Thursday 3 October 2013

లాంతరు చెండు (2 part)

         లాంతరు చెండు (2 part) (yerra arugulu series)             

(lantharu chendu part 1 link )

ఉదయపు ఎండ ఇంకా పెరట్లో పరుచుకోక ఎండాకాలపు 
చిరు చల్లని గాలి హాయిగా బాదం చెట్టు పై నుండి వీస్తూ 
పలకరిస్తూ ఉంది పెరట్లోకి వచ్చిన వాళ్ళు అందరిని . 
ఎంత పెద్ద పెరడు ఇప్పటి వాళ్ళు అయితే ఒక ఇల్లు కట్టేస్తారు
ఏమో దానిలో .
 ''అమ్మమ్మా ఈ రోజు మాకు పూల జడ వేస్తారు 
తెలుసా?'' నిద్ర మత్తు వదలని కళ్ళతో రోలు పై కూర్చుని 
బావి పక్కన పెంకుపంచ లో కూర్చొని ఉన్న అమ్మమ్మకు 
గొప్పగా చెప్పాను . 

మా అమ్మమ్మకు తెలీకుండా జరిగే విషయాలా 
ఇవి ...... కాని మనుమరాలు మాటల్లోని మురిపెం ఆమెకు 
బోలెడు సంతోషం . 

''అలాగే లేవే తల్లి . మావయ్య లేవగానే మల్లె మొగ్గలకు పంపిస్తాను 
ముందు ఆ రోలు దిగు . రోలు పై కూర్చొని తుమ్ముతావో ఏమో ''

''నేను దిగను ''ఎందుకో నాకు నచ్చక పోతే ఎవరు చెప్పినా 
చెయ్యను అంత మొండి . 
''దిగవె తల్లి . మళ్ళీ తుమ్మావే  అనుకో ఆ రోలు మెడలో కట్టి 
తిప్పుతారు ''
''ఎందుకు ?ఎవరికైనా చేసారా ?ఎప్పుడు చేసారు ?''
''నా వల్ల  కాదే తల్లి నీకు చెప్పడం . మీరు పోయి కనకాంబరం 
మరువం తెచ్చుకోరా ?మళ్ళీ ఎండ వచ్చేస్తుంది . పళ్ళు 
తోముకొని వెళ్ళు "

''సరే పండ్ల పొడి ఇవ్వు '' ఇచ్చింది . 
అదేమీ తియ్యగా ఉండదు . కుంకుమ బరిణ  అంత డబ్బాలో 
ఉంటుంది కొంచెం పసుపు పచ్చగా ..... కారం . పేస్ట్ తింటాము 
అని ఇది ఇస్తారు . మా నాయన  దగ్గర మాత్రం కోల్గేట్ పేస్ట్ . 

ఎడమ చేతిలో కొంచెం వేసుకొని గబా గబా కుడి వైపు గోడ ఎక్కి 
కూర్చున్నాను . ఆ గోడకి అవతల వైపు బాదం చెట్టు . కాని సగం 
మా వైపే ఉంటుంది . మళ్ళా గోడ మీద నడుస్తూ పళ్ళు 
తోముకుంటున్నాను . 
''పళ్ళు తోమేటపుడు అలా నడవకూడదు  తల్లి .
ఒక దగ్గర కూర్చో '' 

''నడిస్తే ఏమి అవుతుంది ?నేను నడుస్తాను అంతే ''
''నడిస్తే పాపం అంట . అడుక్కి ఒక్క గుడి కట్టిస్తే పాపం 
పోతుంది అంట ''
చెప్పింది అమ్మమ్మ ఓపిగ్గా ఒక వైపు పని 
చూసుకుంటూ . 

బాబోయ్ అన్ని గుళ్ళే ..... ఎందుకు వచ్చిన బాధ గోడ మీద నుండి 
దూకాను .ధభీమని శబ్దం . 

అమ్మ పరిగెత్తుకొని వచ్చింది . 
''దూకవాకే శశి . నువ్వు ఏమైనా మగ పిల్లవాడివా ?
చెయ్యో కాలో విరిగితే పెళ్లి కూడా చేసుకోరు '' 
మగ పిల్లవాడు అయితే ఏమిటి పెద్ద  . ప్రతి ఒక్కటి అది 
చెయ్యొద్దు ,ఇది చెయ్యొద్దు ,అది పాపం ఇది నేరం . 

'' వనజక్క నువ్వు అనసూయ వాళ్ళ ఇంటికి వెళ్లి కనకాంబరం 
పూలు  కోసుకొని రండి . పూల జడ కి కావోద్దా ?''
చిన్న పోయిన మొహం చూసి అమ్మ బుజ్జగించింది . 

అమ్మమ్మ మావయ్య ని పిలిచి
 ''సుబ్రహ్మణ్యం నువ్వు తూముల దగ్గరకు పోయి 
మూడు లీటర్లు మల్లె మొగ్గలు తీసుకుని రాయ్య . 
పెద్ధక్కకు చెప్పు తొందరగా వంట చేసుకుని రమ్మను . 
వచ్చేటపుడు ఆకు (మరువం )కోసుకొని రమ్మను . పెద్ద జడ 
కదా చాలా కావాలి ''

''అలాగే లేమ్మా . పది గంటలకు పూజ చేసుకొని వెళతాను ''
బావి దగ్గరకు పోయాడు స్నానానికి . మావయ్యకు అప్పటికి 
అప్పుడు చేదుకొని బకెట్ తో పైన పోసుకొని స్నానం చేయడం ఇష్టం . 
''తొందరగా వెళ్ళు ''

పూజ గది లోకి పోయాడు అంటే అది ఒక పెద్ద పని .
 ఒక గోడ అంతా దేవుని ఫోటోలు .
 ''వీర బ్రహ్మేంద్ర స్వామీ ,ఈశ్వరమ్మ ''మిగిలిన 
దేవుళ్ళు ..... రెండు ఫోటోలు భలే ఉండేవి . చూసుకొనే అద్దం మీద
దేవుడి ఫోటో కత్తిరించి అతికించినట్లు .... ఒక దానిపై గోపిక మీద 
కృష్ణుడు హోలీ రంగు పిచ్చికారి చేస్తున్నట్లు ,ఇంకో దానిలో 
పాండురంగడు నడుము పై చేతులు ఉంచి నిలుచుకున్నట్లు . 

