కార్ తీసుకు రావటం 
వాళ్ళపై నా గౌరవాన్ని ఎంతో పెంచింది.దారిలో మేడం గారు వాళ్ళ 
institutions గూర్చి చాలా చక్కగా వివరించారు.ప్రస్తుతం వెళ్ళేది 
''GATE'' పి.జి. కాలేజ్.M.B.A.,M.C.A,B.C.A, పిల్లలు ఒక చక్కని 
సమైక్యతతో ఈ రోజు మహిళా దినోత్సవం జరపాలని ప్లాన్ చేసుకున్నారట.
ఒక్క రోజులో ప్లాన్  చేసుకొని కూడా......రమాదేవిగారు,జ్యోత్స్న గారు,విద్యుల్లత గారు 
తమ విద్యార్దులను ఎంకరేజ్ చేస్తూ చక్కటి ప్రోగ్రాం చేయటం అభినందనీయం .
అబ్బాయిలు కూడా మహిళలపై తమ గౌరవానికి  సూచికగా చాలా చక్కగా 
హెల్ప్ చేస్తున్నారు.


నేను మా వారు లోపలకు అడుగు పెట్టగానే చుట్టూ చూసాను.ఇంతకు ముందు 
''అక్షయ మానసిక వికలాంగుల కేంద్రం'' కు వెళుతూ ఆ దారినే వెళ్ళాము.
ఒక్క సారి మానసిక వికలాంగులందరూ మెదిలి మనసు కలత పడింది.
ఒక్క సారి తల విదిలించేసి కాలేజ్ ని చూసాను.చక్కగా ఉంది కాలేజ్.
చీఫ్ గెస్ట్ వచ్చారు అనే గౌరవంతో వాళ్ళు వచ్చి చక్కగా పూలతో ,ఆప్యాయతతో 
ఆహ్వానించారు.(వాళ్ళ కళ్ళలో ఒక మంచి పని చేస్తున్నాము అనే తృప్తి....
ఏ పనైనా మేము చక్కగా నిర్వహించగలము  అనే ఆత్మ విశ్వాసం....
''మహిళల్ నేర్వగరాని విద్య గలదే ముద్దారా నేర్పించినన్''.....స్త్రీ శక్తీ తెలిసిన 
వారి మాట)


తరువాత వైస్ ప్రిన్సిపాల్ మూర్తి గారు,ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ గారు,
కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు గారు చాలా చక్కగా పలకరించారు.
జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం మొదలు అయింది.ఇక్కడ అన్నపూర్ణ  అనే 
అమ్మయి గూర్చి చెప్పాలి.ఎక్కడ అలుపు,బయం అనేదే లేకుండా అందిరిని 
ఆహ్వానించటం స్పీచ్ కి రిక్వెస్ట్ చెయ్యటం ,పది నిమిషాలే అని కన్విన్స్ చెయ్యటం 
ఎవరికి లోపం కాకుండా చూసుకోవటం .....అసలు యాంకరింగ్ చాలా బాగా 
చేసింది.మంచి కమ్యునికేషన్ స్కిల్ల్స్ ఉన్నాయి తన దగ్గర (పిల్లలో చాలా మంచి 
స్కిల్ల్స్ ని మనం సాన పెట్ట వచ్చు ఇలాంటి సందర్భాలు ఏర్పాటు చేస్తే)


ముందుగా వెంకటేశ్వర్లు గారు మాట్లాడి మహిళలు ఆప్యాయత,ప్రేమకు 
నిలయాలు.కాని చిన్న లోపం ఉంది.పెళ్లి అయిన తరువాత అత్తామామల్ని 
కూడా మన పేరంట్స్ లాగే చూడ గలగాలి.అలాగే ముసలి తల్లి తండ్రులను 
బాగా చూసుకోవాలి.....అని చెప్పి వాళ్లకు స్పూర్తి నిచ్చారు.
తరువాత నాతొ మేడం నేను ఇంకో దగ్గరకు వెళ్ళాలి ఉండలేకపోతున్నందుకు 
సారి అని గౌరవంగా  చెప్పి వెళ్లి పోయారు.


రాజేంద్ర ప్రసాద్ గారు పిల్లలను నవ్విస్తూ ఇప్పుడే వాళ్ళు మాట వినటం లేదు 
వాళ్ళదే అధికారం కాబట్టి మాకు జెంట్స్ డే  కావాలి అని చెప్పారు.
తరువాత అమ్మాయిలు చక్కగా పని చేస్తూ,చదువుతూ మంచి స్తాయిలోకి 
రావాలని ఆకాంక్షించారు.మూర్తి గారు మాట్లాడుతూ తన భార్య తన జీవితం 
లోనికి రావటం తన అదృష్టమని తన హృదయం లో ఆడవాళ్ళ పైన గల 
గౌరవాన్ని తెలియ చేసారు.
ఇద్దరు అమ్మాయిలూ మాట్లాడారు.వ్రాసుకొని వచ్చిన విషయమే అయినా అలా 
అందరి ముందు మాట్లాడటం వారి స్కిల్ల్స్ ను మెరుగుపరుస్తుంది.చాలా మందిలో 
ఎంతో జ్ఞానం ఉంటుంది....కాని చెప్పటం రాక పోవటం వలన తమ జ్ఞానాన్ని ,
విద్వత్తుని ఇతరులకు చూపలేక పోతారు.ఇలాటి సందర్భాలలో పాల్గొనటం వలన 
తమ సంభాషణ నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు.


ఇప్పుడు నా వంతు....ఏమి చెప్పాలి....ఎదిగే పిల్లలు వాళ్ళు.మనం 
వాళ్లకి తమ జ్ఞానాన్ని  అందిస్తామని ఇలా పిలిచి సన్మానం చేసి 
దీవించమని అడుగుతున్నారు.
భారతీయ భావాల్ని ఒక్క సారి గుర్తు చేయటం కన్నా వాళ్లకు నేను ఇవ్వగలిగిన 
అమూల్యమైన కానుక లేదు అనిపించింది.అదే చెప్పాను.భారతీయులకు 
స్త్రీ శక్తి గౌరవించి వాడుకోవటం ద్వారానే జాతి గొప్పది కాగలదని తెలుసు.
అందుకే''యత్ర నార్యంతు పూజ్యంతే....తత్రే రమంతు దేవతా''.....
మీ భాగస్వామిని మీరు గౌరవంగా చూడగలిగి నపుడే మీ  ఇల్లు దేవాలయం 
కాగలదు అని చెప్పాను.
ఆడ పిల్లలకి ''వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు''మీరు వ్యక్తిత్వం 
తో నిరంతరం నేర్చుకుంటూ వెలుగుతున్నపుడే ఇతరులకు జ్ఞానాన్ని అందించగలరు.
వారికి దారి చూపగలరు.మీ ఇంటిని ఉన్నతంగా తీర్చి దిద్దుకోగలరు చని చెప్పాను.


ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి.ఒకరు మాట్లాడుతూ ఆడ వాళ్ళు బట్టలు విషయం 
లో జాగ్రత్తగా ఉండాలి తరువాత మమ్మల్ని అని ఏమి ప్రయోజనం అన్నారు.
దీని గూర్చి నేను ఏమి కామెంట్ చెయ్యను.ఎందుకంటె మా మిత్రులు  ఒకరు
చెప్పినట్లు....''ఒకరు ఒకలా మారటానికి వేయి కారణాలుంటే,ఇంకొరు ఇంకోలా 
ఉండటానికి కోటి కారణాలుంటాయి....'' (raji-fukuoka.blogspot.com )


కాని ఒక మొద్దు పిల్లవాడు ఉంటాడు.యేమిరా హోం వర్క్ చెయ్యలేదు 
అంటాము .పెన్సిల్ లేదు అంటాడు.మళ్ళా పెన్సిల్ ఇస్తాము ....ఇంకా యేమిరా 
అంటే....నోట్స్ అయిపొయింది అంటాడు....నోట్స్ ఇస్తాము....ఇంకా యేమిరా 
అంటే జ్వరం అంటాడు......వాడిలో చెయ్యాలి అనే కోరిక లేక పొతే ఒక కారణం 
తరువాత మరో కారణం పుట్టిస్తూనె  ఉంటాడు....దీనికి  అంతం ఎక్కడ?
మనిషి నైతిక విలువలకు ప్రాధాన్యం పెరిగితే తప్ప.....
కారణాలు చెపుతూనే ఉంటారు.


సన్మానం తరువాత వాళ్ళ ఆదరాభిమానాలను హృదయం లోని జ్ఞాపకాలుగా 
మార్చుకొని సంతోషంగా బస్ స్టాండ్ కి వచ్చేసాము.బ్లాగర్ కళ్యాణ్ గారు 
(kalyan gari blog link ) మాతో బస్ ఎక్కించే దాక ఉన్నారు.ఆప్యాయంగా 
''ఉంటాను అక్కా''అని వీడుకోలు ఇచ్చారు.
నాకు కాలేజ్ లోనే తెలిసింది అందరిని ఈవెంట్ పెట్టుకునేలా ఎంకరేజ్ చేసి
హెల్ప్ చేసింది కల్యాణ్ గారె అని.ఇంత  చిన్న వయసులో ఎంతటి సంస్కారం.


''అవును పైకి చెప్పక పోయినా ఇప్పటి వారిలో స్త్రీలపై గౌరవం భారతీయతా 
శ్వాస నిలిచి ఉన్నాయి''
కాని వారిని సమాజ సేవలో భాగస్తులను చేసేలా ముందుకు నడిపే 
వివేకనందులు లేక పోవటమే లోపం.

Tuesday 6 March 2012

కృతఙ్ఞతలు....చిన్న మాటే....కాని ....

కృతఙ్ఞతలు....చిన్న మాటే....కాని ....

కృతజ్ఞతలు....చిన్న మాటే....కాని దాని అర్ధం మన యొక్క
ఆత్మీయతను మిగిలిన వారికి తెలియ చేస్తుంది.
అలో....అలో....అలో....ఏమిటింత పెద్ద మాటలు చెప్పేస్తుంది
శశి అనుకుంటున్నారా?......ఏమి లేదండి......మరేమో నా
విజిటర్స్ లిస్టు 10000 దాటింది.....అదేమీ పెద్ద విషయం అంటారా?
మరి పుట్టిన బిడ్డకి ఫస్ట్ పుట్టిన రోజు చెయ్యమా....ఎందుకూ ....
అదో ముచ్చట.....మరి నాకిది ఫస్ట్ బ్లాగ్ కదా ...కొత్తగా నేర్చుకోవటం....
అందుకే నేనవరో తెలీక పోయినా చక్కగా నా బ్లాగ్ విజిట్ చేసిన
అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను.
ఇంకా నేను చూసినా బ్లాగ్ లన్నిటిలో ఏదో ఒకటి నేర్చుకున్నాను.
ఇంకా నాకు చాలా మంది స్నేహితులుగా మారి మౌస్ పట్టుకోవటమే
సరిగా రాని నాకు .........వాళ్ళే టీచేర్స్ గా మారి.....రక రకాల తంటాలు
పడి.....ఎక్కడ క్లిక్ చేయాలో ఫోటోలు పంపి....స్టెప్స్ పంపి....నానా తంటాలు
పడి కరస్పాండెన్స్ కోర్స్ లో నా చేత బ్లాగ్ నడిపిస్తున్న మా వాళ్ళందరికీ
కృతజ్ఞతలు.....ఇలాగ థాంక్స్ చెప్పొచ్చని కూడా వేరే వాళ్ళ బ్లాగ్ లోనే
తెలుసుకున్నాను.
ఇంకా నాకు కొందరు ఫాలోయర్స్ గా మారి నన్ను ఎంకరేజ్ చేసారు .


Shobha Raju
kalyan
Gudipudi Gopalkrishna
నందు
రఘు
Deepu
Plus ఎందుకో ? ఏమో !
లక్ష్మీ నరేష్
రాజేష్ మారం...
kalluri sailabala
jeevani
మధురవాణి
indu
kiran
Rajkumar
గీత


renuka చౌదరి
maheshreddy సాయి



''సంతోషం పంచుకుంటే పెరుగుతుంది 
బాధ పంచుకుంటే 
తగ్గుతుంది''

మరి నా సంతోషం పంచుకున్నందుకు గాను మీకు ఈ స్వీట్స్.......

Sunday 4 March 2012

ఏది నీది?.....ఎందుకు కాదు?....చెప్పేది ఎవరు?

''నది లో కుండ ఉంది.దానికి లోపల వెలుపల నీళ్ళు ఉంటాయి.
అటూ ఇటూ ఉన్న నీళ్ళు వేరు కాదు .కుండ ఉన్నంత వరకే బేధం.అదే మాయ.
తాడుని పాము అనుకొనేంత బ్రాంతి. కుండ పగిలితే ఏమి లేదు.
అంతా ఒకటే. ఈ మనిషి,ఈ దేహం,ఈ స్వపర బేధం,నాది నీది అనుకునే 
వెర్రితనం ,అహంకారం ..........అంతా ఆ కుండ లాంటిదే ''

 యెంత చక్కగా చెప్పారు రచయిత.........శంకరాచార్యుల 
తత్వాన్ని అక్షరాల్లో మూసగా పోసి.......చక్కర చిలకల్లాగా 
హృదయాన్ని మెల్లిగా ఆత్మ మూలాలలోకి కలుపుతూ.....
ఈ రోజు సాక్షి ఫండే లో "ఆకెళ్ళ రాఘవేంద్ర" గారి రాలిన మొగ్గలు 
శీర్షికన శంకరాచార్యుల వారిని గూర్చి చూడండి.

మామూలుగా ఎవరు శంకరాచార్యుల గారిని గూర్చి వ్రాసినా 
మొసలి పట్టుకోవటం,వాళ్ళ తల్లి గారి అవసాన దశ లో 
ఆయన రావటం  ఆయన మహిమలు చూపినట్లు వ్రాస్తారు.
కాని వీరు చక్కగా వారి జీవన యానం లో మామూలు 
మనిషిగా చేసినట్లు వ్రాసారు.అది నిజమే వారు వాళ్ళ జీవితం 
లో మామూలుగానే చేస్తారు.మనం అవి తరువాత మహిమలని
గుర్తిస్తాము.అంత చిన్న పిల్లవాడు సన్యాసం తీసుకోవటం....
జ్ఞానపు ప్రచారానికి బయలు దేరటం యెంత గొప్ప విషయం...
   
 రాఘవేంద్ర గారు శంకరాచార్యుల గూర్చి వ్రాయటమే మీ 
కలం చేసుకున్న అపురూప అదృష్టం దాని ముందు ఇంకెంత 
సన్మానం అయినా దిగదుడుపే.
అంతటి అదృష్టాన్ని పొందినందుకు,చక్కని కధనానికి 
మీకు అభినందనలు. 
నాకు నచ్చిన శ్లోకాలు ''భజగోవిందం'' లో 
''సత్సంగత్వే నిస్సంగత్వం 
నిస్సంగత్వే నిర్మోహత్వం 
నిర్మోహత్వే నిశ్చల   తత్త్వం 
నిశ్చల తత్వే జీవంముక్తిహి ''

''మా కురు ధన జన యవ్వన గర్వం 
హరతినిమే షత్ కాల సర్వం 
మాయా మయ మిద మఖిలం హిత్వ
బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా''

''దినయామిన్యావ్ సాయం ప్రాత 
శిశిర వసంతవ్ పునరాయాతః 
కాలః క్రీడతి గచ్చాత్యాయు  
స్తదపి న ముచ్యత్యాశావాయుహు ''

రాత్రిం పవళ్ళు ,ఉదయ సాయంకాలాలు,
శిశిర వసంతాది ఋతువులు ఒక దాని వెంబడి 
ఒకటి వచ్చుచూ పోవుచూ ఉండును.
ఈ విధముగా కాలం క్రీడించుచున్నది.
ఆయువు క్షీనించుచున్నది.
అయిననూ ఆశా పిశాచము మాత్రము నిన్ను 
విడువకనే ఉన్నది.......
 
 

Friday 2 March 2012

జీవితం...సంతోషంగా ఎలా?

అన్నీ ఉంటాయి...కొందరికి కాని ఏదో 
వెలితి ...వొంటరితనం ఎందుకు?


ఎందుకంటె ఏదో చెయ్యాలి అనే తపన లేక పోవటం వలన....
తోటి వారికి ఏమైనా చెయ్యగలం అనే ఆలోచన 
రాక పోవటం వలన.....తెలివిని శక్తిని తమకు మాత్రమె 
వాడుకోవటం వలన......
ఇంకా ముఖ్యంగా తమ జీవితాన్ని సంతోషంగా అయినా 
బాధగా నైన చేసుకోవటం తమ ఆలోచన లోనే ఉంది 
అని తెలుసుకోక పోవటం వలన ........


ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ,పక్క వారికి సాయం 
చేస్తూ ఉండేవారికి ఎప్పుడు సంతోషమే.....


చూడండి భావనని.........