Tuesday 18 August 2015

నవ తెలంగాణా లో నా బ్లాగ్ పరిచయం

నవ తెలంగాణా లో నా బ్లాగ్ పరిచయం 
నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది . 
నవ తెలంగాణా పత్రిక వారు నా బ్లాగ్ పరిచయం వ్రాయడం . 
వ్రాసిన శైలి నాకు చాలా నచ్చింది . 
నా బ్లాగ్ నాకు చిన్న పర్ణ శాల లాంటిది . 
దానిలో ఉన్నవి అన్నీ నాకు అపురూపమే . 

దాని గూర్చి ఇలాగా వ్రాయడం నాదైన ప్రపంచాన్ని 
ఆత్మీయంగా ఇకొకరు పలకరించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది . 
నవ తెలంగాణా థాంక్యు . 
ఇంకా నా బ్లాగ్ నిర్మించడం లో తోడ్పడిన వారు అందరికీ 
నా కృతజ్ఞతలు . 
( blog introduction link here )


''ఛా.. ఎంత బాగా రాయాలనుకున్నానో పుష్కరాల గురించి... 144ఏళ్ళకే మళ్ళీ వచ్చేది అని చెప్పారు. సరే బ్లాగులో రాద్దాం రేపు మా మనవళ్ళు, మనవరాళ్ళు చూసి సంతోషపడతారనుకున్నాను. కాని తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను...'' అంటూ పుష్కరాలలో చనిపోయిన వారి గురించి రాస్తూనే జాగ్రత్తలను కూడా వివరించారు శశికళ గారు తన బ్లాగులో... అంతలా అందరి గురించి ఆలోచించే శశి... ''ఇప్పటికీ నాకు ఏమీ తెలీదు... '' అంటూ బ్లాగుకి ట్యాగ్‌లైన్‌ ఇచ్చుకుంది. ఇదేనేమో ఎంత తెలిసినా ఒదిగి ఉండాలనే. ఈ శశి ప్రపంచం బ్లాగును ఒకసారి సందర్శిద్దామా!
'' సిస్టం వచ్చిన కొత్తలో ఏవైనా మంచి రచనలు చూసినపుడు పత్రికలకు అభిప్రాయాలు పంపేదాన్ని. అప్పుడు మీకు ఇంట్రెస్ట్‌ ఉంటే నా బ్లాగ్‌ చూడండని ఒక మహానుభావుడు తన బ్లాగు ఐడి పంపారు. ఆయనెవరో నాకు తెలీదు. కాని ఇలా ఒక బ్లాగ్‌ లో రచనలు అన్నీ చూడడం మంచి మాధ్యమంగా అనిపించింది. అక్కడ అన్నీ క్లిక్‌ చేసి చూసుకుంటూ నేను కూడా బ్లాగ్‌ మొదలు పెట్టాలనుకున్నాను. కాని ఎలా మొదలుపెట్టాలో నాకు తెలియదు. నెట్‌ సెంటర్‌కి వెళ్ళి అక్కడ అందరినీ అడిగాను. ఎవరూ తెలియదన్నారు. నిరాశగా ఉన్న నాకు.. అప్పుడే వచ్చిన ఆ అబ్బాయిని అడిగి చూద్దాం అనిపించింది. మీకు బ్లాగు గురించి తెలిస్తే చెబుతారా? అని అడిగాను. ఆతను వెంటనే బ్లాగ్‌ ఓపెన్‌ చేసి పోస్ట్‌ లు వేయడం నేర్పించాడు. అలా ఒకొక్కరి సహకారంతో 2011 నుంచి బ్లాగు రాయగలుగుతున్నాను అంటున్నారు శశి.
బ్లాగు దేశ విదేశాల మధ్య తెలుగు వారధిలా ఉంటుంది. కాబట్టి మన అభిప్రాయాల వల్ల ఎవరి గౌరవానికి భంగం కలగకుండా రాయడం మంచిదన్న విషయాన్ని ప్రతి బ్లాగరు నిర్వర్తించే నియమం. అలాగే శశి తన బ్లాగులో సామాజిక అంశాలు, రాజ'కీ'యాలు, పుస్తక పరిచయం, సినిమా పరిచయం, స్ఫూర్తి, మధురిమలు, కబుర్లు, అనుబంధాలు, కథలు... ఇలా ఎన్నో విషయాలను కథల రూపంలో షేర్‌ చేస్తూ... నొప్పించక తానొప్పగ అన్నట్లుగా రాస్తుంటారు.
స్కూలు టీచర్‌గా పనిచేస్తున్న శశికళకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. స్కూల్లో పిల్లలు కథలు చెప్పమన్నప్పుడు అప్పటికప్పుడు కథలను అల్లుతారు కూడా. అంతలా ఇష్టం సాహిత్యం అంటే. అందుకే తన బ్లాగులో ఎన్నో విషయాలు కథల రూపంలోనే ఉంటాయి. అంతేకాదు, ఈమెకు మాట్లాడటం అదే కబుర్లు చెప్పడమంటే చాలా ఇష్టం. ఇష్టమైన సినిమా రోజా, సంగీత దర్శకుడు రెహమాన్‌. రైలు బడి, సుభాష్‌ పత్రి పుస్తకాలంటే ఎంతో ఇష్టం. అంతేకాదు, ఏ విషయమైనా తెలియకపోతే తెలియదని నిజాయితీగా ఒప్పుకుంటే... దాని గురించి నేర్చుకునే అవకాశం ఉంటుందన్న నియమాన్ని ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటానంటున్న
శశికళ ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే వెంటనే  ఇది శశి ప్రపంచం  బ్లాగును సందర్శించండి