ఇవి కాక కింద పీట  మీద ఒక  గుండ్రటి యంత్ర రేకు ,దాని ముందు 
చిన్ని వెండి గొడుగు కింద శంకు ,చక్రాలు . ఈ యంత్రానికి రోజు 
కుంకుమ పూజ చేస్తాడు మావయ్య . మా అమ్మమ్మ కు పిల్లలు 
పుట్టక పోతే పెంచల కోన లో ఒక అవ్వ (యోగిని )ఇచ్చింది అవి . 
ఎన్నో ఏళ్ళుగా అవి పూజ చేస్తూనే ఉంటారు . వీటన్నింటికి పూలు 
పెట్టి పూజ చేసి ఇంకా ఒక గంటకు పైన ధ్యానం చేసి కాని పూజ గది 
నుండి ఇవతలికి రాడు . అప్పటి వరకు ఎంత పని వచ్చినా 
ఎవరం గది తలుపు తీయము . ఇక ఈ రోజు తొందరగా పూజ 
చేసి పూలకు వెళ్ళాలి . 

కావలి లో తూముల దగ్గర వరవ కట్ల మీద పూలు అమ్ముతారు . 
తొందరగా వెళితే రాగానే మొగ్గలు మనకు ఇస్తారు . లేకుంటే 
కర్ర తో మొగ్గలపై మెల్లగా కొడతారు విచ్చుకోవాలి అని . అలా 
కొడితే మనం ఈనె పుల్లలకు గుచ్చితే సరిగా నిలబడవు పూలు . 
జడ నుండి రాలిపోతాయి . 

అందరికి పనులు పంచేశారు .
 నేను వనజ  అక్క
(ఏదో వ్రాస్తున్నాను కాని ఏ రోజు అక్క అనను . 
మా పెదమ్మకి కిషోర్ అన్న పుట్టిన 
తరువాత మా అమ్మకి పెళ్లి అయింది . తరువాత మా పెదమ్మకి 
ఇద్దరు అమ్మాయిలు మళ్ళా అబ్బాయి మళ్ళా అమ్మాయి . 
మా అమ్మకు అంతే . కాకుంటే ఒకటో రెండేళ్ళు  తేడా . అందుకు 
ఎవరి వయసుతో వాళ్ళు ఫ్రెండ్స్ . అక్క అనేది లేదు .ఏమి లేదు )

ఇద్దరం అనసూయ వాళ్ళ ఇంటికి బయలుదేరాము .
 అక్కడ మేమే పూలు కోసుకోవాలి . వాళ్ళు లెక్క పెట్టి డబ్బులు తీసుకుంటారు . 
వంద ఇరవై పైసలు . తెలిసిన వాళ్ళం అయితే డబ్బులు తగ్గించరు కాని 
కొన్ని పూలు అదనంగా ఇస్తారు . లేకుంటే కొంచెం సన్నటి కాడలు 
కల పూలు డిల్లీ కనకాంబరాలు (?)అంటారు అవి పెద్దగా బాగుండవు . 
కాడలు బలహీనం కాబట్టి చెండు కు కుట్టలేము అవి కొన్ని ఊరకనే 
ఇస్తారు .

 ఏమిటో పిచ్చి కాలం . ఆడపిల్లలు ఒంటరిగా బంగారు 
కమ్మలు ,దండలు వేసుకొని వెళ్ళినా  పెద్ద భయం లేదు . 
మేము పది నిమిషాలు పైనే నడిచి రైలు కట్ట దగ్గరకు వెళ్ళాలి . 

ఒక్కో సారి పూలు కోస్తుంటే గూడ్స్ వెళుతూ ఉంటాయి . 
''కూ చిక్ చిక్ '' అంటూ పాములాగా అన్ని పెట్టెలు వెంట వేసుకొని 
వెళుతూ ఉంటె పూలు కోయడం ఆపేసి అపురూపంగా చూస్తూ ఉండేదాన్ని 
మా ఊరికి ట్రైన్ రూట్ లేదు (ఇప్పుడూ లేదు )అందుకు మాకు 
రైలు చూడటమంటే సంతోషం . ఒక్కో సారి టాటా  లు చెప్పేవాళ్ళం . 
మాకు ఉహ తెలిసినాక మా నాయన మాకు తీర్చిన గొప్ప కోరిక 
గూడూరు లో మా పిల్లలు అందరిని రైలు ఎక్కించి కావలి తీసుకొని 
రావడం . రైలు కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న పట్టాలు 
చూస్తుంటే మా నాయన అందరికంటే మంచి నాయన అనిపించాడు . 

గబగబా పూలు కోసుకొని వెళ్ళిపోయాము . మల్లె పూలు వచ్చేసాయి . 
ఆకు కూడా వచ్చింది . ఆడవాళ్ళు ఒక దగ్గరకు చేరి మొదలు పెట్టారు . 
అన్నీ రెడీగా కుట్టుకొని మధ్యాహ్నం పిల్లలకు జడవేసి దాని పై కుడుతారు. 
                                                     (ఇంకా ఉంది ) 


No comments: